స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఆరో వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. శనివారం నాడు నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలుగు విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య వెలుదండ నిత్యానందరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ విధంగా లలిత కళలను ప్రోత్సహించడం ఆనంద దాయకంగా ఉందని అన్నారు. వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారులు పాడిన పాటలు ఎంతో బాగున్నాయని ప్రశంసించారు. సంగీతం, నాట్యం వంటి కళల ద్వారా మనలో మృదుత్వం కలుగుతుందని, నేటి యాంత్రిక జీవితంలో ఈ మాధ్యమం ఎంతో ముఖ్యమని అన్నారు. కాబట్టి కళలపై ఉన్న ఆసక్తిని తమ తమ సంపాదన అనే రథ చక్రాల కింద పడి నలిగి పోనివ్వవద్దని కోరారు.
ఈ కార్యక్రమానికి STS వైస్ ప్రెసిడెంట్ జ్యోతీశ్వర్, శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్, TCSS అధ్యక్షులు గడప రమేశ్, TAS (మనం తెలుగు ) అసోసియేషన్ అనితా రెడ్డి, కమల క్లబ్ మాజీ అధ్యక్షులు, సారీ కనెక్షన్ అడ్మిన్ పద్మజ నాయుడు , మగువ మనసు అడ్మిన్ వీర మాంగోస్ ఉష , సింగపూర్ తెలుగు టీవి రాధాకృష్ణ గణేశ్న , జయంతి రామ, భాగవత ప్రచార సమితి భాస్కర్ ఊలపల్లి, H& H శ్యామల, విష్ణు ప్రియ, సింగపూర్ తెలుగు వనితలు అడ్మిన్స్ శ్రీ క్రాంతి, దేదీప్య, జయ, ప్రత్యూష , అమ్ములు గ్రూపు నుంచి అడ్మిన్ సునీత రామ్ , KCAS దివ్య ఇంకా పలువురు సింగపూర్ తెలుగు కమ్యూనిటీ వ్యవస్థాపకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారందరూ కలిసి వీసీని సన్మానించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా స్వరలయ ఆర్ట్స్, సింగపూర్ వ్యవస్థాపక అధ్యక్షురాలు యడవల్లి శేషుకుమారి, వారి శిష్యులు,స్నేహితులు కీర్తనలను ఆలపించారు. ఈ సందర్భంగా శేషుకుమారిని గాన కోకిల అని పద్మజ నాయుడు పొగిడారు. దానికి ఆచార్య నిత్యానందరావు స్పందిస్తూ.. కోకిల ఒక కాలంలో మాత్రమే పాడుతుందని.. కానీ శేషుకుమారి 365 రోజులు గానం ఆలపిస్తారని అన్నారు. తమ వేంకటేశ్వర గానామృతం కార్యక్రమానికి శేషుకుమారి 70 పాటలను 40 రాగాల్లో స్వరపరిచి మూడున్నర గంటల సేపు పాడి అందర్నీ అలరించారని శ్యామల గుర్తుచేశారు.
ఇక, తెలుగు విశ్వవిద్యాలయం సర్టిఫికెట్ కోర్సు మొదటి, రెండో సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన స్వరలయ ఆర్ట్స్ విద్యార్థులకు వీసీ బహుమతి ప్రదానం చేశారు. అతిథులకు మెమొంటోలు బహూకరించారు. అలాగే ఈ నెల 6న స్వరలయ ఆర్ట్స్ నిర్వహించిన త్యాగరాజ ఆరాధన ఉత్సవాల్లో పాల్గొని తమతో కలిసి పంచరత్నాలు పాడిన సౌభాగ్యలక్ష్మి తంగిరాల, షర్మిల చిత్రాడ, సౌమ్య ఆలూరు, శరజ అన్నదానం, రాధికా నడదూర్, ప్రియలకు మొమొంటోలను బహూకరించారు. ఈ కార్యక్రమానికి చైతన్య వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పలువురిని లలిత కళారంగంలో ఉత్సాహపరుస్తూ ముందుకు నడిచే ఇటువంటి కార్యక్రమానికి దాదాపుగా 200 మంది హాజరవ్వడమే కాకుండా, సాంఘిక మాధ్యమాల ద్వారా కూడా వీక్షించి విశేష స్పందనలను తెలియజేయడం అభినందనీయమని అన్నారు.