దీర్ఘకాలిక ప్రజా సమస్యలపైన సమగ్రమైన అవగాహన కలిగిఉన్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ సమస్యల పరిష్కారానికి ఆయన సూచించే మార్గాలు సులభతరంగానూ, ఆచరణాత్మకంగానూ, క్రియాశీలకంగానూ ఉంటాయని మరోమారు నిరూపితమయింది. ఇటీవల ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కలిసినప్పుడు పై విషయంలో మరింతగా స్పష్టత చేకూరింది.
ముఖ్యమంత్రిని కలవడానికి ప్రగతిభవన్కు వెళ్లే సమయానికి వివిధ రాష్ర్టాలనుంచి ఆయనను కలవడానికి అనేక మంది వచ్చి ఉన్నారు. వారిలో రాజకీయ నాయకులు, జాతీయ రైతు సంఘాల నేతలు, వ్యవసాయరంగానికి చెందిన అనుభవజ్ఞులు, బీఆర్ఎస్కు చెందిన ముఖ్యనేతలు ఉన్నారు. వారితో సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమాలోచనలు జరుపుతున్నారు. వాస్తవానికి తెలంగాణ మత్స్యరంగానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించడానికి అది సరైన సమయం, సందర్భం కాదని నాకనిపించింది. కానీ, తనను కలవడానికి వచ్చిన సందర్శకులతో కేసీఆర్ సహజసిద్ధంగా పాటించే గౌరవ, మర్యాదలను చూసిన తర్వాత ఆయన సందర్భోచిత వ్యవహారశైలికి ఆశ్చర్యపోవడం నా వంతయ్యింది!
అప్పటివరకూ ఎంతో గంభీరంగా చర్చిస్తున్న జాతీయస్థాయి అంశాల నుంచి ఒక్కసారిగా ఆయన తెలంగాణ రాష్ట్ర మత్స్యరంగం సర్వతోముఖాభివృద్ధికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక వైపు మళ్లారు.ఆ విషయమై దాదాపు నలభై నిమిషాలపాటు దిశానిర్దేశం చేయడం తెలంగాణలోని మత్స్యకారుల కుటుంబాల సంక్షేమం, అభివృద్ధి పట్ల కేసీఆర్కున్న చిత్తశుద్ధికి నిదర్శనంగా చెప్పవచ్చు.
అందుకు అనుగుణంగా ‘తెలంగాణ రాష్ట్ర మత్స్యరంగ అభివృద్ధి సంస్థ’ (ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ఏర్పాటును ఒక సాధనంగా ఎంచుకోవడం, ఆ దిశలో సత్వరమే చర్యలు తీసుకోవాలని సంబంధిత మంత్రికి అప్పటికప్పుడు ఆదేశాలివ్వడం ఆహ్వానించదగిన పరిణామం. తెలంగాణ రాష్ట్ర మత్స్యరంగ సర్వతోముఖాభివృద్ధిని సాధించే దిశలో ‘తెలంగాణ రాష్ట్ర మత్స్యరంగ అభివృద్ధి సంస్థ’ మరొక మణిమకుటంగా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రస్తావించిన అంశాలలో ప్రధానమైన విషయాలను తెలంగాణ సమాజానికి అందించడం మన బాధ్యత.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గడచిన ఎనిమిదిన్నరేండ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి వనరుల అభివృద్ధిని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు పరిచింది. దీంతో వ్యవసాయరంగంతోపాటు దానిచుట్టూ అల్లుకున్న అనుబంధ రంగాలు కూడా పునరుజ్జీవనం పొందాయి.
ప్రపంచీకరణ పరిణామాల నేపథ్యంలో కుంటుబడిన కులవృత్తులు దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో పునర్ వైభవాన్ని పొందాయి. అందులో సంప్రదాయ జలవనరులపై ఆధారపడిన చేపల ఉత్పత్తి ప్రధానమైనది. ఒకవైపు సంప్రదాయ చేపల ఉత్పత్తి ప్రక్రియను నిలబెట్టుకొని బలోపేతం చేసుకుంటూనే ఆధునిక ఆక్వాకల్చర్ పద్ధతులను కూడా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉన్నది. ఈ రెండు ప్రధానమైన వైవిధ్యాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర మత్స్యరంగం సర్వతోముఖాభివృద్ధికి ఆచరణాత్మక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలి.
మత్స్యకార కుటుంబాల ఆదాయాలను పెంచడం ద్వారా వారి జీవనప్రమాణాలలో గణనీయమైన పురోగతిని సాధించవలసి ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న ఆధునిక శాస్త్ర సాంకేతిక సౌకర్యాలను అందిపుచ్చుకోవడం ద్వారా మన రాష్ట్ర మత్స్యరంగంలో ఉత్పత్తి, ఉత్పాదకతలను పెంచుకోవాలి. తెలంగాణ బ్రాండ్ చేపలను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని సంపాదించుకోవాలి. మత్స్యరంగంలో వేళ్లూనుకున్న మధ్యదళారీ వ్యవస్థలను రూపుమాపి స్థానికంగానే స్వయంసమృద్ధిని సాధించుకోవలసి ఉన్నది. చేపల ఆహార వినియోగాన్ని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలి. అందుకు అవసరమైన ప్రణాళికలను, పథకాలను రూపకల్పన చేసి అమలుపరచడం కూడా ముఖ్యమైనదే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని గోదావరి, కృష్ణా నదుల్లో లభ్యమయ్యే నీటి వనరులను గరిష్ఠంగా వినియోగించుకోవాలి. దానికోసం ప్రభు త్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా లక్షలాది కోట్ల వ్యయంతో సాగునీటి ప్రాజెక్టులు, వాటికి అనుబంధంగా జలాశయాలను నిర్మిస్తున్నది. వాటిని ఆధునిక పద్ధతుల్లో చేపల పెంపకానికి వినియోగించుకునేందుకు వీలుగా కార్యాచరణ ప్రణాళికలు అమలు పరచాలి.
ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, దానికి అనుబంధంగా పలు జలాశయాలు నిర్మించింది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కొత్తగా మరికొన్ని నీటిపారుదల ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి. వాటికి అనుసంధానంగా నిర్మిస్తున్న రిజర్వాయర్లు, గోదావరి నదిపై దిగువన నిర్మించిన దేవాదుల ప్రాజెక్టు, దానికి అనుబంధ జలాశయాలతో తెలంగాణ పుష్కలమైన జలవనరులతో విరాజిల్లుతున్నది. ఫలితంగా నిలువనీటి ఆధారంగా అభివృద్ధి పరచుకొనే మత్స్యసంపద లక్షలాదిమంది మత్స్యకార కుటుంబాలకు అదనపు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నది. ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరి నదిపై నిర్మించిన బ్యారేజీల వల్ల గోదావరి నదీ గర్భంలోనే సుమారు 62 టీఎంసీల నిలువనీరు (బ్యాక్ వాటర్స్) ఆధునిక పద్ధతుల్లో చేపల పెంపకానికి అనువుగా అందుబాటులోకి వచ్చింది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంతో కాళేశ్వరం నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరకు గోదావరి నది ఎప్పుడూ నిండుకుండలా జలకళ లాడుతున్నది. దీనివల్ల మత్స్యసంపదను గణనీయంగా వృద్ధి చేసుకొనే అవకాశాలు మరింత మెరుగయ్యాయి. దీన్ని మత్స్యకార కుటంబాలు సద్వినియోగం చేసుకోవాలి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి సుమారు రెండున్నర లక్షలుగా ఉన్న గుర్తింపు పొందిన మత్స్యకారుల సంఖ్య 2022 సంవత్సరాంతానికి మూడున్నర లక్షలకు చేరుకున్నది. రెండోదశలో మరో లక్ష మందికి మత్స్యకారుల సొసైటీలలో కొత్తగా సభ్యత్వాలను కల్పించేందుకు మత్స్యశాఖ ప్రయత్నిస్తున్నది. మత్స్యకారులు గతంలోలాగా కేవలం చెరువుల్లో చేపలు పట్టడానికి మాత్రమే పరిమితం కాకుండా, తమ కార్యకలాపాలను ఏడాది పొడవునా నిర్వహించుకుని ఉపాధి పొందేందుకు వీలుగా నీటి పారుదల అవకాశాలు మెరుగు పడుతున్నాయి.
దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఉపరితల జలవనరుల విస్తీర్ణంలో సుమారు ఏడు లక్షల హెక్టార్ల నీటి విస్తీర్ణంతో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలుస్తున్నది. మత్స్యరంగానికి సంబంధించిన సర్వతోముఖాభివృద్ధికి పైన పేర్కొన్న కార్యాచరణ ప్రణాళికలను అమలు పరిచేందుకు పటిష్ఠమైన వ్యవస్థను రూపొందించుకోవాలి. దేశవ్యాప్తంగా అనేక రాష్ర్టాలలో ఉనికిలో ఉన్న ‘మత్స్యరంగ అభివృద్ధి సంస్థ’ను ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణలోను మత్స్యరంగ కార్యకలాపాలను విస్తరించుకునే అవకాశం ఉన్నది.
సంప్రదాయ పద్ధతితో పాటు ఆక్వాకల్చర్ రంగాన్ని అభివృద్ధి చేసుకోవడం ద్వారా చేపల ఉత్పత్తి, ఉత్పాదకత, చేపల వినియోగం, ఎగుమతులను పెంచుకోవచ్చు. తద్వారా స్వయంసమృద్ధిని సాధించడంతో పాటు మత్స్యకారుల ఆదాయాలను పెంచుకొనవచ్చు. మత్స్యకారుల జీవనప్రమాణాలను మెరుగు పరుచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న’ మత్స్యరంగ అభివృద్ధి సంస్థ’ (ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ఇతోధికంగా ఉపయోగపడుతుందనడంలో సందేహంలేదు. ఈ దిశలో ఎంతో ముందుచూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ ‘ఫిషరీస్ కార్పొరేషన్’ ఏర్పాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టడం ఆహ్వానించదగ్గ పరిణామం!
(వ్యాసకర్త ’తెలంగాణ ఫిషరీస్ సొసైటీ’ వ్యవస్థాపక అధ్యక్షులు)
-పిట్టల రవీందర్
99630 62266