లండన్ : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడం చాలా బాధాకరమని, ఆమె తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి అన్నారు. ప్రవాసులు సైతం గవర్నర్ తీరును తప్పుబడుతున్నారని, రాజ్యాంగ విలువలని కాపాడాల్సిన వారు ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇది దేశ ప్రతిష్ఠ దిగదార్చేలా ఉందని, వెంటనే తెలంగాణ గవర్నర్ను తొలగించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాసినట్లు అశోక్ గౌడ్ తెలిపారు.
అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశానికి ప్రపంచంలో గొప్ప గౌరవముందని, ఇలాంటి అప్రజాస్వామిక విధానం వల్ల దేశ ప్రతిష్ట దెబ్బతినే అవకాశముందన్నారు. గవర్నర్ విషయంలో రాష్ట్రపతి కల్పించుకొని వెంటనే తొలగించాలని కోరినట్టు లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెంది దేశానికే ఆదర్శమవుతుందని కేంద్ర మంత్రులు ప్రశంసిస్తుంటే, తెలంగాణ గవర్నర్ మాత్రం విమర్శించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి ఆటకంగా గవర్నర్ మారారని ధ్వజమెత్తారు.
ఈ సమావేశంలో ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరితో పాటు ముఖ్య నాయకులు రత్నాకర్ కడుదుల, హరి గౌడ్ నవపేట్, దొంతుల వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.