NRI News | శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అలనాటి మాటల మాంత్రికుడు, ప్రఖ్యాత సినీ రచయిత పింగళి నాగేంద్ర రావు 122వ జయంతి సందర్భంగా, శుక్రవారం ఆన్లైన్లో `పింగళి మాటా పాటా` కార్యక్రమం అద్వితీయంగా నిర్వహించారు. మాయాబజార్, పాతాళభైరవి, మిస్సమ్మ, గుండమ్మ కథ, జగదేకవీరుని కథ, శ్రీ కృష్ణార్జున యుద్ధం, అప్పుచేసి పప్పుకూడు, గుణసుందరి కథ, పెళ్లి చేసి చూడు తదితర తెలుగు సినిమాలకు పాటలు, మాటలు అందించిన పింగళి గారి రచనా వైశిష్యం, సామర్థ్యం ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు డాక్టర్ వంశీ రామరాజు, కవుటూరు రత్నకుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా ప్రముఖ సినీ గేయకవి భువనచంద్ర, ప్రముఖ సంగీత దర్శకులు సాలూరు వాసూరావు మాట్లాడుతూ పింగళి జీవిత విశేషాలు, సినీ ప్రస్థానం గురించి పలు విశేషాలను పంచుకున్నారు. పింగళి రాసిన పలు పాటలను ప్రముఖ గాయకులు తాతా బాలకామేశ్వరరావు, చింతలపాటి సురేష్, వైఎస్ రామకృష్ణ, శాంతిశ్రీ, డా. స్రవంతి, భవ్య తుములూరు ఆలపించి ఆహుతులను అలరించారు.
రాధిక మంగిపూడి సభ నిర్వహణలో అమెరికా నుండి ప్రముఖ గాయని శారదా ఆకునూరి, ఖతార్ నుండి వెంకప్ప భాగవతుల, సాహిత్య జ్యోత్స్న, మలేషియా నుండి సత్య దేవి మల్లుల తదితరులు మాట్లాడారు.
కల్చర్ టీవీ సాంకేతిక నిర్వహణలో ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు పలువురు అభిమానులు అభినందించారు.
పూర్తి కార్యక్రమాన్ని వీక్షించడానికి లింక్: