చెక్ రిపబ్లిక్ : సీఎం కేసీఆర్ తలపెట్టిన జాతీయ పార్టీ మద్దతు కోసం యూరప్ పర్యటనలో ఉన్న టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల బుధవారం చెక్ రిపబ్లిక్లో ఎన్నారైలతో సమావేశమయ్యారు. టీఆర్ఎస్ చెక్ రిపబ్లిక్ శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ.. ఇది టీఆర్ఎస్ పార్టీకి 52 వ ఎన్నారై శాఖ అని పేర్కొన్నారు.
మిగతా యూరప్ దేశాల మాదిరిగానే ఇక్కడ కూడా విశేష స్పందన లభించిందన్నారు. ఏ ఎన్నారైని అడిగినా కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని ముక్త కంఠంతో నినదిస్తున్నారని ఆయన తెలిపారు మోదీ పాలనలో దేశాన్ని బ్రష్టు పట్టించారన్నారు. బీజేపీ పాలనలో రూపాయి విలువ పడిపోయిందన్నారు.
పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలకు రెక్కలొచ్చాయని పేర్కొన్నారు. కేంద్రం తెలంగాణకు ఆర్థిక సాయం చేయక పోగా చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ పాలనలో ద్రవ్యోల్బణం అట్టడుగు స్థాయికి చేరిందని విమర్శించారు.
మోదీ తీసుకున్న పాత నోట్ల రద్దు, పంటల మద్దతు ధర, అగ్నిపథ్ ఇలా అన్ని నిర్ణయాలు అట్టర్ ప్లాప్ అయ్యాయన్నారు.
అందుకే కేసీఆర్ జై జై.. మోడీ బై బై అని ప్రజలు నినదిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. త్వరలోనే చెక్ రిపబ్లిక్ కమిటీని ప్రకటిస్తామన్నారు . కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చెన్నై ,కర్నాటక, ఢిల్లీ ఎన్నారైలు రాఘవ రెడ్డి లోకసాని, పావని, ప్రేమ్, శిరీష, జై ప్రకాష్, ఆదిత్య, రవీంద్ర బాబు అరుణ్, శ్రీనాథ్, ప్రశాంత్, అభినవ్, బీరేన్ తదితరులు పాల్గొన్నారు.