హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధనకు 14 ఏండ్ల క్రితం కేసీఆర్(KCR) చేసిన దీక్ష చరిత్రాత్మకమని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ బహ్రెయిన్ (NRI BRS Bahrain) శాఖ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ అన్నారు. అహింసా మార్గంలో కొనసాగిన దీక్ష వల్ల ఢిల్లీ మెడలు వంచి కేసీఆర్ తెలంగాణ సాధించారని పేర్కొన్నారు. చావునోట్లో తలపెట్టిన కేసీఆర్ ప్రాణాలను లెక్క చేయకుండా స్వరాష్ట్ర స్వప్నాన్ని విజయతీరాలకు చేర్చారని తెలిపారు. ‘
ఉద్యమంలో ఎత్తిన జెండా దించను. దించితే నన్ను రాళ్లతో కొట్టండి’ అనే మొక్కవోని ధైర్యంతో లక్ష్యాన్ని సాధించారని అన్నారు. 75 సంవత్సరాల భారత రాజకీయాల్లో అనేక పార్టీలు వచ్చి పోయినా టీఆర్ఎస్ మాత్రం చరిత్రలో సువర్ణాధ్యయం లిఖించడానికి సాహసోపేత అడుగులు వేసిందని తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డ తరువాత 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమం, అభివృద్ధిలో దూసుకెళుతోందన్నారు. బుధవారం జరిగే ఎన్నికల్లో ఓటర్లు ఆలోచించి ఓటువేయాలని పిలుపునిచ్చారు.