Somasegar : అగ్రరాజ్యం అమెరికా (USA) లో భారత సంతతి (Indian-Origin) కి చెందిన 59 ఏళ్ల సీనియర్ టెకీ సోమ సోమసేగర్ (S Somasegar) కన్నుమూశారు. సియోటెల్కు చెందిన వెంచర్ క్యాపిటల్ (Venture Capital) సంస్థ మద్రోనా వెంచర్ గ్రూప్ (Madrona Venture Group) కు మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన ఆకస్మికంగా మరణించారు. మద్రోనా వెంచర్ గ్రూప్ ఈ విషయాన్ని వెల్లడించింది. సోమసేగర్కు నివాళులు అర్పించింది. అయితే సోమసేగర్ మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
పుదుచ్చేరిలో జన్మించిన సోమసేగర్ మైక్రోసాఫ్ట్లో దాదాపు మూడు దశాబ్దాలపాటు ఎగ్జిక్యూటివ్గా పనిచేశారు. 2015లో మైక్రోసాఫ్ట్ నుంచి వైదొలిగిన ఆయన.. మద్రోనా వెంచర్ గ్రూప్లో ఎండీగా చేరారు. అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా పలు స్టార్టప్ కంపెనీల్లో ఆయనకు పెట్టుబడులు ఉన్నాయి. కాగా సోమసేగర్ మరణవార్తకు కొన్ని గంటల ముందే.. 2026 సంవత్సరానికిగాను ఎర్లీ స్టేజ్ ఇన్వెస్టర్లను గుర్తించే SEED 100 జాబితాలో సోమసేగర్కు చోటుదక్కింది.
సోమసేగర్ ఆకస్మిక మరణంపై టెక్ పరిశ్రమలోని ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయనకు నివాళులర్పిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వద్ద ఏఐ సలహాదారుగా ఉన్న భారత సంతతికి చెందిన శ్రీరామ్కృష్ణన్ కూడా సోమసేగర్కు నివాళులు అర్పించారు. తన కెరీర్లో సోమసేగర్ పాత్ర కీలకమంటూ ఎక్స్లో భావోద్వేగమైన పోస్టు పెట్టారు. ఇక మైక్రోసాఫ్ట్లోని పలువురు మాజీ సహ ఉద్యోగులు కూడా సంతాపం తెలిపారు.