హైదరాబాద్: ‘తెలుగుతల్లి కెనడా’, ‘ఓంటారియో తెలుగు ఫౌండేషన్’ సంయుక్తంగా నిర్వహించిన ‘పాడనా తెలుగు పాట’ కెనడా (Canada) సూపర్ సింగర్ గ్రాండ్ ఫినాలే ఘనంగా జరిగింది. టొరాంటోలోని రీజెంట్ థియేటర్ వేదికగా కెనడాలో మొదటిసారిగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని రాయవరపు విజయగోపాల రాజు, లక్ష్మి రాయవరపు, మురళి పగిడేల, శివజ్యోతి పగిడేల, శ్రీనివాస్ నారు, పద్మిని నారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రుక్మిణి మద్దులూరి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
‘మన టీవీ కలలు-కళలు’ కార్యక్రమ నిర్వాహకులు గూడూరు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 27 మంది అభ్యర్థులు ఈ పోటీలో పాల్గొనగా సంగీత దర్శకులు డాక్టర్ జోశ్యభట్ల, రచయిత్రి, గాయని దమయంతి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో 500 మందికిపైగా ఆహూతులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క అభ్యర్థి ఎంతో చక్కగా పాడారని, విజేతల నిర్ణయం చాలా కష్టమైందని జోశ్యభట్ల అన్నారు. ప్రతి పాటా ఎంతో అద్భుతంగా ఆలపించారని చెప్పారు. విజేతలతోపాటు ప్రతి విభాగంలో పోటీపడిన ముగ్గురికి తన సంగీత దర్శత్వంలో పాడే అవకాశం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
విజేతలకు ‘గెట్ హోం రియాల్టీ’ రమేష్ గొల్లు, ఆనంద్ పెరిచెర్ల, రఘు జూలూరి బహుమతులు అందించారు. ప్రీ టీన్స్ విభాగంలో వికాసిని అలవలపాటికి ప్రథమ బహుమతి లభించగా, సాహితీ యలమంచిలి, హేమాన్వి సిరిమండ్ల ద్వితీయ, తృతీయ బహుమతులు అందుకున్నారు. ఇక టీన్స్ విభాగంలో ఆశ్రిత పొన్నపల్లి, మీనా కూచిమంచి, శ్రేయస్ ఫణి పెండ్యాల తొలి మూడు బహుమతులు, అడల్ట్స్ విభాగంలో గాయత్రి తణుకు, రోహిణి చేబియ్యం, మనోభిరాం నెల్లుట్ల ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందారు. ఇలాంటి కార్యక్రమం కెనడాలో జరగడం గర్వంగా ఉందని ‘గెట్ హోమ్ రియాలిటీ’ సభ్యులు ఆనందం వ్యక్తంచేశారు.
ఈ సందర్భంగా వంశీ రామరాజుకు ‘విశ్వకళా సేవా భూషణ బిరుదు’తో సత్కరించారు. సీనియర్ నటుడు చంద్రమోహన్, జలంధర చేతుల మీదుగా ఈ బిరుదు ప్రదానోత్సవం జరిగింది. అనంతరం చంద్రమోహన్ మాట్లాడుతూ.. వంశీ రామరాజు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న సేవలను కొనియాడారు. కెనడా తెలుగువారి నుంచి మొదటిసారి ఇంత గొప్ప సన్మానాన్ని అందుకున్న మొదటి వ్యక్తి వంశీ రామరాజు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ‘తెలుగుతల్లి కెనడా’ ‘ఓంటారియో తెలుగు ఫౌండేషన్’ వంటి సంస్థలు తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాలకు చేస్తున్న సేవలను ప్రశంసించారు. విదేశాలలో ఉన్న సంస్థలు చేపట్టే ఇలాంటి కార్యక్రమాలు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయని రామరాజు హర్షం వ్యక్తంచేశారు.
వాలంటీర్ సేవలు అందించిన శ్రీవాణీ ముప్పళ్ల, ఝాన్సీ లక్ష్మి గరిమెళ్ల, హర్ష దీపిక రాయవరపు, ప్రసాద్ ఘట్టి, ప్రవీణ్ నీలా, ఆర్థిక సహాయం అందించిన సంస్థలు, విందు భోజనం ఏర్పాటు చేసిన రామ్, అమృత జిన్నాల, న్యాయ నిర్ణేతలు వసంతలక్ష్మి అయ్యగారి, ఝాన్సీలక్ష్మి రాపర్తి, సుభద్ర ప్రభ, పారిజాత బర్దిపూర్, శశికళ స్వామీ, సురేఖ మూర్తి, కార్యక్రమాన్ని నడిపించిన జోశ్యభట్ల, దమయంతికి ఈ సందర్భంగా నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.