సాధారణంగా చర్చ్లో ఎవరుంటారు.. ఏసుక్రీస్తు శిల ఉంటుంది. ఏవైనా బాధలు ఉంటే.. చర్చ్కు వెళ్లి ప్రభువుతో తమ గోడు చెప్పుకుంటారు. కాసేపు ప్రశాంతంగా చర్చ్లో గడిపి వస్తారు. కానీ.. ఇప్పుడు మనం మాట్లాడుకునే చర్చ్లో ఏముంటాయో తెలుసా? మానవ అస్థిపంజరాలు. అవును.. సుమారు 40 వేల మంది మనుషుల అస్థిపంజరాలతో అలంకరించిన చర్చ్ గురించే ఇప్పుడు మనం మాట్లాడుకునేది.
ఆ చర్చ్ చెక్ రిపబ్లిక్ అనే దేశంలో ఉంది. ఆ చర్చ్ పేరు సెడ్లెక్ ఒసువరీ. మధ్య శతాబ్దం వరకు ఆ చర్చ్ ఉన్న ప్రాంతాన్ని పవిత్రమైన ప్రదేశంగా భావించేవారు. అయితే.. 14 వ శతాబ్దంలో ప్లేగు వ్యాధి యూరప్ అంతటా వ్యాపించింది. దీంతో వేల మంది మృత్యువాత పడ్డారు. ఆ సమయంలో చెక్ రిపబ్లిక్ దేశంలో 40 వేల మంది వరకు మరణించారు. దీంతో వారి మృతదేహాలను పవిత్రమైన ప్రాంతంగా భావించే ఆ చర్చ్ ప్రాంతంలో పూడ్చి పెట్టారు.
తర్వాత 15వ శతాబ్దంలో అక్కడ తవ్వకాలు చేపట్టగా.. గుట్టలు గుట్టలుగా అస్థిపంజరాలు బయటపడ్డాయి. ఆ తర్వాత కొన్నేళ్లకు అదే ప్రాంతంలో ఒక చర్చ్ను నిర్మించారు. అయితే.. ఆ ఆస్థిపంజరాలను మాత్రం ఎవ్వరూ ముట్టుకోలేదు. కానీ.. సగం కంటిచుపు మాత్రమే ఉన్న.. ఓ సన్యాసి.. ఆ అస్థిపంజరాలను అన్నింటినీ.. నాలుగు పెద్ద పిరమిడ్స్లా పేర్చాడు. దీంతో అతడికి కంటిచూపు మెరుగైంది.
ఆ తర్వాత..1870 వ సంవత్సరంలో.. అక్కడి స్థానిక శిల్పి ఫ్రాంటిసెక్ రింట్.. మనుషులు అస్థిపంజరాలు, ఎముకలు, పుర్రెలు.. అన్నింటితో ఆ చర్చ్ను అలంకరించడం మొదలు పెట్టాడు. ముందు అందరూ కాస్త భయపడ్డా.. తర్వాత ఆ చర్చ్కు ఎముకలతో అందం వచ్చింది. ప్లేగు వ్యాధి వల్ల చనిపోయిన 40 వేల మంది అస్థిపంజరాలతో ఆ చర్చ్ను డెకరేట్ చేశాడు. చర్చ్లోని అన్ని వస్తువులు ఎముకలు, పుర్రెలతోనే తయారు చేశాడు. ఏసుక్రీస్తును ఆరాధించడం కోసం.. ఆయన దగ్గర ఏర్పాటు చేసే కొవ్వత్తులు వెలిగించే స్టాండ్ను కూడా పుర్రెతోనే తయారు చేశాడు. మొత్తానికి చర్చ్ రూపురేఖలనే మార్చేశాడు ఆ శిల్పి. అద్భుతమైన కళాఖండాన్ని సృష్టించాడు.
అప్పటి వరకు ఆ చర్చ్ను పట్టించుకోని ప్రజలు.. ఆ తర్వాత ఆ చర్చ్కు రావడం మొదలు పెట్టారు. పర్యాటకులు పెరిగారు. చర్చ్కు ఆదాయం కూడా పెరిగింది. అయితే.. ఆ చర్చ్ లోపలికి వెళ్లగానే అన్నీ ఎముకలు, పుర్రెలు, అస్థిపంజరాలే కనిపిస్తాయి. అలాగని.. మనుషులను భయపెట్టడం కోసం ఎముకలతో ఆ చర్చ్ను నిర్మించలేదు. కేవలం.. మనిషి జీవితం గురించి, మరణం గురించి ప్రజలకు గుర్తు చేయడం కోసమే అలా చర్చ్ను అస్థిపంజరాలతో డెకరేట్ చేశాడట ఆ శిల్పి. మరణం మనిషికి ఎప్పుడో ఒకప్పుడు సంభవించేదే.. మరణాన్ని దృష్టిలో పెట్టుకొని మనిషి తన జీవనాన్ని ముందుకు సాగించాలి.. అనే దృక్పథంతో దాన్ని నిర్మించినట్టు చెబుతున్నారు.
అప్పటి నుంచి ఆ చర్చ్కు పర్యాటకుల తాకిడి పెరిగింది. ఆరేళ్ల క్రితం వరకు కూడా ఇంకా.. మిగిలిపోయిన కొన్ని ఎముకలు, అస్థిపంజరాలతో చర్చ్ను మళ్లీ పునరుద్ధరించారట. కరోనా మహమ్మారికి ముందు వరకు ప్రతి సంవత్సరం 5 లక్షల మంది ఈ చర్చ్ను సందర్శించేవారట. కానీ.. గత రెండు సంవత్సరాల నుంచి ఈ చర్చ్ను పర్యటించేవాళ్ల సంఖ్య తగ్గిందట. దాని వల్ల.. చర్చ్కు భారీగా ఆదాయం తగ్గిందట.