గతానికి వర్తమానానికి మధ్య అక్షరాల వారధి కట్టాలనుకున్నప్పుడు వాదనా పటిమ ఒక్కటే చాలదు; వాస్తవాలనే ఉక్కు ఫలకలు కూడా అవసరం. అంతే తప్ప కేవలం పద విన్యాసం, పాద సన్యాసంతో మాత్రమే చరిత్రను చెక్కుతామంటే, అది రసహీనమైన వాక్యమవుతుందే తప్ప వ్యాసం కాదు. అవును; నేను చెప్తున్నది గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన ‘బాంచెన్ కాల్మొక్తా నుంచి పాదాభివందనాల దాకా’ వ్యాసం గురించే!
Telangana | పాదం మరీ అంత పనికిరానిదేమీ కాదు. తీసిపారేయదగింది అంతకంటే కాదు. పట్టెడడుగున ఉన్నంత మాత్రాన పాదం పాతాళం కాదు. పతిత అంతకంటే కాదు. పాద స్పర్శ పతనమూ కాదు. దేహోన్నతికి, దేహోద్ధతికి, దైహిక చైతన్యానికి పాదమే మూలాధారం. ‘మనిషి అనే మహానిర్మాణంలో’ శిరస్సు పైన ఉన్నంత మాత్రాన దక్కిన ముండ్ల కిరీటంతో జరిగిన మేలేమీ లేదు. మోత బరువు తప్ప! ‘పాతాళంలో’ ఉందనుకుంటున్న పాదానికి జరిగిన పరాభవమూ లేదు! నిజానికి వేదశాస్త్రం ‘పాదాది మూర్ధ్ని పర్యంతం’ అనే పూజించాలన్నది. అంటే పాదాల నుంచి మొదలుకుని శిరస్సు దాకా అర్చించాలన్నమాట! తొలిపూజ దక్కింది పాదానికే! చిన్నచూపు చూస్తున్న చిట్టి పాదంతోనే కదా వామనుడు బలి చక్రవర్తికి మోక్షాన్ని ప్రసాదించింది. ‘నీ పాద కమల సేవయు, నీ పాదార్చకుల తోడి నెయ్యము’ అంటూ పోతన భాగవతంలో ప్రహ్లాదుడు పాదాన్నే ప్రస్తుతించాడు తప్ప మరొకదాన్ని కాదు. చివరికి ఆధునిక కాలంలో జానపద కవులు కూడా ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా’ అనే అన్నారు.
రామాయణంలోని కిష్కింధ కాండలో సీతాదేవి ఆభరణాలను గుర్తించాల్సి వచ్చినప్పుడు, లక్ష్మణుడు ‘నాహం జానామి కేయూరే, నాహం జానామి కుండలే, నూపురే త్వభి జానామి, నిత్యం పాదాభివందనాత్’ అని జవాబు చెప్పాడు. ‘వదిన సీతమ్మ ధరించిన ఇతర ఆభరణాల సంగతి నాకు తెల్వదు. ఆమె పాదాభరణాలు మాత్రమే నాకు తెలుసు. ఎందుకంటే నేను సీతమ్మకు నిత్యం పాదాభివందనం చేస్తాను’ అన్నాడు లక్ష్మణుడు.
ఆభరణాల సంగతి పక్కనబెడితే, తల్లిలాంటి వదినను, ఇంకా చెప్పాలంటే పరాయి స్త్రీని ఎలా చూడాలన్న సందేశమిచ్చింది ఇందులో పాదమే! హిందూ శాస్త్రం- సంప్రదాయం, ‘పాదాభివందనా’న్ని చెప్పినంత స్పష్టంగా మరే రకమైన నమస్కారాన్నీ చెప్పలేదు. ఆశీర్వచన స్వీకార అధికారం శిరస్సుకు దక్కితే, నమస్కార స్వీకారార్హత పాదానికి మాత్రమే దక్కింది. ప్రకృతిలోని ప్రతి వస్తువునూ దైవ స్వరూపంగా భావించి నమస్కరించాలని బోధించిన రుద్ర నమక చమకాలు, ‘ఉరసా శిరసా దృష్ట్యా, మనసా వచసా తథా, పదాం కరాభ్యాం కర్ణాభ్యాం…’ అని చెప్తూనే చివరికి సాష్టాంగ దండ ప్రణామాన్ని, మరో మాటలో చెప్పాలంటే పాదాభివందనాన్ని చేయిస్తాయి. అయోధ్యను పరిపాలించేందుకు భరతుడు కోరింది రాముడి పాదుకలే తప్ప, ధనుర్బాణాలు కాదు. నేటికీ స్వాములు, గురువులు, పీఠాధిపతుల సామర్థ్య ప్రతీకలుగా, ధర్మ సంకేతాలుగా శిష్యులకు అందేవి, వారి పాదుకలే తప్ప వేరు కాదు. భారతీయ సంస్కృతికి, కుటుంబ విలువలకు, పెద్దల పట్ల చూపే గౌరవానికి ప్రతిబింబం పాదాభివందనం.
గొప్ప వాళ్ల పాద స్పర్శ వల్ల వారి శక్తి, అనుభూతి తమకు అందుతాయన్నది ఒక నమ్మకం. హైందవ పరంపరలో పాదాలకు చేసేదే అసలైన నమస్కారం. అక్షతలు, దక్షిణ, తీర్థము, శఠగోపం, కైంకర్యం వంటి పవిత్రమైన పదాలకు పాత్రికేయ రచనలో నిందార్థాలు, నీచార్థాలు కల్పించి భ్రష్టుపట్టించిన భావజాలం నుంచి వచ్చిన వారే, పాదాభివందనాన్ని నామోషీగా, నగుబాటుగా భావిస్తారు!
పరాయి మహిళను తల్లిగా, ప్రతి వ్యక్తిని భగవంతునిగా భావించే సంస్కృతి మనది. మనం చేసే పాదాభివందనం ఆ వ్యక్తికో, అతడి కాలుకో, వేలుకో చేసే నమస్కారం కాదు. శిఖరప్రాయమైన ఒకరి వ్యక్తిత్వానికి, మూర్తిమత్వానికి తనను తాను సమర్పించుకునే వినయ, విధేయ కృతజ్ఞతా సూచిక. ‘నేను నీకు విధేయుడిని. నీ అధీనుడిని. నీ ముందు నాకు అహంకార మమకారాలకు తావులేదు. నీ విధానాలకు నేను బద్ధుడిని’ అని శరణాగతిని ప్రకటించే విధానం. నేటి చట్ట పరిభాషలో చెప్పాలంటే, ఫిరాయింపు నిరోధక చట్టం, బి-ఫామ్ ప్రవచించే, ప్రకటించే తార్కిక నియమ నిబంధనలకు ప్రతీకాత్మకతే పాదాభివందనం. దేవుడికైనా, తల్లిదండ్రులకైనా, గురువులకైనా, పితృసమానులైన పెద్దలకైనా… పాదాభివందనం సమర్పణ భావంతో చేసేదే తప్ప, అందులో పరాధీనతో, పరాభవమో ఎంతమాత్రమూ లేదు. మనకన్నా అల్లంత ఎత్తున ఉండే, మనకు మార్గదర్శనం చేసే, మహోన్నత వ్యక్తులకు, పితృతుల్యులకు (ఫాదర్లీ ఫిగర్స్కు) పాదాభివందనం చేయడం కొత్త సంగతేం కాదు.
తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో, లక్షలాది మంది ప్రజలు హాజరైన ఒక సభా వేదికపై, తెలంగాణ ఉద్యమకారుడైన జయశంకర్సార్కు కేసీఆర్ ఎటువంటి శషభిషలు లేకుండా పాదాభివందనం చేసారు. దీన్ని బాంచెన్ కాల్మొక్త సంస్కృతి అందామా? అనగలమా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గా ఏర్పడడంలో రాష్ట్రపతిగా కీలక పాత్ర పోషించిన ప్రణబ్ముఖర్జీకి కూడా కేసీఆర్ పలుమార్లు పాదాభివందనం చేశారు. దీన్ని బాంచెన్ కాల్మొక్త సంస్కృతి అందామా? అనగలమా? మహిళగా అనేక అవమానాలను ఎదుర్కొని, కాలానికి ఎదురొడ్డి నిలిచి, మగ మహారాజులెందరినో దాసోహం అనిపించుకుని, పాదాభివందనాలు చేయించుకున్న జయలలితను, స్త్రీశక్తి చిహ్నంగా భావిస్తమా? దాన్నీ బాంచెన్ కాల్మొక్త సంస్కృతి అంటమా? దేశం కోసం ‘లాంగ్మార్చ్ చేపట్టిన కేసీఆర్’ ఇవాళ దొరగానూ, కెమెరాల సాక్షిగా అనేకమార్లు అమిత్షా పాదాభివందనాలు అందుకున్న మోదీ ఉత్తమ పురుషుడిలానూ కనిపించడం ఏమిటో! పాద నమస్కారం ఉత్తరాదిలో ఒక సంప్రదాయం. వారు పరిచయస్తులైనా కాకపోయినా పెద్దవాళ్లకు వంగి దండం పెట్టడం వారి అలవాటు. మనక్కొంచం నాగరికత ఎక్కువ కదా! అందువల్ల మనం నమస్కారం మరిచిపోయి మన పిల్లలకు, ఆడా మగ తేడా లేకుండా కౌగిలింతల సంస్కృతిని నేర్పుతున్నం!
పాదాభివందనం మంచి చెడ్డల్ని కొద్దిసేపు పక్కనబెడితే, మన సమాజపు జ్ఞాపక శక్తి మీద మేధావుల కు అపరిమితమైన నమ్మకం. సమయానుకూలంగా వాదనలు తేవడంలో వారిని మించిన వారు మరొకరు లేరు. పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతికి, ప్రణ బ్ ముఖర్జీకి పాదాభివందనం చేస్తే బ్రాహ్మణులు కనుక చేసారంటారు. ‘జయశంకర్ బ్రాహ్మణుడు కాదు కదా’ అన్న సంగతి గుర్తుకు రాదు. వచ్చినా రాయరు. ఒకప్పుడు కేసీఆర్ పాదాభివందనం చేస్తే తప్పన్నారు. ఇప్పుడు ఆయనకు కొడుకు, మనుమల వయస్సున్న యువకులు కేసీఆర్కు పాదాభివందనం చేస్తే తప్పంటున్నారు.
ఇక్కడ విషయం, వివాదం పాదాభివందనం కాదు. కేసీఆర్! వారి దృష్టిలో కేసీఆర్ ఏది చేసినా తప్పే! పాదాభివందనాన్ని కేసీఆర్ ఇష్టపడుతున్నాడని, అందుకు మురిసిపోతున్నాడని, ఆయనకు గర్వాతిశయం కలిగిందని, ఉరకలు వేసే మనసును అదుపు చేసుకుంటూ చిద్విలాసంగా ఉన్నారని, ఇలా ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేకసార్లు వ్యాసంలో ఎకసెక్కాలాడారు. కేసీఆర్ మదిలో, మనసులో ఏం ఊహించుకున్నాడో ఎవరైనా జొర్రి చూసొచ్చి చెప్పారా? పాదాభివందనాలను కేసీఆర్ ప్రోత్సహించిన దాఖలా ఒక్కటైనా ఉందా? స్వానుభవం ఏమిటంటే, కేసీఆర్ పాదాభివందనాలకు వ్యతిరేకి. ఆ క్రమంలో జరిగే ప్రదర్శనకు కూడా! పాదాభివందనాలు వద్దని వారించిన సందర్భాలూ, మరొకరిని ప్రోత్సహించకుండా అలాంటి ఫొటోలను ఆపిన సమయాలూ అనేకం ఉన్నాయి. పాదాభివందనం అనివార్యత ఏమీ కాదు. తన పాదాలకు నమస్కరించాల్సిందిగా బలవంత పెట్టే వ్యక్తులు కూడా ఎవరూ లేరు. బలవంతపెడితే చేసే వాళ్లూ కూడా తెలంగాణలో లేరు. ‘ఇక్కడెవడూ లొంగడు. విల్లులా వంగుతారు తప్ప’ అని రాశారు కదా! అలాంటి తెలంగాణ తత్వంమీద నమ్మ కం ఉండాలి కదా! అయినా పాదాభివందనాలు చేసినవారంతా తప్పు చేసిన వాళ్లేనా? కాళ్లు మొక్కగానే తప్పుల్ని క్షమించేంత బలహీన మనస్కుడా కేసీఆర్! పాదాభివందనానికి తప్పు తప్ప మరే ప్రాతిపదిక ఉండదా! ఆత్మరక్షణ కోసం తప్ప ఎవరూ పాదాభి వందనం చేయరా! అన్నీ స్వీపింగ్ స్టేట్మెంట్సే!
కసో, అక్కసో తెల్వదు కానీ, కేసీఆర్ను విమర్శించడం అనేది కొందరికి ఒక అలవాటుగా మారింది. ‘లైవ్లో వచ్చింది’ అనేది ఒక సాకు. లైవ్లో వచ్చింది ప్రామాణికమా? ఒక మనిషి వ్యక్తిత్వమా? కేసీఆర్ లాంటి రాజకీయ నాయకుడెవరైనా ఒకవైపు ప్రత్యక్ష ప్రసారం జరుగుతుండగా, ఇటువంటి పాదాభివందనాలను కోరుకుంటారా? కామన్ సెన్స్ ప్రశ్న! వందలాది మంది వచ్చి తమకు తోచిన పద్ధతిలో అభినందిస్తున్నప్పుడు, కెమెరాలు అవీ ఉన్న సమయంలో, వంగిన ప్రతిసారీ ఆయన వంగి ఎంతమందినని లేపగలరు?
కాలక్షేపం కోసం టీవీలు పదేపదే చూపించే ఒక దృశ్యాన్ని పట్టుకుని, ఎప్పుడో కనుమరుగైన బాంచెన్ కాల్మొక్త సంస్కృతికి లంకె పెట్టడం, మోకాలికీ బోడిగుండుకు ముడిపెట్టడమే. అభిమానులో, నాయకులో, పోజు కోసమో, ఫొటో కోసమో చేసిన చిన్న విషయాన్ని గోరంతను కొండంత చేసి భూతద్దంలో చూపించడం, దాన్ని మొత్తం తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు, ముఖ్యమంత్రికి, ఆయన వ్యక్తిత్వానికి అంటగట్టడం అవగాహనాలోపం. భాష, పదాల అల్లిక, పొయెటిక్ సాదృశ్యత, రిఫరెన్స్లు పాండిత్య ప్రకర్ష ప్రదర్శనకు పనికి వస్తాయే తప్ప వాస్తవ పరిస్థితిని ప్రతిఫలించవు. కేసీఆర్లో దొర లక్షణాలున్నాయా? లేక డ్రైవర్తో కూడా కలిసి ఒకే టేబుల్ మీద కూర్చుని భోజనం చేసే సంస్కారం ఉన్నదా? అనేది ఆయనతో గడిపిన అనేక మందికి తెలుసు. ఒకే ఒక్క ఒక సూటి ప్రశ్న! అసలిప్పుడు తెలంగాణలో బాంచెన్ కాల్మొక్త సంస్కృతి ఉన్నదా?
తెలంగాణ ప్రజలు ఎవరి కాళ్ల మీద పడొద్దని కదా… కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం సాధించింది! తెలంగాణ ప్రజలు ఎవరి కాళ్ల మీద పడొద్దనే కదా… కేసీఆర్ 2 కోట్ల ఎకరాలకు పైగా నీళ్లిచ్చింది! తెలంగాణ బీదలు ఎవరి కాళ్ల మీద పడొద్దనే కదా… కేసీఆర్ నగదు బదిలీ అమలు చేస్తున్నది! తెలంగాణ వృద్ధులు ఎవరి కాళ్ల మీద పడొద్దనే కదా… కేసీఆర్ రెండు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నది! తెలంగాణ మహిళలు ఎవరి కాళ్ల మీద పడొద్దనే కదా… కేసీఆర్ ఇంటింటికీ మంచినీళ్లిస్తున్నది! తెలంగాణ రైతులు ఎవరి కాళ్ల మీద పడొద్దనే కదా… కేసీఆర్ సాగుకు ఉచితంగా 24 గంటల కరెంటిస్తున్నది! తెలంగాణ అన్నదాతలు ఎవరి కాళ్ల మీద పడొద్దనే కదా… కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా అమలు చేస్తున్నది! తెలంగాణ ఎస్సీలు ఎవరి కాళ్ల మీద పడొద్దనే కదా… కేసీఆర్ దళిత బంధు సాయాన్ని అందిస్తున్నది! తెలంగాణ ఎస్టీలు ఎవరి కాళ్ల మీద పడొద్దనే కదా… కేసీఆర్ వారి గూడేలను గ్రామ పంచాయతీలుగా చేసింది! తెలంగాణ యువత ఎవరి కాళ్ల మీద పడొద్దనే కదా… కేసీఆర్ వారికి 95 శాతం లోకల్ కోటా తెచ్చింది! తెలంగాణ తల్లులు, పిల్లలు ఎవరి కాళ్ల మీద పడొద్దనే కదా… కేసీఆర్ వారి బాగోగులకు అనేక పథకాలు అమలు చేస్తున్నది! తెలంగాణ ప్రజలు ఎవరి కాళ్ల మీద పడొద్దనే కదా… కేసీఆర్ తెలంగాణ బావుటాను దేశ పుర వీధుల్లో ఎగురవేస్తున్నది!
కేసీఆర్ నిలబెడితే… అది ఆకాశమెత్తున అంబేద్కర్ విగ్రహం! కేసీఆర్ నిలబెడితే… అది అద్భుతమైన అం బేద్కర్ సచివాలయం! కేసీఆర్ నిలబెడితే అది… కృష్ణశిలా యాదాద్రి మహాలయం! కేసీఆర్ నిలబెడితే… అది నాగార్జున వనంలో మెరిసిన బుద్ధవనం! కేసీఆర్ నిలబెడితే… అది తెలంగాణ కలెక్టరేట్! కేసీఆర్ నిలబెడితే.. అది హైదరాబాద్ ప్రగతి సౌధం! కేసీఆర్ నిలబెడితే… అది కాళేశ్వర జలాశయం! కేసీఆర్ నిలబెడితే.. అది నిరంతరం ప్రజ్వరిల్లే అమరుల స్మారకం! కేసీఆర్ నిలబెడితే.. కాకతీయ చెరువుల మిలమిల! కేసీఆర్ నిలబెడితే… అది తెలంగాణ వైభవం! కేసీఆర్ నిలబెడితే… అది ఆత్మగౌరవ పతాకం!
గోదావరి జలాలతో తెలంగాణ తల్లి పాదాలు కడిగినా.. జలాశయాలతో తెలంగాణ దేవుళ్ల పాదాలు తడిపినా.. రైతుబంధు నిధులతో అన్నదాత పాదాలను అభిషేకించినా.. వినూత్న పథకాలతో బహుజనుల పాదాలకు పంచామృత స్నానం చేయిస్తున్నా.. సంక్షేమ పథకాలతో నిరుపేదల పాదాలకు పూల పూజచేస్తున్నా.. ఒక సమూహంగానో, సమాజంగానో తెలంగాణ పాదాలు ఇవాళ శిఖరారోహణం చేస్తున్నాయంటే అందుకు కారణం కేసీఆర్! కాదనగలమా?
కోట్లాది మంది తమ పాదాల మీద తాము నిలబడడానికి కారణమైన వ్యక్తిని, వాళ్లు తన కాళ్లమీద పడితే మురిసిపోతున్నాడని రాయడం ఎంత దారు ణం. తన ప్రజల పాదాలు తడబడకుండా, కాలంతో కలబడి నిలబెడుతున్న వ్యక్తిని పాదాభివందనాల చట్రంలో ఇరికిస్తారా? ఆచరణలో జరుగుతున్న ప్రగతి ప్రస్థానాన్ని, దాని ఫలితాన్ని వదలి, ఒకానొక సన్నివేశంలో సాగిన ఒక సింబాలిజమ్ని, గెశ్చర్ని ప్రతీకగా చూపించి, దాన్ని తెలంగాణకు అనువర్తిస్తారా? ఇవాళ నీళ్లెక్కడ పారుతున్నయి? తెలంగాణ జనపదాల మీద కాదా! నేడు తెలంగాణ ప్రజలెక్కడ నిలిచారు? తమ పాదాల మీద కాదా! అభివృద్ధి లేకుంటేనే తెలంగాణ ప్రజలు తమ పాదాక్రాంతమై ఉంటారనుకున్న పాతకాలపు రాజకీయ నాయకుల ధోరణికి భిన్నంగా ఎవరి పాదాల మీద వాళ్లు నిలబడేట్టు చేస్తున్న కేసీఆర్ను అనడం తప్పు కదా!
‘ప్రత్యేక రాష్ర్టాన్ని తానే ఒక్క చేతిమీద సాధించానని చెప్పుకొంటరు’ ఇది మరొక అబద్ధపు వాక్యం. కేసీఆర్ అలా చెప్పుకొన్న దాఖలా ఎప్పుడూ లేదు. ఆయన చెప్పకున్నా అందులో కొంత వాస్తవం లేకపోలేదు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలైన 2001కి ముందు, తర్వాత ఉన్న ఒకే మార్పు కేసీఆర్ కదా! నిన్నటి సమస్యల నుంచి నేటి సౌకర్యాలకు జరిగిన ప్రయాణానికి కారకుడు ఒక్క కేసీఆరే కదా!
‘తెలంగాణకే జాతి పిత అని అందరూ అంటూనే ఉన్నారు’ ఇది మరొక వాక్యం. మహాత్మాగాంధీకి ముందు భారతదేశం లేదా? మరి ఆయన జాతి పిత ఎలా అయ్యారు? అనేక దేశాలకు జాతి పితలున్నారు. అంటే అంతకుముందు ఆ దేశాలు లేనట్టా? తన ప్రాంతాన్ని, జాతిని పునరుజ్జీవింపచేసుకునే వ్యక్తికి ఆ సమాజం ఇచ్చే కృతజ్ఞతా పురస్కారం జాతిపిత.
తెలంగాణను తేవడమే కాదు. దాన్ని అభివృద్ధి కూడా చేసి చూపించిన కేసీఆర్ను తెలంగాణ జాతి పిత అంటే తప్పేమిటి? సాధారణ నటిగా ఉన్న జయలలిత ప్రజల అభిమానాన్ని చూరగొని పురచ్చితలైవి (విప్లవ వనిత) అయింది. తర్వాత అమ్మగా అవతరించింది. సినిమా మాటల రచయితగా ఉన్న కరుణానిధి, మొదట ప్రజా నాయకుడై, తర్వాత కలైంజర్గా ఆవిర్భవించారు. పాదాభివందనాలే కాదు. తమ నాయకులను తాము గౌరవించుకుని, పెంచుకునే సాదృశ్యాలు అవి. అదే కోవలో ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ జాతి పిత ఎందుకు కాకూడదు? కేసీఆర్ను తెలంగాణ బాపూ అంటే తప్పేమిటి?
‘తెలంగాణలో అంబేద్కర్ చెప్పిన దానికి విరుద్ధంగా’ పాదాభివందనం ఒక్కటే కనిపించిందా? అనుకూలంగా జరుగుతున్నవేవీ కనిపించ లేదా? బాంచెన్ కాల్మొక్త సంస్కృతిలో బతికిన వారిని పైకి తేవడానికి కేసీఆర్ ఏ ప్రయత్నమూ చేయలేదా? వాటన్నింటినీ వదిలి, కేవలం ప్రతీకాత్మకంగా జరిగిన ఒక సన్నివేశాన్ని వ్యక్తికి, రాష్ర్టానికి, రాజకీయాలకు ఆపాదిస్తారా? రాష్ట్ర విభజన తర్వాత ఏం జరిగింది? ఎంతమందితో, ఎన్ని విపత్కర పరిస్థితులతో నిలబడి కలబడితే, ఈ ప్రగతి సాధ్యమైంది? రైతులు, నిరుపేదలు, బడుగులు తమ కాళ్లమీద తాము నిలబడేందుకు ఉపయోగపడ్డ వ్యక్తిని, విలన్లా చిత్రించడంలోనే ఒక దురుద్దేశం ఉంది. ఒకరి పెద్దరికాన్ని, పెద్ద మనసును అంగీకరించలేని కురుచ మనస్తత్వం వల్ల మనల్ని మనమే చిన్నబుచ్చుకుంటున్నం. పీవీ బతికి ఉన్నప్పుడూ ఇలాగే చేసినం. ఇప్పుడు కేసీఆర్ విషయంలో చేస్తున్నం. పాద నమస్కారంలో కనీసం దాస భక్తి అయినా దాగి ఉన్నది. కానీ ఒక వ్యక్తిని నిర్హేతుకంగా విమర్శించడంలో కారణం ఏమున్నది? బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కాళ్లు మొక్కడం తప్పే అనుకుందాం కొంచం సేపు. మరెవరి కాళ్లు మొక్కాలి? ఎవరి తొత్తో అందలమెక్కితే, అతడి కాళ్లమీద తెలంగాణ పడాలని కోరుకుంటున్నారా?
ఆ వ్యాసంలోనే చెప్పినట్టు, తెలంగాణలో ఎవడూ లొంగడు. విల్లులా వంగుతాడంతే!
ఆ విల్లు కేసీఆర్ అయితే,
అది ఎక్కుపెట్టే బాణాలే తెలంగాణ ప్రజలు!!
ఆ బాణాలు ఎవరిని గుచ్చుతాయో
రెండు ఎన్నికలు రుజువు చేశాయి.
మూడోసారీ జరిగేదీ అదే!!