Calgary | కాల్గరీ కెనడాలో గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. శ్రీ అనఘా దత్త సొసైటీ ఆఫ్ కాల్గరీ, శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో అట్టహాసంగా ఈ వేడుకలు జరిగాయి. ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయ ధర్మకర్తలు శ్రీమతి లలిత ద్వివేదుల, శైలేష్ భాగవతుల ఆధ్వర్యంలో కాల్గరీ నగర డౌన్టౌన్ వీధుల్లో గణపతి ఊరేగింపును కన్నులపండువగా జరిపారు.
గణపతి నవరాత్రులు, ఊరేగింపు కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించేందుకు చాలామంది వ్యాపారులు, వాలంటీర్లు ప్రత్యేక సహాయాన్ని అందించారు. లలిత ద్వివేదుల ఆధ్వర్యంలో సుమారు 800 మందికి పైగా వాలంటీర్లు రేయింబవళ్లు శ్రమించి నవరాత్రి వేడుకలను జయప్రదం చేశారు.
ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రాజ్కుమార్ శర్మ ప్రతిరోజు గణపతి అభిషేకము, అర్చన, గణపతి హోమం, హారతులు విధిగా నిర్వహించారు. డౌన్టౌన్ వీధుల్లో గణపతి ఊరేగింపు కోసం ట్రక్కును హెచ్&హెచ్ డెకర్స్, హేమ, హర్షిణి ట్రక్ ను ఎంతో అందంగా అలంకరించారు. గణపతి యాత్రకు కాల్గరీ ఎమ్మెల్యే పీటర్ సింగ్ ప్రత్యేక అతిథిగా విచ్చేసి ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాల్గరీ నగరంలో ఇలాంటి దైవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు శ్రీ అనఘా దత్త యాజమాన్యాన్ని ఆయన ప్రశంసించారు. భారతీయ సంప్రదాయాన్ని చాటిచెప్పే ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని కోరారు. అల్బెర్టా ప్రావిన్స్ కల్చర్ డేస్ను పురస్కరించుకుని భారతీయ శాస్త్రీయ కళలు, నృత్య కచేరీలు, హిందూ వారసత్వ వేడుకలు నిర్వహిస్తున్నందుకు లలిత, శైలేష్లను అభినందించారు.
అంతకుముందు గణపతి తాళం, అర్చన, హారతితో గణపతి ఊరేగింపును అర్చకులు రాజ్కుమార్ ప్రారంభించగా.. శ్రీ గణేష్ మహరాజ్ కీ జై” అనే నినాదాలతో భక్తులు ఉత్సాహంగా శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోహిత్, ఓం సాయి, ఫణి భజనలు, పాటలతో గణపతిని స్తుతించారు. కాల్గరీ సిటీ మునిసిపల్ హాల్ వద్ద మొదలైన గణపతి ఊరేగింపు షా మిలీనియం పార్క్ చేరుకునే వరకు సుమారు 500కు పైగా భక్తులు ఆనందంతో నాట్యం చేస్తూ గణపతి నామ సంకీర్తన చేశారు.
ఉత్తర అమెరికా ఖండంలో ఇటువంటి వేడుకలు జరపడం కష్టమైనప్పటికీ శ్రీ అనఘా దత్తా సొసైటీ ఆఫ్ కాల్గరీ యాజమాన్యం, సభ్యులు ఎన్నో దైవ కార్యక్రమాలు నిర్వహిస్తూ, రానున్న భావితరాలకు భారత సంప్రదాయ పూల బాటలు వేస్తున్నారని అందరూ ప్రశంసించారు. ఊరేగింపు ముగిసిన తర్వాత గణపతికి హారతి ఇచ్చి భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు.
కెనడాలో హిందూ వారసత్వ వేడుకల్లో భాగంగా నిర్వహించిన వయోలిన్ కచేరీలో కెనడాలో, యూఎస్లో ఉన్న విద్వాంసులైన srimathi Aarathi shankar, Srimati Anjana Srinivasan వయోలిన్ వాయించగా.. శ్రీ ఆదిత్య నారాయణ్ మృదంగంతో, శ్రీ రమణ ఇంద్ర కుమార్ ఘటంతో , శ్రీ రత్తన్ సిద్ధు తంబురాలతో సహకరించారు. కచేరీ అనంతరం విద్వాంసులు అందర్నీ అనఘా దత్త సంఘం అధ్యక్షురాలు లలిత బహుమతులతో ఘనంగా సత్కరించారు.
అక్టోబర్లో దేవీ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు లలిత, స్వచ్ఛంద సేవకులైన శోభన నాయర్, మాధవి చల్లా, మాధవి నిట్టల, కళైజ్ఞర్ సంతానం, అర్చకులు రాజ్కుమార్ సన్నాహాలు చేస్తున్నారు. శ్రీ అనఘా దత్త సంఘం నిర్వహించే దేవీ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనే వేలాది మంది భక్తులతో కాల్గరీ నగరం కాస్త.. కాళి గిరిగా మారుతుందని భక్తులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.