2014 ఫిబ్రవరి 20- తెలంగాణ చరిత్రలో మరుపురాని రోజు. అప్పటికే లోక్సభ ఈ బిల్లును ఆమోదించిన సందర్భంలో ఆంధ్ర సభ్యులు నానా గందరగోళం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ బిల్లు రాజ్యసభ ఆమోదానికి వచ్చినపుడు తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. దేశ విదేశాల్లోని తెలంగాణ బిడ్డలు ఆందోళనతో ఊపిరి బిగపట్టి చూస్తున్న సందర్భమది. ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఆందోళన చెప్పనలవికాదు. తన ప్రయత్నాలను తీవ్రంగా సాగించారు. ఉద్వేగభరిత సన్నివేశంలో తెలంగాణ బిల్లును ఫిబ్రవరి 20న రాజ్యసభ కూడా ఆమోదించింది. పార్లమెంట్ ఆమోదం పొందడంతో తెలంగాణ ప్రజల సంబురాలు అంబరాన్నంటాయి.
ఆనాడు తెలంగాణను ఆంధ్రతో విలీనం చేయడానికి ముందు పార్లమెంట్ భవన సమీపంలోని హైదరాబాద్ హౌజ్లోనే 1956 ఫిబ్రవరిలో సరిగ్గా 20వ తేదీనే ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’ పై సంతకాలు జరిగాయి. 57 ఏండ్ల తర్వాత 2014లో ఫిబ్రవరి 20న ఆంధ్ర నుంచి తెలంగాణ వేరు పడాలనే నిర్ణయం జరిగింది. ముడిపడ్డ రోజే వేరు పడటం యాదృచ్ఛికమే.
తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన సొంత రాష్ట్ర ఏర్పాటును పార్లమెంటు ఆమోదించడం చరిత్రలో మరుపు రాని రోజు. హోం మంత్రి సుశీల్కుమార్ షిండే లోకసభలో ఫిబ్రవరి 13న తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టారు. అంతలోనే టీడీపీ సభ్యుడు ఎం పీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి లోకసభ కార్యదర్శి టేబుల్ పై మైకు విరగ్గొట్టాడు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సోనియాకు, ప్రధానికి, స్పీకర్కు రక్షణ వలయంగా నిలబడ్డారు. కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ముందుగా టేబుల్ పై గ్లాసు పగులగొట్టి, పెప్పర్ స్ప్రేను స్పీకర్ పై, సభ్యులపై చిమ్మారు. స్పీకర్తో సహా పలువురు ఎంపీలు అస్వస్థతకు గురయ్యారు. సభను వాయిదా వేసిన స్పీకర్ ఈ ఘటన పై తీవ్రంగా స్పందించారు. ‘షేమ్ ఆన్ పార్లమెంటరీ డెమోక్రసీ’ అని మీడియా ముందు వ్యా ఖ్యానించారు. కొద్ది సేపటికే సభను తిరిగి ప్రా రంభించి 16 మంది సీమాంధ్ర ఎంపీలతో పా టు తెలంగాణ ఎంపీలైన పొన్నం, గుత్తాను ఫిబ్రవరి 20 దాకా స్పీకర్ సస్పెండ్ చేశారు. ‘పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక చీకటి రోజు’ అని జాతీయ మీడియా వ్యాఖ్యానించింది. విభజన తప్పదని తెలిసి తమ ప్రాం తానికేం కావాలో అడగకుండా ‘ఏం చేసైనా విభజనను ఆపుతామని’ ఆంధ్ర నేతలు భావించడం వారి మూర్ఖత్వానికి నిదర్శనం.
సభను ప్రారంభించడానికి కొద్ది నిముషాలకు ముందు స్పీకర్ మీరాకుమార్ ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ను తన ఛాంబర్ కు పిలిచి మాట్లాడారు. స్పీకర్ అడిగిన ప్రశ్నలకు సుష్మా స్వరాజ్ సంతృప్తికరమైన సమాధానాలిచ్చారు. బీజేపీ అగ్రనేత అద్వాని తన పార్లమెంటరీ కార్యాలయం లోనే ఉండి పరిణామాలను గమనిస్తున్నారే తప్ప సభలోనికి రావడం లేదు. అయినా తెలంగాణ బిల్లుకు మద్దతిస్తామని తెలిపారు. మరోపక్క కేసీఆర్ సభలో పరిణామాలను గమనిస్తూ తెలంగాణ ఎంపీలకు, టీఆర్ఎస్లో చేరిన సీనియర్ కాంగ్రెస్ నేతలకు సూచనలనిస్తూ వచ్చారు. వీరంతా అప్పటికే స్పీకర్ మీరాకుమార్ను బిల్లు పెట్టాలని ప్రార్ధించారు. సభ ఆర్డర్లో లేనప్పుడు బిల్లు పెట్టడం సాధ్యంకాదని పార్లమెంటరీ వ్యవహారాలమం త్రి కమలనాథ్, ప్రతిపక్షనేత సుష్మా స్వరాజ్ స్పీకర్కు తెలిపారు. జైపాల్రెడ్డి ఇలాంటి సందర్భంలో స్పీకర్కు గల అధికారాలను గుర్తు చేస్తూ ఆర్టికల్ 367 (3) ద్వారా ఓటింగ్ అవసరం లేకుండానే బిల్లుకు మద్దతిచ్చే సభ్యులు, పార్టీల ఎంపీల తలలు లెక్కిస్తే (హెడ్ కౌంట్) సరిపోతుందని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల సంఖ్యే మూడింట రెండొంతులకు పైగా ఉందని, బిల్లు ఆమోదానికి సింపుల్ మెజారిటీ చాలని సూచించారు.
బిల్లు పై మాట్లాడవలసిందని హోం మంత్రి షిండేను స్పీకర్ కోరారు. అనంతరం ప్రతిపక్షనేత సుష్మా స్వరాజ్ కు అవకాశం ఇచ్చారు. ఆ తరువాత జైపాల్రెడ్డిని మాట్లాడమని సోని యా సూచించారు. రెండు ప్రధాన పార్టీలు బిల్లుకు మద్దతివ్వడంతో మూజువాణి ఓటుతో లోకసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారు. ఈ బిల్లుపై మజ్లిస్, బీజేపీ, ఇతర పార్టీలు చేసిన సుమారు 38 సవరణలన్నీ తిరస్కరించబడ్డాయి. ప్రతి సవరణపైనా ఓటింగ్ జరిగింది. విపక్షాల సవరణలన్నీ వీగిపోయాయని మంత్రి నారాయణ స్వామి ప్రకటించారు.
దీంతో సంతోషంగా సభలోనుంచి బయటికి వచ్చారు తెలంగాణ ఉద్యమనేత, ఎంపీ కేసీఆర్. తెలంగాణ ఎం.పీలంతా సంబురంగా సభ బయట ఉన్నవారిని ఆలింగనం చేసుకున్నారు. ఆంధ్ర ఎంపీలకు తెలంగాణ బిల్లును రాజ్యసభలో అడ్డుకుంటామనే ఆశ ఇంకా పోలేదు. ఏదో ఒక సవరణను రాజ్యసభ ఆమోదించేలా చేస్తే చాలు. ఆ బిల్లు లోక్సభలో ఓటింగ్కు వెళ్ళాల్సి ఉంటుంది. అప్పటికే 15వ లోక సభ రద్దయింది. వచ్చే ప్రభుత్వం నరేంద్ర మోదీదే అయితే ఆయన తెలంగాణ ఏర్పాటు కు వ్యతిరేకంగా ఉన్నారు. ఇదే జరగాలని వెంక య్య నాయుడు, ఆంధ్ర ఎంపీలు కోరుకున్నా రు. రాజ్యసభ బిల్లును ఆమోదిస్తుందో లేదోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది .
ఫిబ్రవరి 19న తెలంగాణ బిల్లు రాజ్యసభకు వచ్చింది. గందరగోళం మధ్య పలుమార్లు సభ ను వాయిదా వేయవలసి వచ్చింది. ఫిబ్రవరి 20 న కూడా గందర గోళం నెలకొన్నది. ఆంధ్ర ఎంపీలంతా స్పీకర్ పోడియం వద్ద నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. పలుసార్లు సభను వాయిదా వేసిన రాజ్యసభ చైర్మన్ కురియన్ అన్ని పార్టీల నేతలను తన ఛాంబర్కు పిలిచి సభను సజావుగా జరగనివ్వాలని కోరా రు. సాయంత్రం నాలుగింటికి సభ కొలువుదీరింది. తెలంగాణ బిల్లుపై ప్రధాన పార్టీలకు ఏకాభిప్రాయం ఉన్నదని, చర్చ మాత్రమే జరగాలని సభ్యులు పట్టుబడుతున్నారని చైర్మన్ కురియన్ సీట్లోంచి లేచి ప్రకటించారు. హోం మంత్రి షిండే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టగా, దీనిపై సాధారణ చర్చకు అనుమతిస్తున్నట్లు కురియన్ ప్రకటించారు.
వెంకయ్యనాయుడు ప్రసంగిస్తూ కొన్ని అంశాలపై వివరణ కోరగా మంత్రి జైరాం రమేశ్ సమాధానాలిచ్చారు. బిల్లులోని వివిధ క్లాజులను మూజువాణి ఓటు తో ఆమోదించారు. వెంకయ్యనాయుడు ఓటింగ్కు పట్టుబడుతూ డివిజన్ను కోరగా సభ్యుల ఆందోళనల నడుమ డివిజన్ జరపలేమని, లోకసభ మాదిరిగానే జరుగుతుందని కురియ న్ స్పష్టం చేశారు. పలు సవరణలను ఒక్కొక్కటిగా వెంకయ్య నాయుడు ప్రవేశ పెడుతూ వచ్చారు. ఒక్కొక్క సవరణను సభ మూజువా ణి ఓటుతో తిరస్కరిస్తూ వచ్చింది. పలు పార్టీల సభ్యులు సవరణలు సూచిస్తూ ఇచ్చిన నోటీసులను కురియన్ అడిగినపుడు వారు ఆ సవరణలను ప్రవేశపెట్టడం లేదని తెలిపారు. ప్రధాని మన్మోహన్ సభలోనే ఉన్నారు. ఏడేండ్ల పాటు ఆంధ్రకు స్పెషల్ స్టేటస్ ఇస్తామని ప్రధాని తెలిపారు.
ఈ గందరగోళాన్ని సభ గ్యాలరీ నుంచి గమనిస్తున్న కేసీఆర్కు, ఇతర ఎంపీలకు ఒక దశలో తలలో నరాలు చిట్లెంత టెన్షన్ కలిగింది. ఒకదశలో తాను కన్నీళ్ళు పెట్టుకున్నట్లు కేసీఆర్ ఆ తర్వాత తెలిపారు. రాజ్యసభలో ఏ సవరణా ఆమోదం పొందలేదు. మూజువాణి ఓటుతో ‘ది బిల్ ఈజ్ పాస్డ్’
అని కురియన్ ప్రకటించారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెర వేరింది. అందరి కండ్లల్లో ఆనంద బాష్పాలు!
ఆనాడు తెలంగాణను ఆంధ్రతో విలీనం చేయడానికి ముందు పార్లమెంట్ భవన సమీపంలోని హైదరాబాద్ హౌజ్లోనే 1956 ఫిబ్రవరిలో సరిగ్గా 20 తేదిన ‘జెంటిల్ మెన్ అగ్రిమెంట్’ పై సంతకాలు జరిగాయి. 57 ఏండ్ల త ర్వాత 2014లో ఫిబ్రవరి 20న ఆంధ్ర నుంచి తెలంగాణ వేరుపడాలనే నిర్ణ యం జరిగింది. ముడిపడ్డ రోజే వేరు పడటం యాదృచ్ఛికమే.
(వ్యాసకర్త: రాజకీయ విశ్లేషకులు)
-వి.ప్రకాశ్