హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమకారులను ప్రోత్సహించేది టీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని మరోమారు నిరూపితం అయిందని ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా విద్యార్థి ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. గెల్లు అభ్యర్థిత్వంపై అశోక్ గౌడ్ దూసరి మాట్లాడుతూ సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
గెల్లు శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచే పార్టీలో అంకితభావం, దీక్షతో పనిచేస్తున్నారన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ టీఆర్ఎస్వీ విభాగం అధ్యక్షుడుగా పనిచేసిన ఆయన ఉద్యమ కాలంలో అరెస్టులై పలుమార్లు జైలుకెళ్లిన విషయాన్ని గుర్తుచేశారు. హుజూరాబాద్లో టీఆర్ఎస్ గెలుపు కోసం అటు క్షేత్రస్థాయిలో, ఇటు సోషల్ మీడియాలో ఎన్నారై టీఆర్ఎస్ యూకే నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా గెల్లు శ్రీనివాస్ గెలుపుకోసం నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహించనున్నట్లు చెప్పారు.