ఒహాయో బీవర్క్రీక్ హిందూ దేవాలయంలో సెప్టెంబర్ 17 నుండి 19 వరకు ప్రపంచ శక్తి దినోత్సవం పురస్కరించుకుని లోకక్షేమం కోసం మహా రుద్రం, శత చండీ హోమాలు ఘనంగా నిర్వహించారు. జీఆర్డీ అయ్యర్ గురుకూల్ వ్యవస్థాపకులు రమేష్ నటరాజన్, గాయత్రి నటరాజన్ గారి ఆధ్వరంలో జరిగిన ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు కన్నుల విందుగా, శ్రవణానందంగా సాగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గోని హోమాలు, పూజలు చేయటం విశేషం.
గాయత్రి నటరాజన్ యావత్ జగత్తుకి కేంద్ర బిందువైన దేవిని శక్తి రూపంలో పూజించడం ఈ ప్రపంచ శక్తిదినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. గతంలో సహస్ర సువాసిని పూజ, శత చండీ హోమం, ఆన్లైన్ ద్విసహస్ర చండీపారాయణం గురుకూల్ నిర్వహించినట్లు, ఈ సంవత్సరం డేటన్ దేవాలయం వారి సమన్వయంతో ఒక పండుగగా చేసుకోవడం చాలా సంతోషమైన విషయం.
1331 మార్లు రుద్రం, 121 చమకములు, మహన్యాసం, రుద్ర క్రమం, 100 మార్లుశ్రీ దుర్గా సప్తశతి, 134 రుద్ర హోమాలు, 10 చండీ హోమాలు, హర హర మహాదేవ , జై చండీ నినాదాలతో మారుమోగిన ప్రాంగణం దివ్యానుభూతి కలిగించింది. ఇందుకు ఎంతో శ్రమించిన గురుకూల్ సభ్యులు, ముఖ్యంగా మహిళా సభ్యులుపాల్గొనటం గర్వకారణంగా ఉందని, గురుకూల్ సభ్యులందరి తరపున డేటన్ హిందూ దేవాలయ నిర్వహణ వర్గం వారికీ, కార్యవర్గ సభ్యులకు, హాజరైన భక్తులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇక ముందు కూడా గురుకూల్ఇలాంటి కార్యాక్రమాలు ఇతర దేశాలలో కూడా జరుపుకోనున్నట్లు తెలిపారు.
డేటన్ హిందూ దేవాలయం ప్రెసిడెంట్ హేమ పండ్రంగి మాట్లాడుతూ డేటన్ హిందూ దేవాలయం 1976 నుంచీ బేవర్క్రీక్ పరిసర ప్రాంతాలలో హిందూ ధార్మిక కార్యక్రమాలకు ఒక శక్తి కేంద్రంగా రూపుదిద్దుకుని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజ, సేవా కార్యాలను నిర్వహిస్తునట్లు తెలిపారు.
ప్రపంచ శక్తి దినోత్సవం ఈ ఆలయ ప్రాంగణంలో జరగడం అందునా రమేష్, గాయత్రి, వారి శిష్యబృందము అద్భుత మంత్రోచ్చారణతో హోమాలతో ఆలయాన్ని, భక్తజనులను ఉత్తేజ పరిచడం మరచిపోలేని అనుభూతి అని వ్యక్తపరిచారు.
ఈ కార్యక్రమం ఎంతో వేడుకగా జరుపుకోడానికి సహకరించిన తన తోటి కార్య వర్గం, వాలంటీర్లు, దాతలు, కళాకారులు, ఆలయ సిబ్బంది అండగా నిలిచిన భక్తులకు విశేష కృతజ్ఞతలు తెలుపుకున్నారు.