హైదరాబాద్ : నవంబర్లో అమెరికాలోని అట్లాంటాలో దివంగత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు ఈ మేరకు స్థల పరిశీలన జరిగినట్లు పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు మహేశ్ బిగాల తెలిపారు. పీవీ శత జయంతి ఉత్సవాలను ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఐదు దేశాలలో పీవీ విగ్రహాలని స్థాపించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో అమెరికాలోని అట్లాంటాలో పెట్టాలని ఇండియన్, తెలుగు సంస్థల ప్రతినిధులు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన మహేశ్ బిగాల ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు పీవీ శత జయంతి ఉత్సవాలను ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నామన్నారు. విగ్రహ ప్రతిష్టాపన గురించి ఎంపీ కేశవరావుతో చర్చించి నవంబర్లో ఏర్పాటు చేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు.
ఆవిష్కరణ కార్యక్రమానికి తెలంగాణ నుంచి ప్రముఖుల్ని, పీవీ కుటుంబ సభ్యులను ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. అమెరికాలోని తెలుగు, ఇండియన్ డియాస్పోరా కాకుండా సెనెటర్, మిగతా ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. అమెరికాలో తెలుగు సంఘాలే కాకుండా ఎన్నారై, ఎన్ఆర్ఐ సంస్థల సభ్యులు అందరూ పీవీ నరసింహ రావుకు భారతరత్న ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయాన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు.
డా. పాడి శర్మ (IACA ఫౌండింగ్ మెంబర్) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అంజయ్య చౌదరి లావు (తానా ప్రెసిడెంట్), చాంద్ అక్కినేని (ప్రెసిడెంట్,ఇండియన్ అమెరికన్ కల్చరల్ అసోసియేషన్-IACA ), సునీల్ సవిలి చైర్మన్ (ఇండియన్ ఫ్రెండ్స్ అఫ్ అట్లాంటా- IFA), శివకుమార్ రామడుగు (టీఆర్ఎస్ పార్టీ అట్లాంటా అడ్వైజర్), Chittari పబ్బ చైర్మన్ (గేట్స్), జనార్దన్ పన్నెల సెక్రటరీ, సందీప్ గుండ్ల (గేట్స్ ), గణేష్ కోసం (న్రివ), శ్రీనివాసులు రామిశెట్టి ( తెలుగు అసోసియేషన్ అఫ్ మెట్రో అట్లాంటా – TAMA), కీర్తిదర్ గౌడ్ చకిలం (గేట్స్ ) తదితరులు పాల్గొన్నారు.