ఐటీ, సాఫ్ట్వేర్, ఉన్నత విద్య తదితర అవసరాల కోసం అమెరికాలో నివసిస్తున్న తెలంగాణ ఎన్ఆర్ఐలకు వీసా నిబంధనల్లో సడలింపులు కల్పించాలని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులను కోరారు. వివిధ దేశాల్లో పార్లమెంట్ల పనితీరుపై అధ్యయనం చేసేందుకు అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. వర్జీనియా 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ప్రతినిధి సుహాస్ సుబ్రమణ్యం, 11వ డిస్ట్రిక్ట్ ప్రతినిధి జేమ్స్ వాకిన్ షాలను కలిశారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలను ఏకం చేసి ఉద్యమించిన తీరు, అనంతరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పరిస్థితులను రవీందర్రావు వారికి వివరించారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు అంశాలపై అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులు ఆసక్తి కనబరిచినట్లు తెలిపారు. అదేవిధంగా అమెరికాలో పార్లమెంటు నిర్వహణ, ప్రజా సమస్యలను ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధానం గురించి ఎమ్మెల్సీ వారిని అడిగి తెలుసుకున్నారు.
అమెరికాలో 12 లక్షల మందికి పైగా తెలుగు ప్రజలు నివసిస్తున్నారని, వారిలో సుమారు 6 లక్షల మంది తెలంగాణకు చెందినవారని ఈ సందర్భంగా రవీందర్రావు తెలిపారు. ముఖ్యంగా టూరిస్ట్ వీసాల విషయంలో తెలంగాణ కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కాంగ్రెస్ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు.
ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని తెలంగాణకు చెందిన వారికి వివిధ రకాల వీసాల నిబంధనల్లో సడలింపులు కల్పించే అంశాన్ని అమెరికా పార్లమెంటులో ప్రస్తావించాలని కోరారు. అలాగే వెయ్యి డాలర్ల వీసా సంబంధిత ఫీజు చెల్లింపును తగ్గించే విషయాన్ని కూడా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ఎన్ఆర్ఐల సమస్యలను అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులు సానుకూలంగా విన్నారని, సంబంధిత అంశాలను పార్లమెంటులో ప్రస్తావించే విషయంలో హామీ ఇచ్చారని ఎమ్మెల్సీ రవీందర్రావు తెలిపారు. అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులను కలిసిన వారిలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావుతో పాటు సామాజిక విశ్లేషకులు పులి రవి, డాక్టర్ బిక్షం గుజ్జ ఉన్నారు.