విద్యానగర్, అక్టోబర్ 22 : యూట్యూబ్లో చూసి నకిలీ నోట్లను తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేసినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఈ ముఠా సభ్యులు భైంసా కేంద్రంగా నకిలీ కరెన్సీని ముద్రించి చెలామణి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముఠాకు సంబంధించిన వివరాలను శనివారం ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 21న టేక్రియాల్ సమీపంలో దేవునిపల్లి ఎస్సై ప్రసాద్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టగా ఓబైద్ఖాన్ పఠాస్, ఉమర్ ఇద్దరు పోలీసులను చూసి వాహనం(ap 09 ba 8339)లో పారిపోయేందుకు ప్రయత్నించారని తెలిపారు.
పోలీసులు వారిని వెంబడించి పట్టుకుని విచారించగా మతిన్, హుస్సేన్తోపాటు స్థానికంగా ఉన్న మొయిజ్ నకిలీ నోట్లను ముద్రించి చెలామణి చేస్తున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. వీరితోపాటు మరో ఇద్దరు భైంసా కేంద్రంగా నకిలీ నోట్లను ముద్రిస్తున్నట్లు తేలడంతో వీరిని కామారెడ్డి రూరల్ సీఐ శ్రీనివాస్ భైంసాకు తీసుకువెళ్లారని తెలిపారు. అక్కడ వారి నుంచి 500 రూపాయల దొంగనోట్లు, రెండు మోటర్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మరో నిందితుడు మోహిజ్ నుంచి డెల్యాప్టాప్, టీవీ, కీబోర్డు, ల్యామినేషన్ మిషన్, కలర్ ప్రింటర్ తదితర పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరందరూ కలిసి యూట్యూబ్లో చూసి నోట్ల తయారీ విధానం తెలుసుకుని సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి దొంగనోట్ల తయారీ, చెలామణి చేస్తున్నారని చెప్పారు. ఈ కేసులో మహ్మద్ ఉమర్, నాందెడ్ (ఏ-1), ఓబైద్ఖాన్ పఠాస్, నిజామాబాద్ (ఏ-2), షేక్ హుస్సేన్, నాందెడ్(ఏ-3), మతిస్ ఖాన్, భైంసా(ఏ-4), అబ్దుల్ మొయిజ్, భైంసా(ఏ-5) నిందితులుగా గుర్తించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన రూరల్ సీఐ శ్రీనివాస్, టాస్క్ఫోర్సు సీఐ వీరయ్య, దేవునిపల్లి ఎస్సై ప్రసాద్, సీసీఎస్ సిబ్బంది ఉస్మాన్ను ఎస్పీ అభినందించారు.