పనాజీ : వాస్కో సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ కొండచిలువ వాహనాల కింద నలిగిపోకుండా కాపాడటంతో అది బతికి బయటపడింది. కొద్ది రోజుల క్రితం హేరంబ్ అమోంకర్ అతడి తల్లి ముక్త సరీసృపం క్షేమంగా రోడ్డు దాటడానికి ఏకంగా ట్రాఫిక్ను నిలిపివేశారు. మరో జంతు రక్షకుడు స్టీఫెన్ జాన్సన్ 17 పిల్ల కొండచిలువలను వాటి పొదిగే కాలంలో వాటిని కంటికి రెప్పలా కాపాడాడు. సాటి ప్రాణుల పట్ల దయాగుణంతో వ్యవహరించిన ఈ రెండు ఉదంతాలను వాటిని కాపాడిన వారిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు. హేరంబ్ ఇటీవల అర్ధరాత్రి దాటిన తర్వాత వాహనంపై వెళుతుండగా చిన్న కొండచిలువ రోడ్డుపైన పాకుతూ వెళ్లడం చూశాడు.
హేరంబ్ వెంటనే అలర్ట్ అవగా అతడి తల్లి, ప్రకృతి ప్రేమికురాలు ముక్త వెంటనే వాహనం దిగి దూసుకొస్తున్న ట్రాఫిక్ను నిలిపివేశారు. తమ వాహనం ఎదురుగా ఓ కారు వెనుక మూడు కార్లు ఆగిపోయాయని తమ సూచనతో వాహనదారులు వేచిచూడగా సరీసృపం రోడ్డు దాటి వెళ్లిందని ముక్తా చెప్పుకొచ్చారు. సరీసృపాల పట్ల మన జీవవైవిధ్యాన్ని, ఇతర ప్రాణుల పట్ల ప్రజల సంరక్షణకు ఇది సంకేతమని చిక్లెమ్ బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీ చీఫ్ మన్యుల్ అరుజొ చెప్పారు.
ఇక కొద్దివారాల కిందట జాన్సన్ వాస్కో-కొర్టాలిం హైవేపై ఓ కాలువ నుంచి కొండచిలువను కాపాడాడు. మరుసటి రోజు దాన్ని విడిచిపెట్టేముందు గోనెసంచీలో కొండచిలువతో పాటు 22 గుడ్లను చూశాడు. గుడ్ల నుంచి తల్లిని వేరుచేయడం ఇష్టపడని జాన్సన్ ఆ సంచీని అలాగే వదిలేశాడు. కోడి తరహాలో కొండచిలువ తన గుడ్లపై కూర్చుని 50-55 రోజుల వరకూ ఉష్ణోగ్రతలను నియంత్రించిందని గుర్తుచేసుకున్నాడు. ఆపై కొండచిలువ పారిపోవడంతో గుడ్ల పొదుగు కాలంలో వాటిని కంటికి రెప్పలా కాపాడాడు. వాటిని ఇసుక నింపిన కంటైనర్లో ఉంచడంతో క్రమంగా గుడ్ల నుంచి చిన్న పైథాన్లు పుట్టుకొచ్చాయని, క్రమంగా అవి బతకడం నేర్చుకున్నాయని చెప్పాడు.