అది కరీంనగర్ జిల్లా నూకపల్లి క్రాస్రోడ్డు. అక్టోబరు 19వ తేదీ ఉదయం. కాంగ్రెస్ యువనేత రాహుల్గాంధీ రోడ్షో చేస్తూ చేస్తూ ఒక మొబైల్ టిఫిన్ సెంటర్ వద్దకు పోయిండు. కాలుతున్న గ్రానైట్ బండ మీద అట్టు పోసిండు. ఆ అట్టును ప్లేటులో వేసుకున్నడు. ‘మీరూ తినండి’ అంటూ చుట్టూ ఉన్న కాంగ్రెస్ నేతలకు తలా ఒక ముక్క ఆఫర్ చేసి… బాగా ‘ఆకలి’తో ఉన్నాడేమో, ఎక్కువ తానే తిన్నడు. ఆ తర్వాత ఒకరితో (అతడు మన తెలంగాణ వాడే కావచ్చు) చాక్లెట్ తెప్పించిండు.
అక్కడే ఒక నడి వయస్కురాలి ఒడిలో కూర్చున్న చిన్న పిల్లగాడి ముందు ఆ చాక్లెట్ పెట్టిండు.ఆ పిల్లగాడు ఆశగా చాక్లెట్ తీసుకోవడానికి చేయిసాచిండు. రాహుల్ తన చేయి పక్కకు తీసిండు. పిల్లగాడు నిరాశపడ్డడు. రాహుల్ మళ్లీ చెయ్యి ముందుకు పెట్టిండు. పిల్లగాడు దాన్ని అందుకోవడానికి ప్రయత్నించిండు. రాహుల్ వెనక్కి జరిపిండు. రాహుల్ చాక్లెట్ను ముందుకుపెట్టడం, ఆ పిల్లగాడు అది తనకే అని ఆశపడి అందుకోజూడటం, రాహుల్ అటు పెట్టడం, ఇటు పెట్టడం, అందకుండా చేయడం, ఆ బాబు మోసపోవడం ఇలా అనేకసార్లు జరిగింది.
చివరికి రాహుల్ చెయ్యి ముందుకు జరిపినప్పుడు, ఆ పిల్లగాడు అమాంతం, చటుక్కున, దూకుడుగా అతడి చేతుల్లోంచి చాక్లెట్ను గుంజుకున్నాడు… నోరారా నవ్వుతూ! రాహుల్ కూడా కొంచెం కొంటెగా నవ్వుతూ అక్కడినుంచి వెళ్లిపోయిండు!
చిన్న సంఘటనే కావచ్చు. చిన్న మాటే కావచ్చు. మజాక్గా, తమాషాగానే కనిపించవచ్చు. కానీ అవే మన స్వభావాన్ని పట్టిస్తాయి. లోపలి గుట్టును బయటపెడతాయి. సింపుల్ టెస్ట్ ద్వారా సైకాలజిస్టులు మన వ్యక్తిత్వమేమిటో కనుక్కునే ప్రయత్నం చేస్తారు కదా.. అట్లా! రాహుల్ను చూసిన నాకు రెండు గుర్తుకొచ్చాయి. ఒకటి గతం. రెండు వర్తమానం.
గతమేమిటంటే.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై కూడా కాంగ్రెస్ దాదాపు 60 ఏండ్లు ఇలాంటి ‘చాక్లెట్ ఆటే’ ఆడింది. ఇచ్చీ ఇవ్వకుండా, ఇవ్వకుండా ఇచ్చినట్టు, అనేకసార్లు మజాక్ చేసింది. చిన్నపిల్లలతో చేసినట్టే! దాని ఫలితం వందల ప్రాణాలు పోయాయి, వందల ఏండ్ల వెనకబాటు! చివరికి కేసీఆర్ యూపీఏ ప్రభుత్వం చేతిలోంచి తెలివిగా తెలంగాణ రాష్ర్టాన్ని గుంజుకోగలిగాడు.
‘రాహుల్- చాక్లెట్’ ఉదంతం.. నాకు ‘కాంగ్రెస్- తెలంగాణ’ అనుభవాన్ని గుర్తుచేసింది. ఇది గతం. ఇక వర్తమానం ఏమిటంటారా? అది ఎన్నికల హామీలనే అందమైన చాక్లెట్ను ఎరగా వేసి, అధికారమనే అట్టును ఆరగించే కాంగ్రెస్ ఆలోచనా ధోరణి. ఇక్కడ చాక్లెట్ మనదే. దాన్ని తెచ్చినవాడు మనవాడే. దాన్ని కొనేందుకు పెట్టిన ఖర్చు మనదే. మన దాన్నే మనకు ఆశగా చూపి, మజ్జిగ మనకు పోసి, మీగడ మింగే ధోరణి అది!
ప్రతి జీవికీ, మనిషికీ, పార్టీకీ ఒక స్వభావం ఉంటది. అది పుట్టుగుణం. మారేది కాదు. మార్చాలనుకున్నా, ఏమార్చాలనుకున్న అయ్యే పని కాదు. స్వతంత్ర భారతంలో, రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పుట్టుగుణం ఏమిటో ఈ దేశం 75 ఏండ్ల నుంచీ చూస్తూనే ఉన్నది. తెలంగాణ 60 ఏండ్ల పాటు అనుభవించింది. ఆరు దశాబ్దాల కాంగ్రెస్, తదితర ఉమ్మడి పాలకుల పాలనలో కరెంటు లేదు. ప్రాజెక్టులు లేవు. చెరువుల బాగు లేదు. సాగునీళ్లు లేవు. తాగే నీళ్లు లేవు. దవాఖానాలు లేవు. మెడికల్ కాలేజీలు లేవు. పల్లెలకు రోడ్లు లేవు. పట్టణాల్లో అభివృద్ధి లేదు. మన పండుగలకు ఆదరణ లేదు. చివరికి హైదరాబాద్లో మనింటి ముందు బతుకమ్మ ఆడుకునే స్వతంత్రం లేదు. మన యాసకు గౌరవం లేదు.
మన కళలకు విలువ లేదు. మన ప్రాంతానికి అస్తిత్వం లేదు. మనకు స్వపరిపాలన అధికారం లేదు. మన హైదరాబాద్ డబ్బు మనది కాదు. మన భూములకు కోట్లు కాదు కదా; లక్షలు పలికే పరిస్థితి లేదు. మనకు గోదావరి, కృష్ణా నీళ్లు వాడుకునే అధికారం లేదు. మన పాలమూరు నేలకు పంటలు పండించుకునే యోగ్యత లేదు. మన నల్లగొండకు ఫ్లోరైడ్ లేని నీళ్లు తాగే అర్హత లేదు. మన ఉద్యోగాలు మన పిల్లలకు రావు. మన ముసలవ్వకు పింఛను రాదు. మన ఉద్యోగికి ఉర్దూ మాట్లాడే స్వేచ్ఛ లేదు. మన సిబ్బందికి మంచి జీతం తీసుకునే ముచ్చట లేదు.
ఇన్ని మాటలెందుకు? 60 ఏండ్ల పాటు మనం మనమే కాదు; మనుషులమే కాదు! మనిషి రూపు కట్టిన దుఃఖం మనం! జీవం లేని జీవులం! మన ప్రతినిధులుగా ఉన్న ఇదే కాంగ్రెస్ నాయకులు వలస పాలకులకు బానిసలు! ఇది నిజం కాదా?
పది, పదిహేనేండ్ల కిందట తెలంగాణ ఏమిటో, మన గోసేమిటో, మనం పడ్డ కష్టాలేమిటో, ఇప్పటి టీనేజ్ పిల్లలు చూడకపోవచ్చు. ఉడుకు రక్తం యువకులకు తెల్వకపోవచ్చు. కానీ మనకు తెలుసు కదా! నిన్ననే వచ్చిన 2016 పింఛనుతో సామాను కొనుక్కుని, కడుపునిండా తిని, 24 గంటలు తిరుగుతున్న ఫ్యాను కింద, నులక మంచం మీద పండుకుని, గుప్పెడు గుండె మీద చెయ్యి వేసుకుని వింటే, నిన్నటి సంగతేమిటో మనసు చిన్నగా, చెవిలోనైనా చెప్తుంది కదా!
మరి గత పదేండ్లలో కేసీఆర్ పరిపాలనలో ఏం జరిగింది? కరెంటు కష్టం పోలేదా? సాగునీళ్ల కష్టం పోలేదా? తాగు నీళ్ల కోసం కోసుల కొద్దీ నడిచే కష్టం పోలేదా? మన భూముల విలువ పెరగలేదా? మన ఎవుసం తెరిపిన పడలేదా? మన ఉద్యోగాలు మన పిల్లలకే రావడం లేదా? మన బాసకు, మన యాసకు గౌరవం పెరగలేదా? ప్రపంచం ప్రపంచమే మన బతుకమ్మ ఆడటం లేదా? మన ఉద్యోగికి దేశంలోనే ఎక్కువ జీతం అందలేదా? పాలమూరు వలస కష్టం పారిపోలేదా? నల్లగొండలో ఫ్లోరైడ్ మాయం కాలేదా? మన హైదరాబాద్ అమెరికాను తలపించేలా మారలేదా? మన కళలకు, కళాకారులకు గౌరవం దక్కలేదా? మన రోడ్లు బాగు కాలేదా? మన చెరువుల్లో, చెక్డ్యాముల్లో నిరంతరం నీళ్లు నిండుగ ఉండటం లేదా? తెలంగాణ నడిబొడ్డున సాగరాలు వెలువలేదా? మన ప్రాజెక్టులు పూర్తి కాలేదా? మన పల్లె పట్నం చల్లగా లొల్లులు లేకుండా మారలేదా? ఇట్లా చెప్తూ పోతే ఇంకా ఎన్నో! ఇవన్నీ నిజం కదా! పారే నీళ్లు, ఆగిన కన్నీళ్లు.. మన కన్ను మనకు అబద్ధం చెప్పదు కదా! ఇవాళ్టి తెలంగాణ ఓనర్స్ ప్రైడ్, నైబర్స్ ఎన్వీ!
రాహుల్ ప్రజల మనిషే అయితే, తెలంగాణ కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చిండు? కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలతో ఎంత సాయం చేయించిండు? అప్పుడెప్పుడూ లేని ప్రేమ ఇప్పుడు ఎన్నికల సమయంలోనే ఎందుకు పుట్టుకొచ్చింది? ఎందుకంటే నాడు 2014లో కేంద్రంలో అధికారానికి తెలంగాణ దగ్గరిదారి అవుతుందనుకున్నరు. ఇప్పుడు ఢిల్లీలో మోదీని కొట్టడానికి తెలంగాణ పనికొస్తుందనుకుంటున్నరు. కాంగ్రెస్ ప్రేమ కేంద్రంలో అధికారంపైనే తప్ప, తెలంగాణపై కాదు!
దశాబ్దాల కిందట ఏర్పడి, అనేక వనరులు సమృద్ధిగా ఉన్న రాష్ర్టాలు కూడా తెలంగాణతో పోటీ పడలేక పారిపోతున్న పరిస్థితి. చెప్పినవాటి గురించే చెప్పడం అవసరం లేదు. దేశంలోనే ఎక్కడా లేనన్ని సృజనాత్మక పథకాలు, పింఛన్లు, జీతాలు తెలంగాణలో ఉన్నాయంటే ఆ ఘనతకు కారణం, కారకుడు ఒకే ఒక్కడు… కేసీఆర్! ఆయనకు తెలంగాణ మీద ఉన్న ప్రేమ! తెచ్చిన కొత్త రాష్ర్టాన్ని, జనానికి నచ్చేలాగా, మెచ్చేలాగ పునాది వేయాలన్న సంకల్పం. రాష్ర్టాన్ని సాధించడంతోనే కేసీఆర్ లక్ష్యం నెరవేరలేదు. దాన్ని నిలబెట్టే పనినీ ఆయనే తలకెత్తుకున్నడు.
మనం కొత్త ఇల్లు కట్టుకుంటేనే సవాలక్ష సమస్యలుంటయి. మరి దారి తెన్నూ తెల్వని కొత్త రాష్ర్టానికి! తెలంగాణ ఉద్యమాన్ని తలకెత్తుకున్నప్పుడు కూడా ఎన్ని అడ్డంకులు? ఎన్ని అవమానాలు? ఎన్ని ఓటములు? ఎన్ని ఒడిదుడుకులు? మరి సాధించలేదా! గమ్యాన్ని ఎంచుకోవడం సులువు. చేరుకోవడం కష్టం. ఎందుకంటే ఒక ప్రాసెస్ను అమలుచేసే క్రమంలో ప్రాక్టికల్గా అనేక సమస్యలు వస్తుంటాయి. ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ తెలంగాణను సాధించినట్టే, ఒక్కో అవరోధాన్నీ అధిగమిస్తూ తెలంగాణను ప్రగతి పథంలో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్. అందుకు బలమైన పునాది వేసిండు. దాని ఫలితాలను సమాజం ఇప్పుడిప్పుడే చూస్తున్నది.
ఈ క్రమంలో ఇప్పుడు పదేండ్ల తర్వాత, ఎన్నికల ముంగిట తెలంగాణ మరో మలుపులో నిలిచింది. మన ముందున్నవి రెండే ప్రశ్నలు. మరోసారి రాళ్లు రప్పల డొంకదారిలోకి మర్లడమా? ఇలాగే రాచమార్గంలో ముందుకు సాగడమా? వర్తమానం సవ్యంగా ఉండి, భవిష్యత్తులోకి స్థిరంగా వెళ్లాలంటే గతం నుంచి పాఠాలు నేర్చుకోవడం అవసరం. గతంలేని వర్తమానం లేదు. వర్తమానం లేని భవిష్యత్తు కూడా లేదు.
ఇదివరకు ఏం చేసినం? దానివల్ల ఏం జరిగింది? ఇప్పుడు ఏం చేస్తున్నం? దానివల్ల ఏం జరుగుతది? అనే 4ప్రశ్నలు మనకు మనమే వేసుకుంటే, జవాబు సులువుగానే దొరుకుతది. సమాజాన్ని నడిపించే విద్యావంతులు, ఉద్యోగు లు, ఉపాధ్యాయులు ఆలోచించాల్సిన అంశమిది. తొగుటలో నడి ఎండలో, నిండు బహిరంగ సభలో గౌరవనీయుడైన ఒక ప్రధానోపాధ్యాయుడిని నిలబెట్టి, తెలివి తక్కువ ప్రశ్నలు వేసి, సస్పెండ్ చేసి, అవమానించిన సీఎంల కాలం ఎట్లుండె? ఇప్పుడెట్లున్నది? గతాన్ని మరచిపోవడం ఆత్మద్రోహం చేసుకున్నట్టే !
ఎన్నికల ముంగిట రెండు ప్రశ్నలు మన ముందు నిలుస్తున్నయి. 1.కాంగ్రెస్ ఇస్తున్న హామీలు. 2.పదేండ్ల తెలంగాణలో సమస్యలు. మొదటిదాని గురించి చూద్దాం. రాహుల్గాంధీ తెలంగాణకు ఆరు గ్యారెంటీలు ప్రకటించారు. మరి వాటిని వాళ్లు అధికారంలో ఉన్న దశాబ్దాల కాలంలో దేశంలోగానీ, ఉమ్మడి ఏపీలోగానీ ఎందుకు అమలు చేయలేదు? ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఎందుకు చేయడం లేదు? తామింతకు ముందూ పరిపాలించిన కర్ణాటకలో, మళ్లీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచినా కనీసం, కరెంటైనా ఎందుకు సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు? రైతుల సంగతి సరే, వరల్డ్కప్ క్రికెట్ మ్యాచ్కు సైతం విద్యుత్తు కొరత వల్ల కరెంటు కట్ చేసి ప్రపంచం ముందు దేశం పరువు తీసిన పార్టీ ఇప్పుడు తెలంగాణలో ఎవరి నాయకత్వంలో ముందుకు వస్తుంది? కాంగ్రెస్ అధికారానికి కర్ణాటకను మాడల్గా చూపిస్తున్నప్పుడు, కాంగ్రెస్ అవినీతికి, దుష్పరిపాలనకు కూడా కర్ణాటక మాడల్గా నిలుస్తుంది కదా!
ఈ మౌలికమైన ప్రశ్నలకు జవాబు చెప్పకుండా అట్లు పోస్తా, చాక్లెట్లు ఇస్తా అని కెమెరాల ముందు షో చేస్తే చూసేందుకు మజాక్గానే ఉంటుంది. నమ్మితే తర్వాత బతుకే మజాక్ అయిపోతది. మంథనికి నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించిన, దేశానికి ప్రధానిగా పనిచేసిన, కష్టకాలంలో కాంగ్రెస్ను అధికారంలో నిలబెట్టిన, ఆర్థిక సంస్కరణలతో భారత్ను బతికించిన, ఇందిరమ్మకే రాజకీయం నేర్పిన, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు, తన తాతలాంటి వ్యక్తికి, కనీసం దండ వేసి దండం పెట్టలేని రాహుల్కు తెలంగాణ మీద ప్రేమ, గౌరవం ఉందంటే ఎట్లా నమ్మగలం? జనంలో తిరగడం ముఖ్యమా? జనం సమస్యలు పరిష్కరించడమా? రాహుల్ జనం మనిషే అయితే, తెలంగాణ కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చిండు? కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలతో ఎంత సాయం చేయించిండు? అప్పుడెప్పుడూ లేని ప్రేమ ఇప్పుడు ఎన్నికల సమయంలోనే ఎందుకు పుట్టుకొచ్చింది? ఎందుకంటే నాడు 2014లో కేంద్రంలో అధికారానికి తెలంగాణ దగ్గరిదారి అవుతుందనుకున్నరు. ఇప్పుడు ఢిల్లీలో మోదీని కొట్టడానికి తెలంగాణ పనికొస్తుందనుకుంటున్నరు. కాంగ్రెస్ ప్రేమ కేంద్రంలో అధికారంపైనే తప్ప, తెలంగాణపై కాదు!
ఇక రెండోది… పదేండ్ల తెలంగాణలో సమస్యల సంగతి. కొన్ని సమస్యలున్న మాట వాస్తవం. లోపాలున్న మాటా నిజం. అయితే ప్రగతి అయినా, పథకాలైనా సాపేక్షికమైనవి. సమకాలీనమైనవి. మరి కొలబద్ద ఏమిటి? 2014 కంటే సమస్యలు తగ్గినయా? పెరిగినయా? పదేండ్ల కిందటి కంటే బాగుపడ్డమా? చెడిపోయినమా? సమస్యలను సృష్టించుకుంటున్నమా? పరిష్కరించుకునే దిశగా వెళ్తున్నమా? ప్రత్యేక రాష్ట్రం కోసం 60 ఏండ్లు తండ్లాడి, 13 ఏండ్ల పాటు కొట్లాడిన వాండ్ల్లం, పట్టాలెక్కిన రాష్ర్టాన్ని పరుగులు తీయించడానికి మరికొన్ని పర్యాయాలు ఆగలేమా? కేసీఆర్కు సమయం ఇవ్వలేమా? 60 ఏండ్లుగా సవాలక్ష సమస్యల్లో చిక్కుకుని ఉన్న తెలంగాణను దారిలో పెట్టడానికి కేవలం 10 ఏండ్ల సమయం ఎట్లా సరిపోతుంది? గుడ్డిగా వ్యతిరేకించడం కాదు.. మన వ్యతిరేకతకు ఒక హేతుబద్ధత, ప్రాతిపదిక ఉండాలి కదా! పిల్లలు అడుగుతున్నరని మనం ఓటేయడం కాదు; 2014కు ముందు తెలంగాణ ఎట్లుండెనో పిల్లలకు చెప్పాల్సిన సమయం ఇది!
‘తెప్పలుగ చెరువు నిండిన కప్పలు పది వేలు’ అన్నారు పెద్దలు. దేదీప్యమానంగా వెలుగుతున్న తెలంగాణపై ఇప్పుడు అనేకమంది కండ్లు పడ్డాయి. ఇప్పుడు కర్ణాటక నుంచి కొల్లగొడుతున్నట్టే, రేపు తెలంగాణ నుంచీ మూటలు మళ్లించవచ్చనే ఆశతో మాయ మాటలు చెప్తున్నారు. తెలంగాణ మమ్మల్ని దాటిపోయిందే అన్న అసూయతో కొందరు, మా పెత్తనం పోయిందే అన్న దుగ్ధతో కొందరు, అక్కడ దొరకని ‘డాబు’ను ఇక్కడ వెతుక్కునే ప్రయత్నాల్లో కొందరు, ఉత్తరాదిలో జరిగే నష్టాన్ని తెలంగాణలో పూడ్చుకునే ఎత్తుగడలో కొందరు, అన్న ఇవ్వనిదాన్ని సాధించే ప్రయత్నంలో చెల్లెలు.. ఇప్పుడు అందరి కండ్లూ తెలంగాణపైనే! అందరి టార్గెట్ కేసీఆరే! గతంలో ఏమీ చేయకుండా, రేపు అధికారమిస్తే చేస్తామని చెప్తున్నవారు ఒకరు. మోచేతికి బెల్లం పెట్టి నాకించే వ్యవహారం వారిది. నిన్న చేసింది చూపించి, నేడు ఓట్లడుగుతున్న వాడు కేసీఆర్. ఎవరిని ఎంచుకోవాలనేది మన విజ్ఞత. కేసీఆర్కు ఓటేయకపోతే ఇప్పుడిస్తున్నవన్నీ పోతయా? అన్నది ఒక పిచ్చి ప్రశ్న. ఏదైనా తెచ్చుకోవడం కష్టం పోగొట్టుకోవడం సులువు! 1948లోనే వచ్చిన తెలంగాణను 1956లో ఎంతలో పోగొట్టుకున్నం?!
నేను నడి వయస్సులో ఉన్న తెలంగాణవాసిని, తెలంగాణవాదిని. గతాన్ని, వర్తమానాన్ని పోల్చి చూసుకునే చైతన్యం ఉన్నవాడిని. నేనే కాదు; మొత్తం తెలంగాణ ఇలాంటి చైతన్యం ఉన్నదే. అందువల్లే రెండుసార్లు (1948లో, 2014లో) తెలంగాణను తెచ్చుకోగలిగినం. రెండుసార్లు తెలంగాణ నేత కేసీఆర్నే గెలిపించుకున్నం. ఇప్పుడు జరుగుతున్నవి సాధారణ అసెంబ్లీ ఎన్నికలు కాదు. తెలంగాణకు, దాన్ని లొంగదీసుకోవాలని చూసే శక్తులకు మధ్య జరుగుతున్న యుద్ధం.
తెలంగాణను ఓడించాలని చూసే శక్తులకు, తెలంగాణను గెలిపించాలనుకునే భూమిపుత్రులకు మధ్య జరుగుతున్న యుద్ధం. శత్రువులకు తెలంగాణ చిక్కకుండా నిలువెత్తు అడ్డుగోడై నిలిచి ఉన్నది కేసీఆర్. అందుకే ఆయనే టార్గెట్. ప్రత్యర్థులు అనేక రూపాల్లో ఉండొచ్చు. కానీ ఈసారి అందరి ఇంటెన్షన్ ఒకటే… మన వేలితో మన కంటిని పొడిపించడం! మరి మనం ఆ మాయలో పడతామా? ఇవి అసెంబ్లీ ఎన్నికలు. సోనియా, మోదీ, రాహుల్తో దీనికేం సంబంధం? వాళ్లేమైనా వచ్చి పరిపాలిస్తారా? మంటిపనికైనా ఇంటోడే కావాలని సామెత. కేసీఆర్ ఇప్పటికే రెండుసార్లు ముఖ్యమంత్రి. ఇంకోసారి చేసినా, ఆయనకు ఆ పదవి పాతదే. విషయం కేసీఆర్ సీఎం అవుతాడా కాదా అని కాదు; మనకు కేసీఆర్ సీఎంగా ఉండాలా? వద్దా? అనే!
బీజేపీనా? బీఆర్ఎస్సా? అని కాదు!
మనకు కిషన్రెడ్డి కావాలా? కేసీఆరా?
కాంగ్రెస్సా? బీఆర్ఎస్సా? అని కాదు!
మన సీఎంగా రేవంతా? కేసీఆరా?
ప్రశ్న ఇదొక్కటే!
అట్లు పోస్తా, చాక్లెట్లు ఇస్తా అని కెమెరాల ముందు షో చేస్తే చూసేందుకు మజాక్గానే ఉంటుంది. నమ్మితే తర్వాత బతుకే మజాక్ అయిపోతది. మంథనికి నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించిన, దేశానికి ప్రధానిగా పనిచేసిన, కష్టకాలంలో కాంగ్రెస్ను అధికారంలో నిలబెట్టిన, ఆర్థిక సంస్కరణలతో భారత్ను బతికించిన, ఇందిరమ్మకే రాజకీయం నేర్పిన, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు, తన తాతలాంటి వ్యక్తికి, కనీసం దండ వేసి దండం పెట్టలేని రాహుల్కు తెలంగాణ మీద ప్రేమ, గౌరవం ఉందంటే ఎట్లా నమ్మగలం?జనంలో తిరగడం ముఖ్యమా? జనం సమస్యలు పరిష్కరించడమా?
కర్ణాటకలో, మళ్లీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచినా కనీసం, కరెంటైనా ఎందుకు సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు? రైతుల సంగతి సరే, వరల్డ్కప్ క్రికెట్ మ్యాచ్కు సైతం విద్యుత్తు కొరత వల్ల కరెంటు కట్ చేసి ప్రపంచం ముందు దేశం పరువు తీసిన పార్టీ ఇప్పుడు తెలంగాణలో ఎవరి నాయకత్వంలో ముందుకు వస్తుంది? కాంగ్రెస్ అధికారానికి కర్ణాటకను మాడల్గా చూపిస్తున్నప్పుడు, కాంగ్రెస్ అవినీతికి, దుష్పరిపాలనకు కూడా కర్ణాటకయే మాడల్గా నిలుస్తుంది కదా!
నియోజకవర్గాల్లో అభ్యర్థి ఎవరైనా కావచ్చు. కొందరు అందరికీ నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. మనసు మెచ్చకపోవచ్చు. అట్లని, ఎలుకలున్నయని ఇల్లు కాలవెట్టుకుంటమా?!