BRS USA : ‘పోక్సో’ కేసులో నిందితుడు బండి భగీరథ్(Bandi Bageerath)ను ఎనిమిది రోజులు దాచి పెట్టిన కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) రాజీనామా చేయాలని BRS USA నాయకుడు శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. పోక్సో కేసులో బండి భగీరథ్ పేరు రావడం, అనంతరం జరిగిన అరెస్టు – లొంగుబాటు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని వివిధ రాష్ట్రాలకు చెందిన BRS USA కార్యకర్తలు, నాయకులు అత్యవసర ఆన్లైన్ సమావేశం నిర్వహించి కీలక డిమాండ్లు చేశారు.
BRS USA ప్రతినిధులు మాట్లాడుతూ.. “ఒక మైనర్ బాలికకు సంబంధించిన అత్యంత సున్నితమైన కేసులో నిందితుడు రోజుల తరబడి పరారీలో ఉండటం, ఆ తర్వాత అతడు స్వయంగా లొంగిపోయాడా? లేక పోలీసులు అరెస్టు చేశారా? అన్న విషయంపై కూడా స్పష్టత లేకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు” అని పేర్కొన్నారు. అలాగే, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్న బండి సంజయ్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
“దేశానికి చట్టాల గురించి ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో ఉన్న నాయకుడి కుటుంబ సభ్యుల పేరు ఇలాంటి వివాదాల్లో రావడం చాలా దురదృష్టకరం. బాధితురాలికి న్యాయం జరిగేలా, విచారణ నిష్పక్షపాతంగా సాగాలంటే బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. లేకుంటే ప్రధాని నరేంద్ర మోడీ ఆయన్ను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి” అని BRS USA నాయకులు పేర్కొన్నారు. తెలంగాణలో మహిళల భద్రత, మైనర్ బాలికల రక్షణ అంశాల్లో రాజకీయ పార్టీలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని వారు ఆరోపించారు.
“సాధారణ ప్రజలకు సంబంధించిన కేసుల్లో పోలీసులు 24 గంటల్లో చర్యలు తీసుకుంటారు. కానీ రాజకీయ ప్రభావం ఉన్నప్పుడు విచారణలో ఎందుకు ఆలస్యం జరుగుతోంది? ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదు?” అని రేవంత్ రెడ్డి సర్కార్ను ప్రశ్నించారు. పోక్సో కేసులో బండి భగీరథ్ అరెస్ట్తో తెలంగాణ రాజకీయాల్లో మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఈ ఘటనపై బీజేపీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తుండగా, సోషల్ మీడియాలో “హైబ్రిడ్ అరెస్టు”, “హైబ్రిడ్ న్యాయం” అనే వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరలవుతున్నాయి.
అమెరికాలోని అట్లాంటా, డల్లాస్, హ్యూస్టన్, ఆస్టిన్, చికాగో, న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, ఫీనిక్స్, ఫిలడెల్ఫియా, సాన్ ఆంటోనియో, సాన్ డియాగో, బోస్టన్, వర్జీనియా, Columbus, Delaware, Connecticut, తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 1,000 మందికి పైగా కార్యకర్తలు పాల్గొన్న ఆన్లైన్ సమావేశంలో ఈ డిమాండ్ను ఏకగ్రీవంగా వ్యక్తం చేసినట్లు BRS USA ప్రతినిధులు తెలిపారు. “బాధితురాలికి న్యాయం జరగాలి. చట్టం అందరికీ సమానంగా ఉండాలి. రాజకీయ ప్రభావంతో నిజాలు మసకబారకూడదు” అని సమావేశంలో పాల్గొన్న ఎన్నారై నాయకులు స్పష్టం చేశారు.