కేసీఆర్ రాజకీయ మహా ప్రస్థానంలోంచి వచ్చిన భారత రాష్ట్ర సమితి మహా ప్రభంజనం సృష్టించబోతుంది.
సిద్దిపేట నుంచి ప్రారంభమై న్యూ ఢిల్లీ సింహాసనం వరకు సాగుతున్న ఈ మహా ప్రస్థానంలో ఎన్నో పోరాటాలు, ఆరాటాలు, మైలురాళ్లు.
2001లో కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండులో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు ఉప్పెనలా తరలివచ్చిన జనం కేసీఆర్లో తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన తెలంగాణ రాష్ర్టాన్ని సాధించే తెలంగాణ సాధకున్ని చూశారు. పదమూడేండ్లు మడమ తిప్పని పోరాటంతో తెలంగాణను సాధించిన తర్వాత బంగారు తెలంగాణ నిర్మాతనూ చూశారు. తెలంగాణ తాగునీటి సమస్యను, సాగునీటి సమస్యను అవలీలగా పరిష్కరించిన అపర భగీరథున్ని చూశారు. ముఖ్యమంత్రిగా రాష్ర్టాన్ని దేశానికే మాడల్గా నిలిపిన అపర చాణుకుణ్యుడిని చూశారు.
తొమ్మిదేండ్ల పాలనలో తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో సాధించిన ప్రగతి, వ్యవసాయాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి దేశాన్నంతటినీ ఆకర్షించి అనుసరించేలా చేస్తున్నది. 75 ఏండ్ల స్వతంత్రభారతంలో దేశాన్నేలిన జాతీయ పార్టీలు దేశ మౌలిక సమస్యలేవీ పరిష్కరించలేకపోయాయి. సామాజిక సమస్యలను మరింత కఠినతరం చేశాయి. కాంగ్రెస్ పాలనలో దేశం ‘తాకట్టులో భారతదేశం’ అనే స్థితికి చేరితే బీజేపీ పాలనలో ‘అమ్మకానికో దేశం’ అనేంత పరాయికరణకు గురవుతున్నది. ద్వేషాన్ని పెంచడం, మత సామరస్యాన్ని దెబ్బతీయడం, దేశ నీటి సమస్యను కూడా పరిష్కరించకపోవడం, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడం, రైతు బతుకును అద్వాన్నపుటడవిలోకి నెట్టడం లాంటివి జరిగాయి తప్ప మానవ వనరులను ఉపయోగించుకొని అభివృద్ధి పథాన్ని నిర్ణయించుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో యావత్ భారత ప్రజానీకం తెలంగాణపై ఆశలు పెట్టుకున్నది. కేసీఆర్ అభివృద్ధి మాడల్ దేశానికే అదర్శప్రాయమైన విషయం అర్థమైంది. తెలంగాణ పోరాట సమయంలో రాష్ట్రసాధన సమస్యను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన కేసీఆర్ ఈ తొమ్మిదేండ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధి నమూనాను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేర్చారు.
అందువల్ల దేశంలోని చాలా రాష్ర్టాల నుంచి జాతీయ పార్టీ పెట్టమని కేసీఆర్పై ఒత్తిడి పెరిగింది. దేశవ్యాప్తంగా రైతు సంఘాల నేతలు కేసీఆర్ను కలిసి రైతు సమస్యలు మానిఫెస్టోగా పార్టీ పెట్టాలని ఒత్తిడి చేశారు. రైతుల ఆందోళనకు మద్ధతు పలుకడం, పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకించడం, ఎల్ఐసీ లాంటి సంస్థలను కూడా ప్రైవేటీకరించడం, మిలిటరీలోనూ ప్రైవేట్ జోక్యాన్ని అనుమతించిన కేంద్ర ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించి సామాన్య ప్రజల పక్షాన నిలబడటం లాంటి అనేక చర్యల వల్ల కేసీఆర్ దేశ ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. దశాబ్దాలుగా ఆపరిష్కృతంగా ఉన్న రైతు సమస్యలు, రాష్ర్టాల మధ్య నీటి పంపకం, సాగునీటి ప్రాజెక్టుల, పర్యావరణ పరిరక్షణ సమస్యలతోపాటు ఇంకా అనేక సమస్యలు పరిష్కరించే నాయకుడుగా యావద్భారత ప్రజలకు కేసీఆర్ కనబడ్డారు. తెలంగాణ అభివృద్ధి మాడల్ గుజరాత్ కార్పొరేట్ మాడల్లా కాదు. ప్రజల మాడల్, మానవీయ మాడల్, సామాన్య మానవుని హృదయానికి హత్తుకునే మనిషి మాడల్.
కుల, మత ప్రాంతాలకతీతంగా మతసామరస్యాన్ని కాపాడుతూ, ప్రజలకు రోటీ, కప్డా, ఔర్ మకాన్, ఆత్మ గౌరవం అందించే తెలంగాణ మాడల్ను దేశమంతటికీ వర్తింపజేయడానికే యావద్భారత ప్రజల అభీష్టం మేరకు భారత రాష్ట్ర సమితి ఏర్పడింది. ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జనంతో
దద్దరిల్లిపోయింది. ఖమ్మంకు తరలివచ్చిన జనసంద్రం, వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన
నాయకులు, సభ తర్వాత ప్రగతి భవన్లో చేరికలు భారత రాష్ట్ర సమితికి ఉజ్వల భవిష్యత్తు ఉందన్న విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా రైతుల మద్దతు బీఆర్ఎస్ దేశమంతటా విస్తరిస్తుందన్న సత్యాన్ని మన ముందు ఉంచుతున్నది. ఎజెండా లేని జాతీయ పార్టీల కంటె స్పష్టమైన జాతీయ స్థాయి ఎజెండాతో బరిలోకి దిగుతున్న బీఆర్ఎస్కు దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తుంది.
రైతు బంధు, రుణమాఫీ, పంటలబీమా లాంటి పథకాలతో వ్యవసాయం దండుగ అనే స్థాయి నుండి వ్యవసాయం పండుగ అనే స్థాయికి తెలంగాణ వ్యవసాయం నడుస్తున్నది. కాళేశ్వరం, అనుబంధ ప్రాజెక్టులతో, సాగునీటి సమస్య, మిషన్ భగీరథ, కాకతీయలతో తాగు, సాగు నీటి సమస్యలు దూరమౌతున్నాయి. తెలంగాణలో విజయవంతమైన ఈ పథకాలను దేశవ్యాపం చేస్తే దేశంలో సస్యవిప్లవం వచ్చి విదేశాల నుండి దిగుబడి చేసుకొనే అవసరం ఉండదు. కేసీఆర్ నలభై ఏండ్ల రాజకీయ మహాప్రస్థానంలోంచి వచ్చిన భారత రాష్ట్ర సమితి భారతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టించడం ఖాయం. కేసీఆర్ చాణక్య రాజకీయాలు దేశాన్ని మలుపు తిప్పనున్నాయి.
సర్వమత సౌభ్రాతృత్వం, లౌకికత్వం, రైతు రాజ్యం, బడుగుల సంక్షేమం, రాజ్యాంగ పరిరక్షణ, అందరికీ కూడు, గుడ్డ, నీరు, ఇల్లు, ఆదాయ మార్గాలివ్వడం కేసీఆర్ ధ్యేయం. ఆయన నాయకత్వంలో ఏర్పడిన బీఆర్ఎస్ భారత రాజకీయాల్లో కచ్చితంగా మౌలిక మార్పులను తీసుకొస్తుంది. బీజేపీని గద్దె దింపి ఢిల్లీ సింహాసనం అధిష్ఠించడానికి అర్హతలు, బలమైన ఎజెండా బీఆర్ఎస్, కేసీఆర్కు ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం.
-డా. కాలువ మల్లయ్య
91829 18567