టెక్సాస్/హ్యూస్టన్ : వంశీ గ్లోబల్ అవార్డ్స్, అమెరికా గాన కోకిల శారద ఆకునూరి , సంతోషం ఫిలిం న్యూస్ చంద్ర తేజాలయ మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ ఎన్టీఆర్ 98 వ జయంతి సందర్భంగా అంతర్జాలంలో ఆ మహానటుడికి జోహార్లర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ మాట్లాడుతూ.. తాను ఎన్టీఆర్ తో నటించానని తెలుగు వారి గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని నిలబెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన సేవలను కొనియాడారు. ముఖ్యమంత్రిగా పేదలకు ఎన్నో సేవా పథకాలు ప్రవేశ పెట్టారని అలాంటి వ్యక్తికి భారత రత్న రాకపోవడం విచారకరమన్నారు.
మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ తాను ఎన్టీఆర్ అంటే తెలుగు, తెలుగంటే ఎన్టీఆర్ అని ఆయన తెలుగు జాతికి భాషకు చేసిన సేవలను గుర్తుచేశారు. దర్శక, నిర్మాత వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ వంటి ప్రముఖుల చరిత్రను రికార్డ్ చేయాలన్నారు. అలాగే సినీ గేయ రచయిత భువన చంద్ర , దర్శకుడు రేలంగి నరసింహారావు, నటులు రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్, రచయిత భారవి పాల్గొని వారి అనుబంధాన్ని పంచుకున్నారు.
ఐదు ఖండాల నుంచి, పన్నెండు దేశాలు భారత దేశం, అమెరికా, యూకే , సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, హాంకాంగ్, న్యూజిలాండ్, ఉగాండా , అబుదాబి , ఓమన్ , సింగపూర్ , మలేషియా దేశాల నుంచి పలువురు తెలుగు ప్రముఖులు వారి సందేశాలను పంపించి ఘన నివాళులు అర్పించారు.
ప్రముఖ గాయకులు చంద్రతేజ, శారద ఆకునూరి ఎన్టీఆర్ సుమధుర గీతాలను ఆలపించారు.
వంశీ గ్లోబల్ అవార్డ్స్ వ్యవస్థాపకుడు డా. వంశీ రామరాజు ఎన్టీఆర్ కి వంశీ సంస్థకి వున్న అనుబంధాన్ని తెలియజేసారు.
డా తెన్నేటి సుధాదేవి అధ్యక్షురాలు-వంశీ , శైలజ సుంకరపల్లి మేనేజింగ్ ట్రస్టీ వంశీ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.