హైదరాబాద్: గల్ఫ్ కార్మికులకు కూడా బీమా సదుపాయం వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించడంపై బీఆర్ఎస్ ఖతర్ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగౌని హర్షం వ్యక్తంచేశారు. నిజామాబాద్ రూరల్, డిచ్పల్లి ఆశీర్వాద సభల సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాగానే గల్ఫ్ కార్మికులకు కూడా బీమా సదుపాయం (Gulf Insurance) కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసులు ఆనందం వ్యక్తంచేస్తున్నారని శ్రీధర్ అబ్బగౌని అన్నారు.
ఇదే విషయమై బీఆర్ఎస్ ఖతర్ తరఫున తాము గతంలోనే విజ్ఞప్తి చేశామని, దానికి సానుకూలంగా స్పందించి ఎన్నికల వాగ్ధానంలో గల్ఫ్ బీమాను ప్రకటించినందుకు గల్ఫ్ కార్మికుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. గల్ఫ్ సంక్షేమ బోర్డుతోపాటు ఎన్ఆర్ఐ పాలసీ కూడా రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే ఏర్పాటు చేస్తుందన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి పనిచేస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల కష్టాలు సైతం తీరుస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా గల్ఫ్ కార్మికులంతా తమ కుటుంబాల ఓట్లు బీఆర్ఎస్కు వేసి మళ్లీ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.