లండన్ : గత సంవత్సరం అక్టోబర్ 2021 లో లండన్ వేదికగా తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (TAUK ) ఆధ్వర్యంలో టాక్ – చేనేత బతుకమ్మ, దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈసందర్భంగా సామాజిక బాధ్యతతో కరోనా సమయంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సేవలందించిన నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS UK), ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వారియర్స్కు కృతజ్ఞతలు తెలుపుతూ లండన్ టవర్ బ్రిడ్జి ఆకృతిని ఏర్పాటు చేసిన విషయం అందరికి తెలిసిందే.
టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం – ప్రభలత దంపతుల కూతురు నిత్యశ్రీ టాక్ సంస్థ బతుకమ్మ వేడుకల వేదికగా జరిగిన విషయాలను ప్రత్యేకించి నేషనల్ హెల్త్ సర్వీస్(NHS UK), ప్రపంచవ్యాప్త కోవిడ్ వారియర్స్కు కృతజ్ఞతలు తెలిపిన విధానాన్ని ప్రవాస తెలంగాణ బిడ్డలు బతుకమ్మ వేడుకల్ని జరుపుకొనే విషయాలతో బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ లీమింగ్ కు లేఖ రాసింది.
ఆ లేఖకు బ్రిటన్ మహారాణి కార్యాలయం నుంచి నిత్యశ్రీకి లేఖ అందింది. ఆ లేఖలో మహారాణి బతుకమ్మ వేడుకుల ఫోటోలను చూసి సంతోషం వ్యక్తం చేశారని, ముఖ్యంగా వేడుకల్లో నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS UK), ప్రపంచవ్యాప్త కోవిడ్ వారియర్స్కు కృతజ్ఞతలు తెలుపడం ఎంతో బాగుందని, టాక్ సంస్థ కృషిని అభినందించినట్టు పేర్కొన్నారు. అలాగే మహారాణి దృష్టికి ఈ విషయాలని తీసుకొచ్చిన నిత్యశ్రీని కూడా ప్రత్యేకంగా అభినందించారు.
టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల ఈసందర్భంగా మాట్లాడుతూ… బ్రిటన్ మహారాణి టాక్ సంస్థను అభినందించడం ఎంతో సంతోషకరమైన విషయం అన్నారు. అలాగే.. ఈ విషయాన్ని మహారాణి దృష్టికి తీసుకెళ్లిన నిత్యశ్రీని రత్నాకర్ ప్రత్యేకంగా అభినందించారు. అలాగే.. టాక్ కార్యవర్గ సభ్యులను కూడా రత్నాకర్ అభినందించారు. ఇక నుంచి రెట్టింపు ఉత్సాహంతో టాక్ సంస్థ పనిచేస్తుందని.. ప్రవాస బిడ్డలకు సేవలందిస్తుందని.. మన సంస్కృతి సంప్రదాయలను ప్రపంచానికి చాటి చెబుతుందని రత్నాకర్ స్పష్టం చేశారు.