వాషింగ్టన్: మరో నెలరోజుల్లో అయోధ్య రామాలయం (Ram Mandir) ప్రారంభం కానుంది. వచ్చేఏడాది జనవరి 22న అద్భుతంగా కళాఖండగా తీర్చిదిద్దిన ఆలయంలో రాములవారికి ప్రాణప్రతిష్ఠ (Pran Pratishtha) చేయనున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని వాషింగ్టన్ డీసీ మేరీలాండ్లో ఉన్న భక్త ఆంజనేయ ఆలయం వద్ద అమెరికన్ హిందువులు (Hindu Americans) భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో పదేండ్ల చిన్నారుల నుంచి 70 ఏండ్ల వయస్సున్న పెద్దల వరకు పెద్దసంఖ్యలో హిందువులు పాల్గొన్నారు. అయోధ్య వేగా నామకరణం చేసిన రోడ్డులో చేతుల్లో కాషాయ జెండాలు పట్టుకుని కార్లు, బైకులతో ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా అమెరికా డీసీ చాప్టర్ విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు మహేంద్ర సాపా మాట్లాడుతూ.. రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ర్యాలీ తీశామన్నారు. రామ మందిర నిర్మాణం కోసం 500 ఏండ్లుగా పోరాడుతున్న హిందువుల కల త్వరలో నెరవేరబోతున్నది. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని వాషింగ్టన్ డీలో జనవరి 20ను తాము కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా రామ్ లీలా, శ్రీరాముని చరిత్ర, రామ భజనల వంటివి ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు వెయ్యి అమెరికన్ హిందూ కుటుంబాలు పాల్గొంటున్నాయని తెలిపారు. చిన్నారులతో 45 నిమిషాలపాటు శ్రీరాముని జీవిత చరిత్రను చెప్పించబోతున్నామని వెల్లడించారు.
వచ్చే ఏడాది జనవరి 22న అయోధ్యలోని రామాలయం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. మధ్యాహ్నం 12.45 గంటలకు రాముని ప్రాణప్రతిష్ట చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అయోధ్య రామమందిర ట్రస్టు ఇప్పటికే ముమ్మరం చేసింది.ఈ నేపథ్యంలో అయోధ్య రామ మందిరాన్ని చేరుకోవాలనుకుంటున్న కోట్లాది మంది భక్తులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. దేశం నలుమూలల నుంచి 1000 రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. జనవరి 19 నుంచి 100 రోజులపాటు ఈ రైళ్లను నడుపుతామని రైల్వే వర్గాలు తెలిపాయి. ఢిల్లీ, ముంబై, కోల్కతా, పుణె, నాగ్పూర్, లక్నో, జమ్ము, బెంగళూరు..ఇలా అన్ని ప్రాంతాల్లోని నగరాలను అయోధ్యకు కలుపుతూ 100 రోజులపాటు రైల్వే సేవల్ని కొనసాగిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. రోజూ 50 వేల మంది స్టేషన్లో దిగే విధంగా అయోధ్య స్టేషన్ను రీడిజైన్ చేశామన్నారు.
జనవరి 22న ఆలయ ప్రారంభోత్సవ వేడుక నిమిత్తం అయోధ్యకు రావొద్దని ‘రామ మందిర్ ట్రస్ట్’ సెక్రెటరీ చంపత్ రాయ్ భక్తులను కోరారు. ‘విగ్రహ ప్రతిష్ఠకు ఆలయం సిద్ధం. కానీ ఆలయ నిర్మాణం పూర్తి కావాలంటే మరో రెండేండ్లు పడుతుంది. చాలా పనులు జరగాల్సి ఉంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని, వారిని రావొద్దని సూచిస్తున్నా. ఆ రోజు భక్తులు తమకు దగ్గర్లో ఉన్న ఆలయానికి వెళ్లాల్సిందిగా కోరుతున్నా’ అని అన్నారు.
#WATCH | Hindu Americans in the Washington, DC area organized a mini car and bike rally at a local Hindu Temple, Shri Bhakta Anjaneya Temple in the street ‘Ayodhya Way’ to celebrate the upcoming Pran Pratishtha’ at the Ayodhya Ram Temple pic.twitter.com/6EQQ1yHHwp
— ANI (@ANI) December 16, 2023