కామారెడ్డి ఎస్హెచ్జీకి జాతీయ స్థాయి గుర్తింపు
చేతిలోని రూపాయిని క్షణాల్లో వాడేసుకోవచ్చు. అదే రూపాయిని రెండు రూపాయలు చేయగలిగితే.. అందులోంచి ఓ రూపాయితో అప్పు తీర్చవచ్చు. దీనివల్ల భారం దిగుతుంది.మరో రూపాయిని మదుపు చేసుకోవచ్చు. అలా ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. కొండంత ధైర్యమూ వస్తుంది.కామారెడ్డి మండల సహకార సమాఖ్య క్రెడిట్ సొసైటీకి రూపాయిని పాపాయిలా పెంచడం ఎలాగో తెలుసు. కాబట్టే, జాతీయ స్థాయిలో అత్యుత్తమ సంఘంగా నిలిచింది.
చేతులు కలిస్తే చప్పట్లు. మనసులు కలిస్తే ముచ్చట్లు. లక్ష్యాలు కలిస్తే.. ప్రగతికి మెట్లు. కామారెడ్డి మండల సహకార సమాఖ్య క్రెడిట్ సొసైటీ విజయం వెనక కూడా సమష్టి స్వప్నాలే ఉన్నాయి. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల కార్యక్రమం మొదలై మూడు దశాబ్దాలు అవుతున్న సందర్భంగా నాబార్డు, డీజీఆర్వీ జర్మనీ సహకారంతో ఏపీ మాస్, ఎనేబుల్ నెట్వర్క్ కలిసి జాతీయ, రాష్ట్ర స్థాయి ఉత్తమ మహిళా సంఘాలకు అవార్డులు అందించాయి. ఈ ఏడాది కాలంలో అత్యుత్తమ ప్రతిభ కనబరచినందుకు కామారెడ్డి పట్టణంలోని కామారెడ్డి మండల సహకార సమాఖ్య క్రెడిట్ సొసైటీ జాతీయ స్థాయిలో ఉత్తమ సంఘంగా ఎంపికైంది. ఈ విజయం వెనుక పందొమ్మిది సంవత్సరాల కృషి ఉంది. ‘పంచ సూత్రాల’ రూపంలో అనుసరించిన పక్కా ప్రణాళిక ఉంది.
ఇదీ నేపథ్యం
కామారెడ్డి మండల సమాఖ్యను 2003, ఆగస్టు 7న ఏర్పాటుచేశారు. 2006, జనవరి 18న రిజిస్టరు చేశారు. దీని పరిధిలో 24 గ్రామ సంఘాలున్నాయి. 5,616 మంది సభ్యులున్నారు. ఈ మండల సమాఖ్యకు 2004-05లో ప్రభుత్వం నుంచి కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(సీఐఎఫ్) రూపంలో రూ.88.72 లక్షలు వచ్చాయి. ప్రస్తుతం కార్పస్ ఫండ్ విలువ రూ.2 కోట్ల 36 లక్షల 46 వేలకు చేరింది. ఏటా సమాఖ్య రూ.15 లక్షల ఆదాయం కండ్లజూస్తున్నది. స్త్రీ నిధి కింద సభ్యులకు రూ.32 కోట్ల రుణాలు ఇచ్చారు. ఆ పెట్టుబడితో వ్యవసాయం, పశుపోషణ, కిరాణ.. తదితర వ్యాపారాలు విజయవంతంగా నడుస్తున్నాయి.
సామాజిక సేవ..
పేద మహిళలను గుర్తించి 60 మందికి ‘గుప్పెడు బియ్యం’ అందించారు సమాఖ్య సభ్యులు. ‘విద్యానిధి’లో భాగంగా పేద పిల్లలను గుర్తించి యూనిఫారాలు, బస్పాస్లు, పుస్తకాలు ఇప్పిస్తున్నారు. మండలంలోని దివ్యాంగులకు ఉపకరణాలు అందిస్తున్నారు. దాదాపు 5,616 మంది సభ్యులకూ బీమా ధీమా ఉంది. ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మించుకునేలా అవగాహన కల్పించారు. కొవిడ్ సమయంలో 20వేల మాస్కులు కుట్టించి అందించారు. వంద మంది యువతీయువకులకు శిక్షణ ఇప్పించి ఉపాధి మార్గం చూపారు. బడి వయసు పిల్లలను బళ్లలో చేర్పించారు. ఆ పనితీరుకు గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. కామారెడ్డి మండల సమాఖ్య అధ్యక్షురాలు రాజమణి జర్మనీ సందర్శించి వచ్చారు. ‘నేను అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో జర్మనీ వెళ్లి, అక్కడి సొసైటీల పనితీరు పరిశీలించి వచ్చాను. ఆ అనుభవం మాకెంతో ఉపయోగపడింది’ అంటారామె. ఓ ఐదు సూత్రాలు సమాఖ్యను గెలుపు బాటలో నడిపించాయి, రాజ్యాంగమై మార్గనిర్దేశం చేశాయి. ఏకాభిప్రాయానికి మార్గం సుగమం చేశాయి..
క్రమశిక్షణతోనే విజయం
మహిళా సంఘాల సభ్యులలో ఆర్థిక క్రమశిక్షణ పెంపొందిస్తున్నాం. దీనివల్ల భవిష్యత్తుకు భరోసా లభిస్తుంది. రుణాలు తీసుకోవడం, తిరిగి చెల్లించడం, రికార్డుల నిర్వహణ, ప్రతి సమావేశానికి విధిగా హాజరు కావడం, లెక్కలు సరి చూసుకోవడం.. ప్రతి ఒక్కరి బాధ్యతగా భావిస్తాం.
– రేవతి,కోశాధికారి , కామారెడ్డి మండల సమాఖ్య
1. వరుస సమావేశాలు
ఎంత పని ఒత్తిడి ఉన్నా సరే, గ్రామంలో నెలకు రెండుసార్లు నిర్వహించే సంఘ సమావేశానికి సభ్యులంతా క్రమం తప్పక హాజరవుతారు. అధికారులు చెప్పే విషయాలపై అవగాహన పెంచుకుంటారు. తద్వారా పారదర్శకతకు పెద్ద పీటపడుతుంది. రిజిస్టర్లో నమోదైన నెలవారీ పొదుపులు, వడ్డీ వాయిదాల వివరాలను సభ్యులు ప్రత్యక్షంగా చూస్తారు.
2. పొదుపు
పొదుపు సొమ్ము ఠంచనుగా సంఘానికి చెల్లిస్తారు. దీనివల్ల వాయిదాలు క్రమ పద్ధతిలో ఉంటాయి. చెల్లిస్తున్న డబ్బు విలువ, వడ్డీ లెక్కలను సమావేశంలో చదువుతున్నప్పుడు శ్రద్ధగా వింటారు.
3. అప్పుల లెక్కలు
అప్పుల నిర్వహణ పుస్తకాన్ని సభ్యులంతా పరిశీలిస్తారు. ఏ సభ్యురాలికి ఎంత అప్పు ఇచ్చాం? తిరిగి ఎప్పుడు చెల్లించారు?.. తదితర వివరాలను పుస్తకంలో నమోదు చేశారా, లేదా? అన్నది సరిచూసుకుంటారు. అవసరమైతే, ఆ గణాంకాలను ఒకటికి రెండుసార్లు చదివి వినిపించాలని సిబ్బందిని కోరతారు.
4. తిరిగి చెల్లింపు
స్త్రీనిధి, బ్యాంకు, సంఘం.. ఎక్కడ రుణాలు తీసుకున్నవారైనా వాయిదాల చెల్లింపులో అప్రమత్తంగా ఉంటారు. ఆఫీసులో స్వయంగా చెల్లిస్తే మోసాల బారినపడే ఆస్కారం ఉండదు. సంఘ సహాయకురాలికి చెల్లిస్తే కనుక, వెంటనే రసీదు తీసుకుంటారు. దీనివల్ల అవకతవకలకు ఆస్కారం ఉండదు.
5. పుస్తకాల నిర్వహణ
గ్రామ సంఘం కార్యకలాపాలకు ప్రత్యేకించి ఓ పుస్తకం నిర్వహిస్తారు. అందులో సంఘం నిధి, సభ్యులు తీసుకున్న రుణం, నెలనెలా సమావేశానికి హాజరైన సభ్యుల పేర్లు, సంతకాలు ఉంటాయి. వాటిని కమ్యూనిటీ కోఆర్డినేటర్ (సీసీ) పరిశీలించి ధ్రువీకరించాలి.
…? జూపల్లి రమేశ్ రావు