హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అసెంబ్లీ సమావేశాల్లో ఎన్ఆర్ఐలపై చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల (Mahesh Bigala) తీవ్రంగా ఖండించారు. ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలయబుల్ ఇండియన్ అని సీఎం వ్యాఖ్యనించడం ఎన్ఆర్ఐలను అవమానించడమేనని అన్నారు.
ఎన్నారైలు అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అని సరిదిద్దుకోవాలని సూచించారు. గౌరవ సభలో అందరి మర్యాదలు కాపాడేటట్టు ఉండాలని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలు భారత ఆర్థిక వ్యవస్థ (Indian economy) కు చేదోడు వాదోడుగా ఉంటున్నారని గుర్తు చేశారు. విదేశి డబ్బును తమతమ కుటుంబాలకు పంపడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డ్స్ నుంచి తొలగించాలని ఎన్ఆర్ఐల పక్షాన కోరుతున్నామని అన్నారు.