హైదరాబాద్: ప్రపంచంలోనే లౌకికత్వానికి అతిపెద్ద ప్రతీకగా భారతదేశం నిలుస్తుందని తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని (Nandini Abbagouni) అన్నారు. ఇండియా విభిన్న మతాలు, కులాలు, జాతుల సమ్మేళనమని, వసుధైక కుటుంబానికి అతిపెద్ద ఉదాహరణ అని చెప్పారు. అనేక మతాలు, సంస్కృతులు కలిసి మెలిసి శాంతి, సామరస్యాలతో మనుగడ సాగిస్తున్నాయని వెల్లడించారు. వైవిధ్యం తన బలంగా అత్యంత శాంతియుతంగా జీవిస్తున్న దేశమని పేర్కొన్నారు. దాదాపు 130 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్న అలాంటి దేశంలో ఒకరిద్దరు చేసిన వ్యాఖ్యలను మొత్తం దేశానికే ఆపాదించటం సరికాదని అభిప్రాయపడ్డారు.
బాబా సాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో ఆధునిక, ఉదారవాద, మానవీయ, శాస్త్రీయ ఆలోచనల ఆధారంగా నూతన భారతాన్ని నిర్మించాలన్న ఉద్దేశంతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. భారత్ సంపూర్ణ మానవత్వానికి, ప్రజా హక్కులకు, ప్రజాస్వామ్య పౌరసత్వానికి హామీనిచ్చే ఏకైక లౌకిక దేశం అని పునరుద్ఝాటించారు.