న్యూఢిల్లీ : కునుకు తీస్తే మనసు కాస్త కుదుటపడతది అని ఓ సినీ కవి అన్నా ఆఫీసులో అదేపనిగా కునుకు తీస్తే కొలువు పోవడం ఖాయం. పని వేళల్లో నిద్ర పోతే ఉద్యోగానికే ఎసరు వస్తుంది. అయితే అమెరికాలో ఓ పరుపుల కంపెనీ ఎంచక్కా కంటినిండా నిద్ర పోయేవారికి ఆకర్షణీయ వేతనంతో జాబ్ ఆఫర్ను ప్రకటించింది. మీరు చీకూచింతా లేకుండా నిద్ర పోతే చాలు మీ ఖాతాలో డబ్బు వేసే పని ఆ కంపెనీ చూసుకుంటుంది.
కంటినిండా కునుకు తీసే సామర్ధ్యం ఉన్న ప్రొఫెషనల్ స్లీపర్స్కు ఇదే మా ఆహ్వానం అంటూ న్యూయార్క్కు చెందిన మ్యాట్రెసెస్ కంపెనీ కాస్పర్ ప్రకటించింది. సాధ్యమైనంత సేపు నిద్రించే అభ్యర్ధులే తమ డ్రీం క్యాండిడేట్లు అంటూ ఆ కంపెనీ వెల్లడించింది. జాబ్కు ఎంపికైన వారు నిద్రకు సంబంధించిన అన్ని విషయాలను కాస్పర్ సోషల్ మీడియా వేదికల ద్వారా షేర్ చేయడం, ముచ్చటించడం వంటివి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు తమ స్టోర్స్తో పాటు ఎంపిక చేసిన ప్రాంతాల్లో నిద్రించాల్సి ఉంటుంది.
ఇక మెలకువగా ఉన్నప్పుడు వారు తమ అనుభవాలను టిక్టాక్ తరహా కంటెంట్ను కాస్పర్ సోషల్ మీడియా చానల్స్లో పోస్ట్ చేయాలని కంపెనీ పేర్కొంది. ఎంపికైన అభ్యర్ధులు పనిచేసే సమయంలో పైజమాలు ధరించి కాస్పర్ ఉత్పత్తులను ఉచితంగా వాడుకోవచ్చు. వీరికి పనివేళల్లో వెసులుబాటు కూడా కల్పిస్తామని కంపెనీ పేర్కొంది. దరఖాస్తు చేసే వారికి కనీసం 18 ఏండ్లు నిండటంతో పాటు సోషల్ మీడియా కంటెంట్ను క్రియేట్ చేయడంలో ప్రావీణ్యం ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆగస్ట్ 11లోగా దరఖాస్తు చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.