లండన్: దేశం గర్వించదగ్గ నాయకుడు కేటీఆర్ అని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి (Ashok Goud) అన్నారు. లండన్లో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే శాఖ ఆధ్వర్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ గౌడ్ మాట్లాడుతూ.. కేటీఆర్ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని, మరెన్నో ఉన్నతమైన స్థానాలు అధిరోహించాలని బ్రెంట్ఫోర్డ్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించామన్నారు.
భారతదేశంలో తెలంగాణకు, ఐటీ రంగానికి ప్రత్యేక గుర్తింపు రావడానికి కారణం కేటీఆర్ అని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే ప్రధాన కార్యదర్శి, టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల అన్నారు. హైదరాబాద్ ఇంత వేగంగా అభివృద్ధి కావడానికి కేటీఆర్ చేసిన కృషిని గుర్తుచేశారు. లండన్లో కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని, ప్రతి ప్రవాస బిడ్డ కేటీఆర్ వెంటే ఉంటామని కోశాధికారి సతీష్ రెడ్డి గొట్టెముక్కల చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరైన కార్యవర్గ సభ్యులందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకల్లో నవీన్ రెడ్డి, ప్రవీణ్ వీర, హరి గౌడ్ నవాబీపేట్, శ్రీకాంత్ జెల్ల, సత్య చిలుముల, జాయింట్ సెక్రటరీ మల్లారెడ్డి బీరం, రవి ప్రదీప్ పులుసు, రవి రేతినేని తదితరులు పాల్గొన్నారు.

