అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్ విమానాశ్రయంలో ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం లభించింది. ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ , టిఆర్ఎస్ ఎన్నారై విభాగం అధ్యక్షుడు మహేష్ బిగాల, టిఆర్ఎస్ పార్టీ అమెరికా విభాగం నాయకులు కవితకు స్వాగతం పలికారు.
అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జూలై 1 నుంచి 3వ తేదీ వరకు ఆటా మహాసభలు-యూత్ కన్వెన్షన్ జరగనున్నాయి. ఆటా మహాసభల్లో తెలంగాణ పెవిలియన్ను ఎమ్మెల్సీ కవిత ప్రారంభించనున్నారు. అదే రోజు సాయంత్రం జరిగే ఆటా ప్రైమ్ మీట్లో పాల్గొనడంతోపాటు ఆటా బతుకమ్మపై ప్రచురించిన ప్రత్యేక సంచికను ఆమె ఆవిష్కరిస్తారు.