జొహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికాలోని (South Africa) జొహన్నెస్బర్గ్లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ సౌతాఫ్రికా (AASA) ఆధ్వర్యంలో పచ్చదనం వాకిట్లో, తెలుగువెలుగుల జిలుగుల్లో ఆహ్లాదంగా, కన్నులపండువగా జరిగిన ఈ ఉత్సవాలకు (Ugadi Celebrations) అక్కడి తెలుగువారు భారీగా హాజరయ్యారు. సంప్రదాయ వస్త్రధారణతో వందలాదిగా హాజరైన జనంతో తెలుగుదనం వెల్లివిరిసింది. చిన్నారుల, స్త్రీల ఆటపాటలతో వసంతం విరబూసినట్లయ్యింది. ముఖ్యంగా యువతీయువకులు ప్రదర్శించిన నృత్యరూపకాలు ఆహుతులను ఉర్రూతలూగించాయి. తెలుగు వారికే సొంతమైన ప్రత్యేక వంటకాలు ఈ వేడుకకు మరింత వన్నెతెచ్చాయి.
కాగా, ఉగాది సందర్భంగా నిర్వహించిన క్రీడాపోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. దక్షిణాఫ్రికాలోని తెలుగు ప్రజలను కలుపుతూ తెలుగు సంస్కృతిని చాటిచెప్పేందుకు ఆశ చేస్తున్న కృషిని అక్కడివారు అభినందించారు.
ఇంతే ఆనందంగా, ఇంతకన్నా గొప్పగా ఇకముందు సేవా కార్యక్రమాలు జరుగుతాయని ఆశ బృందం పేర్కొంది. దేశాలు దాటినా కన్నభూమి కన్నీళ్లను తుడుస్తూ ఎన్నో బ్రతుకుల్లో కొత్త ఆశ పుట్టిస్తున్న ‘ఆశ’ స్ఫూర్తిని పలువురు వక్తలు మెచ్చుకున్నారు.