డిచ్పల్లి, జూన్ 16 : టీయూ రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ యాదగిరిని నియమిస్తూ వైస్ చాన్స్లర్ రవీందర్ గుప్తా శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆర్డర్ కాపీని స్వీకరించిన రిజిస్ట్రార్ యాదగిరి.. టీయూ పాలక మండలి సభ్యులు, హైయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ, విద్యాశాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్కు ఫోన్ ద్వారా సమాచారం అందించి ఆర్డర్కాపీని వాట్సాప్ చేశారు. వారి సూచన మేరకు రిజిస్ట్రార్గా యాదగిరి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన చాంబర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. టీయూలో పనిచేస్తున్న నాన్టీచింగ్ సిబ్బంది వేతనాలు అందక ఐదు రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారని, వారందరూ శనివారం నుంచి విధుల్లో చేరాలని కోరారు. సోమవారంలోగా వేతనాలు వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు భోజనాల కోసం ఇబ్బందులు పడుతున్న సమస్యతోపాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు త్వరలో చెల్లించేలా చర్య లు తీసుకోవాలని ఈసీ సభ్యులు సూచించినట్లు తెలిపారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందిచేందుకు కిందిస్థాయి సిబ్బంది నుంచి పైస్థాయి వరకు అంకితభావంతో పనిచేయాలని కోరారు. డిగ్రీ విద్యార్థులకు ప్రస్తు తం పరీక్షలు కొనసాగుతున్నాయని, వాటిని సకాలంలో పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు పీజీసెట్ 2023 ఎంట్రెన్స్కు సన్నద్ధమయ్యే విధంగా ఫలితాలను త్వరగా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. సిబ్బందికి వేతనాలు అందేలా హైకోర్టు ఫైనాన్షియల్ సంబంధిత ప్రక్రియను హైయ్యర్ ఎడ్యుకేషన్ కమిషనర్ వాకాటి కరుణ పూర్తిచేశారని, సోమవారం అందరికీ వేతనాలు అందుతాయని స్పష్టంచేశారు.
తెలంగాణ విశ్వవిద్యాలయం పాలక మండలి సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని రూసా భవనంలో నిర్వహిస్తారని రిజిస్ట్రార్ యాదగిరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి సంబంధించి వీసీ రవీందర్, పాలక మండలి సభ్యులకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. ఎజెండా అంశాలు, గతంలో తీసుకున్న నిర్ణయాలు, కొత్తగా తీసుకుబోయే నిర్ణయాలపై చర్చించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికైనా వీసీ హాజరవుతారా లేదా అన్న అనుమానాలు సైతం లేకపోలేదు. రిజిస్ట్రార్ నియామకం జరిపిన వీసీ.. వెంటనే హైదరాబాద్కు పయనమయ్యారు.
టీయూ రిజిస్ట్రార్ల నియామకాలతో నిత్యం వార్తలకెక్కిన వీసీ రవీందర్ గుప్తా.. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో తోక ముడిచారు. వీసీ నుంచి ఆర్థిక లావాదేవీలను హైయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి బదిలీ చేయడంతో వీసీ ఎటూ తోచక టీయూకి చేరుకొని రిజిస్ట్రార్ నియామకాన్ని చేపట్టారు. ఉన్నతాధికారులు తన తీరు మార్చుకోవాలని సూచించినా మారకపోవడం, ఐదుగురు రిజిస్ట్రార్లను నియమించడం, ఈసీ అనుమతి లేకుండా నిధులను అక్రమంగా ఖర్చు చేయడం, అవసరానికి మించి దినసరి వేతనం కింద 147 మందిని నియమించడం, వారి నుంచి డబ్బులు తీసుకోవడం తదితర వాటిపై నిగ్గుతేల్చాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు పాలక మండలి సభ్యులు లేఖ రాయడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జూన్ 6న, జూన్ 13న రెండు దఫాలుగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను సేకరించారు. వీసీ 20 నెలల కాలంలో జరిపిన లావాదేవీలు, ఎవరెవరికి బ్యాంకు నుంచి ఎంత ట్రాన్స్ఫర్ చేశారో జాబితాను తయారు చేస్తున్నారు. పూర్తిస్థాయి వివరాలు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
టీయూలో పనిచేస్తున్న 275 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది తమకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పరిపాలనా భవనం ఎదుట ఐదు రోజులుగా నిరసన చేపడుతున్నారు. మే నెలకు సంబంధించిన వేతనం 16 రోజులు గడుస్తున్నా బ్యాంకు ఖాతాలో జమకాలేదని అన్నారు. వేతనాలు చెల్లిస్తేనే విధుల్లో చేరుతామని, అప్పటి వరకు నిరసన యథావిధిగా కొనసాగుతుందని వారు స్పష్టంచేశారు.