హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ అయిన మురళీధర్ మిర్యాలకు మరోసారి ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డు (PBSA) లభించింది. భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా టోక్యోలోని భారత రాయబార కార్యాలయంలో ఇండియన్ అంబాసిడర్ సంజయ్ కుమార్ వర్మ నుంచి మురళీధర్ మిర్యాల అవార్డును స్వీకరించారు. ఈ అవార్డును తీసుకోవడం తనకు ఎంతో సంతోషంగా, తర్వంగా ఉన్నదని మురళీధర్ మిర్యాల చెప్పారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో తాను సాధించిన లెక్కలేనన్ని విజయాలకు, అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టను, గౌరవాన్ని ఇనుమడింపజేయడంలో తన కృషికి గుర్తింపుగా తనకు PBS అవార్డు దక్కిందని మురళీధర్ మిర్యాల చెప్పారు. ఈ PBSA ప్రవాస భారతీయులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం. ఇప్పటివరకు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, రిపబ్లిక్ ఆఫ్ మారిషస్ మాజీ అధ్యక్షుడు రాజ్కేశ్వర్ పుర్యాగ్, న్యూజీలాండ్ మంత్రి ప్రియాంకా రాధాకృష్ణన్, సింగపూర్ మాజీ ప్రధాని ఎస్ఆర్ నాథన్ తదితర కొద్దిమందికి మాత్రమే ఈ పురస్కారం దక్కింది.
కాగా ప్రొఫెసర్ మురళీధర్ మిర్యాల ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డు (PBSA) తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా గతంలో కూడా ఆయన ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డు అందుకున్నారు. అప్పుడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆయన అవార్డును అందుకున్నారు.