వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోమారు భారత ఐటీ నిపుణులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలోని ఐటీ, ఇతర రంగాల్లో సేవల కోసం ఆయా సంస్థలు భారతీయ నిపుణులకు హెచ్-1 బీ వీసా కల్పిస్తాయి. అయితే, అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి గెలుచేందుకు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. అమెరికన్లకు ఉద్యోగావకాశాలు కల్పించి, మళ్లీ గెలుపొందాలన్న లక్ష్యంతో డొనాల్డ్ ట్రంప్ తన హయాంలో హెచ్-1బీ వీసాపై వచ్చే విదేశీ నిపుణుల కనీస వేతనం పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు.
కానీ అమెరికన్లు గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ వైపు మొగ్గు చూపారు. తాజాగా హెచ్-1 బీ వీసాదారుల కనిష్ట వేతనాలను పెంచాలని ట్రంప్ జారీ చేసిన వివాదాస్పద ఆదేశాల అమలును నిలిపివేస్తూ శుక్రవారం బైడెన్ ఆదేశాలు జారీ చేశారు. భారత్తోపాటు చైనా నుంచి అత్యధికంగా ఐటీ నిపుణులు అమెరికాలోని సంస్థల్లో హెచ్-1బీ వీసా కింద సేవలందిస్తూ ఉంటారు. ఈ రెండు దేశాల నుంచి టెక్నాలజీ సంస్థలు వేల మంది నిపుణులను ప్రతియేటా నియమించుకుంటాయి.
ఇంతకుముందు ఫిబ్రవరి ఒకటో తేదీన ట్రంప్ వివాదాస్పద ఆదేశాలను జనవరి 14 నుంచి రెండు నెలల పాటు అమలు చేయరాదని పేర్కొంటూ అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మే 14 వరకు ట్రంప్ ఆదేశాలను నిలిపివేస్తూ మరోసారి ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాతే ట్రంప్ ఆదేశాలపై బైడెన్ తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.