నిజాంసాగర్ ఆయకట్టు రైతులు కేవలం ప్రాజెక్టుపైనే ఆధారపడి వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే పంటల సాగుకు సిద్ధమయ్యేవారు. బోరుబావులు ఉన్న రైతులు మే, జూన్నెలలో పంటలు సాగు ప్రారంభిస్తారు. ప్రాజెక్టుపై ఆధారపడిన రైతులు మాత్రం వర్షాలు కురిసి, జూలై నెలలో ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో ప్రారంభమైన అనంతరం పొలం పనులకు సిద్ధమయ్యేవారు. సీఎం కేసీఆర్ కృషితో రెండేండ్లుగా కాళేశ్వరం నీరు నిజాంసాగర్కు చేరడంతో బోరుబావులు లేని రైతులు సైతం మే నెలలోనే పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. రెండేండ్లుగా ఏప్రిల్ మాసంలో సైతం ప్రాజెక్టులో నీటి నిల్వలు ఉండడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నిజాంసాగర్, ఏప్రిల్ 12 : ప్రతి యేడు నిజాంసాగర్ ఆయకట్టు కింద బోరుబావులు లేని రైతన్నలు కేవలం నిజాంసాగర్ ప్రాజెక్టుపైనే ఆధారపడుతూ వర్షాల కోసం ఎదురు చూసేవారు. వర్షాలు కురిసి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి నీరు వస్తేనే ఆయకట్టు రైతులు వానకాలం సాగుకు సిద్ధమయ్యేవారు. ఆయకట్టు కింద బోరుబావులు ఉన్న రైతులు మే, జూన్లోనే పంటలను సాగు చేస్తుండగా నిజాంసాగర్ ప్రాజెక్టుపై ఆధారపడిన రైతులు మాత్రం జూలై మొదటి వారం నుంచి చివరి వారం వరకు పంటల సాగుకు శ్రీకారం చుట్టేవారు. అలాంటిది గత రెండు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో కాళేశ్వరం నీరు నిజాంసాగర్కు రావడంతో బోరుబావులు లేని రైతులు సైతం వానకాలం సాగుకు మే నుంచే సిద్ధమవుతున్నారు. 2021 సంవత్సరంలో కాళేశ్వరం నీటిని నిజాంసాగర్కు తీసుకురావడంతో గత సంవత్సరం 2022లో, ప్రస్తుతం 2023లో నిజాంసాగర్ ప్రాజెక్టులో ఏప్రిల్ నెలలో సైతం నీరు నిల్వ ఉండడంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మే నెలలోనే సాగుకు సిద్ధపడుతున్న రైతన్నలు
నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద అలీసాగర్ వరకు 1.10 లక్షల ఎకరాలు ఉండగా ఇప్పటికే నస్రుల్లాబాద్, బీర్కూర్, వర్ని, బోధన్, ఎడపల్లి, కోటగిరి మండలాల్లో యాసంగి పంటలు చేతికి అందనున్నాయి. వారంతా మే చివరి వారంలో దుక్కులు దున్నుకొని వరినాట్లు వేసేందుకు సిద్ధపడుతున్నారు. నిజాంసాగర్, బాన్సువాడ మండలాల్లో మాత్రం జూన్ నెలలో పంటల సాగుకు శ్రీకారం చుట్టనున్నారు. నిజాంసాగర్, బాన్సువాడ ఆయకట్టు రైతులకు అంతగా బోరుబావులు లేకపోవడంతో కేవలం నిజాంసాగర్ ప్రాజెక్టుపైనే ఆధారపడి ఉండడంతో వర్షాలు కురిసి నిజాంసాగర్లోకి ఇన్ఫ్లో వస్తేనే తుకాలు వేసేందుకు ముందుకు కదిలేవారు. అలాంటిది ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 5.55 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
5.55 టీఎంసీల నీరు నిలువ
నిజాంసాగర్ ప్రాజెక్టులో ఏప్రిల్ -మే నెలలో ఎప్పుడు నీటి నిల్వలు అంతగా ఉండేవి కావు. గత సంవత్సరం ఏప్రిల్-మే 2022 సంవత్సరంలో 7.48 టీఎంసీల నీరు నిల్వ ఉండగా ప్రస్తుతం 5.55 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రతి యేడు వర్షాలు కురిసి నిజాంసాగర్లోకి ఇన్ఫ్లో వస్తేనే వానకాలం పంటలు వేసేవాళ్లమని, అలాంటిది ఈ యేడు సాగర్లోకి ఇన్ఫ్లో వైపు చూడకుండా పంటల సాగుకు శ్రీకారం చుడుతున్నామని రైతులు అంటున్నారు.
మే నెలలోనే సాగుకు శ్రీకారం చుట్టనున్నాం
నిజాంసాగర్ ఆయకట్టు కింద మాకు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. బోరుబావులు లేవు. కేవలం నిజాంసాగర్ ప్రాజెక్టుపైనే ఆధారపడి సాగు చేస్తున్నాం. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో వస్తుందనే ఆశతో గతంలో ఎన్నో సార్లు తుకాలు వేసాం. కొన్ని సార్లు ఇన్ఫ్లో రాక నిజాంసాగర్లో నీరు లేక వానకాలం సైతం సాగుకు నీరు అందక పంట చేతికి రాకుండాపోయాయి. ప్రతి యేడు వానకాలంలో నిజాంసాగర్లోకి నీరు వస్తేనే సాగుకు సిద్ధమయ్యేవాళ్లం. అలాంటిది ఈ యేడు కాళేశ్వరం పుణ్యమా అని మే నెలలోనే సాగుకు శ్రీకారం చుట్టేందుకు ముందుకు సాగుతున్నాం.
– జీవన్, రైతు, బుర్గుల్
ఆయకట్టుకు ఎలాంటి ఢోకా లేదు
నిజాంసాగర్ ఆయకట్టు కింద పంట సాగు చేస్తే చేతికి అందే వరకు అనుమానంగానే ఉండేది. వర్షాలు కురిసి రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండి పొంగిపొర్లుతుంటే నిజాంసాగర్లోకి మాత్రం చుక్క నీరు వచ్చేది కాదు. నిజాంసాగర్, సింగూరు ఎగువ భాగంలో ఎన్నో అక్రమ ప్రాజెక్టులు నిర్మించడంతో నిజాంసాగర్ ప్రాజెక్టు కొన్ని సంవత్సరాల నుంచి నీరులేక బోసిపోయేది. అలాంటిది కేసీఆర్ సారు పుణ్యమా అని కాళేశ్వరం నీరు నిజాంసాగర్కు రావడంతో ఆయకట్టు కింద మా లాంటి రైతులకు ఉపిరి పోసినట్లయ్యింది.
– కంచుమల్లె నరేశ్, రైతు, గున్కుల్
ఎన్నో ఏండ్ల కల
ఎన్నో ఏండ్ల కల నేరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మించిన సమయంలో రెండు పంటలకు ఇబ్బందులు లేకుండా సాగు నీరు అందేది. అలాంటిది రోజులు గడిచే కొద్ది మహారాష్ట్ర, కర్నాటక ప్రాంతాల్లో అక్రమ ప్రాజెక్టులు నిర్మించడంతో నిజాంసాగర్ ఆయకట్టు కింద బోరుబావులు ఉన్న రైతులు మాత్రమే మే, జూన్ నెలలో సాగుకు సిద్ధమయ్యేవారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం నీటిని నిజాంసాగర్కు తీసుకురావడంతో ఈ సమయంలో ప్రాజెక్టులో 5.55 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
– గంగారెడ్డి, సీడీసీ చైర్మన్, ఆయకట్టు రైతు, కొమలంచ
ఆయకట్టు రైతులకు కాళేశ్వరం ఓ భరోసా
నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు కాళేశ్వరం నీటిరాక ఓ భరోసాగా మారింది. ఎన్నడూ లేని విధంగా నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ ఉంది. నిజాంసాగర్ నుంచి అలీసాగర్ వరకు 1.10 లక్షల ఎకరాల సాగుకు రైతులు సిద్ధ కానున్నారు. మొదటి ఆయకట్టు రైతులు సైతం ముందుగానే పంటల సాగుకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. రెండు సంవత్సరాల నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టులో ఏప్రిల్-మే నెలలో సైతం నీటి నిల్వ ఉండడంతో ఆయకట్టు రైతులు సంతోషంగా ఉన్నారు.
– సొలోమాన్, ఈఈ నీటి పారుదల శాఖ