2024 లోక్సభ ఎన్నికలకు మరో ఏడాది ఉండగానే దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో 303 లోక్సభ స్థానాలు గెలిచి వరుసగా రెండవసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చి బలమైన రాజకీయశక్తిగా ఎదిగిన బీజేపీని ఓడించాలనే వ్యూహాలకు విపక్షాలు పదును పెడుతున్నాయి. మిగతా విపక్షాలకు భిన్నంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో దేశవ్యాప్తంగా బీజేపీని ఎదుర్కోటానికి 22 ఏండ్ల కిందట రాష్ట్ర సాధన కోసం ఏర్పాటుచేసిన తన పార్టీ పేరును ‘భారత రాష్ట్ర సమితి’గా మార్చి ముందుకు రాబోతున్న నేపథ్యంలో పార్టీ విస్తరణకు మహారాష్ట్రను వేదికగా మలచబోతున్న ఛాయలు కనపడుతున్నాయి.
బీఆర్ఎస్ విస్తరణకు, బలోపేతానికి కేసీఆర్ ఒకవైపు రైతు కార్మిక సంఘాలతో, విషయ నిపుణులతో, మేధావులతో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు వివిధ రాష్ర్టాల్లోని రాజకీయంగా బలమైన నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తూ ముందుకెళుతున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తన మొదటి రాష్ట్ర శాఖను మరో తెలుగు రాష్ట్రమైన ఏపీలో ప్రారంభించింది. అలాగే ఒడిశా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ అతని అనుచరులు బీఆర్ఎస్లో చేరటంతో ఒడిశాలో కూడా బీఆర్ఎస్కు కొంత పట్టు దొరికినట్లుగానే కనబడుతున్నది. కానీ, తెలంగాణ తర్వాత మహారాష్ట్రలో బలమైన పునాదులు నిర్మించుకునే దిశగా బీఆర్ఎస్ అడుగులు వేస్తున్నది.
2001లో ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ ఏర్పాటైన తర్వాత సమైక్యాంధ్రప్రదేశ్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి తెలంగాణ ప్రాంతంలో తన బలాన్ని నిరూపించుకున్నది. ఆ ఫలితాలు టీఆర్ఎస్ సంస్థాగతంగా బలపడటానికి ఉపయోగపడ్డాయి. కాబట్టి అదే తరహా రాజకీయ వ్యూహంతో మహారాష్ట్రలో జరగబోతున్న స్థానికసంస్థల ఎన్నికల్లో పోటీ చేయటం ద్వారా ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ విస్తరణకు తన బలాన్ని అంచనా వేసుకోవడానికి కేసీఆర్కు ఒక అవకాశం దొరుకుతుంది. కేసీఆర్ దేశ రాజకీయాలను ప్రభావితం చేయటానికి ప్రత్యామ్నాయ జాతీయ రాజకీయ శక్తిని ఏర్పాటుచేసే క్రమంలో దేశ రాజకీయాల్లో నిలదొక్కుకోగలడా? అన్ని రాష్ర్టాల్లో పోటీ చేస్తాడా? వంటి అనేక రకాల ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కానీ, కేసీఆర్ రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకుంటున్న వ్యక్తి కాదు, రాజకీయ ఎత్తుగడల్లో వ్యూహాల్లో ఆయన అందెవేసిన చేయి. కాబట్టే కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ నెలకొన్నది.
కర్ణాటక శాసనసభ ఎన్నికల నుంచి తప్పుకొని, అనుకూల అవకాశాలున్న మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ విస్తరణకు నడుం బిగించినట్టుగా కనిపిస్తున్నది. తెలంగాణతో సరిహద్దు గల ప్రాంతాలతో పాటు తెలుగు ప్రజలు అధికంగా ఉన్న లాతూర్, నాందేడ్, యావత్కాల్, చంద్రపూర్, సోలాపూర్, ఔరంగాబాద్, ఉస్మానాబాద్, బీడ్నాసిక్ లాంటి ప్రాంతాలపై దృష్టిపెట్టి మరొకవైపు పెద్దఎత్తున రాజకీయ పలుకుబడి కలిగిన నేతలను చేర్చుకోవడం ద్వారా విస్తరణ అవకాశాలకు పదును పెడుతున్నారు. ఇప్పటికే రైతు ఉద్యమనేత శరత్జోషి, అభయ్ కైలాస్రావు, దిలీప్గోరి, సయ్యద్ అబ్దుల్, ఖలీల్ మౌలానా, శంకరన్న డోంగే, సంగీత బొంబల్, ఔరంగాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ ఫిరోజ్ఖాన్తో పాటు మరికొంత మంది ద్వితీయశ్రేణి నాయకులు, గ్రామపంచాయతీ ప్రెసిడెంట్లు బీఆర్ఎస్లో చేరారు. ఇలా ప్రతిరోజు మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ రాజకీయంగా బలపడుతున్నట్టుగానే కనపడుతున్నది.
మహారాష్ట్రలో బీఆర్ఎస్ బలపడటానికి ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ రైతు అజెండా ఉపయోగపడుతుందని కేసీఆర్ గాఢంగా విశ్వసిస్తున్నారు. దీన్ని బలపరిచేవిధంగానే షెట్కార్ రైతు ఉద్యమ నాయకుడైన శరత్ జోషి బీఆర్ఎస్ పార్టీలో చేరటంతో మహారాష్ట్ర రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు కేసీఆర్ పరిష్కారం చూపించగలుగుతారనే నమ్మకం పెరిగింది.
రైతు సంఘాలకు, నాయకులకు, రైతులకు లాభం చేకూరేవిధంగా కేసీఆర్ ప్రతిపాదిస్తు న్న అజెండా ఉండటం బీఆర్ఎస్కు సానుకూలమైన రాజకీయ వాతావరణాన్ని ఏర్పరుస్తున్నది. మార్చిలో వేలాది మంది రైతులు భారత్ కిసాన్ సంఘ్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ ఆధ్వర్యంలో రైతు రుణాలు మాఫీ చేయాలని, విద్యుత్తు చార్జీలు తగ్గించాలని, ఉల్లికి కనీస మద్దతు ధర కల్పించాలని, పంట నష్టపరిహారం చెల్లించాలని నాసిక్ నుంచి ముంబై వరకు లాంగ్మార్చ్ నిర్వహించారు. 2018లో కూడా మహారాష్ట్రలో రైతులు సమస్యల పరిష్కారం కోసం ఇదేవిధమైన లాంగ్మార్చ్ నిర్వహించారు.
కాబట్టి మహారాష్ట్రలో రైతులు వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యలకు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పరిష్కారం చూపించగలుగుతుందనే నమ్మకం కల్పించడం ద్వారా మహారాష్ట్రలో విస్తరించడానికి బీఆర్ఎస్ బలమైన ప్రయత్నాలు చేస్తున్నది. రైతుబంధు, రైతులకు ఉచిత విద్యుత్, రైతు బీమా పథకాలతో రైతులను ఆకర్షించాలనేది కేసీఆర్ ఎత్తుగడ. మహారాష్ట్రలో సహకార చక్కెర ఫ్యాక్టరీలు ఇచ్చిన మద్దతుతో మరాఠా యోధుడు శరద్ పవార్ మహారాష్ట్ర రాజకీయాలను శాసించేవిధంగా ఎదిగిన క్రమంలోనే రైతు అజెండాతో మహారాష్ట్ర రాజకీయ చిత్రపటంపై బలమైన పునాదులను నిర్మించుకోవాలనేది కేసీఆర్ రాజకీయ వ్యూహంగా కనిపిస్తున్నది.
మహారాష్ట్రలో బీఆర్ఎస్ విస్తరించడానికి, బలపడటానికి ఉన్న రాజకీయ పరిణామాలు, రాజకీయ అస్థిరత రాజకీయ కూటములు కలిసివస్తాయని కేసీఆర్ భావిస్తున్నారు. 1995 తర్వాత మహారాష్ట్రలో ఏ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమై న కనీస మెజారిటీ (144 సీట్లు) సాధించలేకపోతున్నది. బీజేపీ, శివసేన సంకీర్ణ ప్రభుత్వం లేదా కాంగ్రెస్, ఎన్సీపీల సంకీర్ణ ప్రభుత్వాలే మహారాష్ట్రలో ఏర్పాటవుతున్నాయి. 2019లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఏ పార్టీ కి మెజారిటీ రానిపక్షంలో ఇప్పటికే ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో ప్రభుత్వం కూలిపోయి 3వ ప్రభుత్వం ఏర్పాటైన రాజకీయ అస్థిర పరిస్థితుల్లో భవిష్యత్తులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహారాష్ట్రలో మూడో కూటమి ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్, ఎంఐఎం, మహారాష్ట్ర నవనిర్మాణ సేన, సమాజ్వాదీ పార్టీ, ప్రకాశం అంబేద్కర్ పార్టీ, వామపక్షాలు మూడవ కూటమిగా ఏర్పడి మహారాష్ట్ర రాజకీయాలపై తమ బలాన్ని చూపెట్టే అవకాశాలు లేకపోలేదు. కేసీఆర్కు ఉద్దవ్ ఠాక్రే శరద్ పవార్లతో ఉన్న సాన్నిహిత్యంతో మహారాష్ట్రలో కాంగ్రెస్ను, బీజేపీని ఒంటరి చేసే అవకాశం కూడా ఉందనేది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆప్ తన రాజకీయ ప్రస్థానాన్ని ఢిల్లీ నుంచి ప్రారంభించి పంజాబ్ మీదుగా గోవా, హిమాచల్ప్రదేశ్, గుజరాత్లకు విస్తరించి జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన విధంగానే బీఆర్ఎస్ కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి మహారాష్ట్ర మీదుగా తన విస్తరణ ప్రణాళికలను రచిస్తున్నది. ఇప్పటికే మహారాష్ట్రలో నాందేడ్, లోహల్లో భారీ బహిరంగసభలు నిర్వహించి ఔరంగాబాద్, సోలాపూర్లలో కూడా బహిరంగసభలు నిర్వహించటానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతున్నది.
రైతు అజెండాతో రైతుల మద్దతు, దళితబంధు పథకంతో దళితుల మద్దతు పొంది మహారాష్ట్రలోని మొత్తం 36 జిల్లాల్లో 15 నుంచి 16 జిల్లాల్లో విస్తరించవచ్చని కేసీఆర్ నమ్ముతున్నారు. అదే నిజమైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో తన బలాన్ని నిరూపించుకొని దేశ జనాభాలో రెండవ అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్ర రాజకీయాలపై బీఆర్ఎస్ తనదైన ముద్ర వేసుకునే అవకాశం కనబడుతున్నది.
రైతు అజెండాతో రైతుల మద్దతు, దళితబంధు పథకంతో దళితుల మద్దతు పొంది మహారాష్ట్రలోని మొత్తం
36 జిల్లాల్లో 15 నుంచి 16 జిల్లాల్లో విస్తరించవచ్చని కేసీఆర్ నమ్ముతున్నారు. అదే నిజమైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో తన బలాన్ని నిరూపించుకొని దేశ జనాభాలో రెండవ అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్ర రాజకీయాలపై బీఆర్ఎస్ తనదైన ముద్ర వేసుకునే అవకాశం కనబడుతున్నది.
– డాక్టర్ తిరునహరి శేషు
98854 65877
(వ్యాసకర్త: రాజకీయ విశ్లేషకులు)