శక్కర్నగర్, ఫిబ్రవరి 21: ప్రభుత్వ దవాఖానలకు వచ్చే రోగులకు వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ హెచ్చరించారు. మంగళవారం ఆయన బోధన్ జిల్లా ప్రభుత్వ దవాఖానాను తనిఖీ చేశారు. అన్ని విభాగాల్లో కలియదిరిగి రికార్డులను పరిశీలించారు. తాను ఇంతకుముందు ఇక్కడికి వచ్చినప్పుడు పలు సూచనలు చేసినా మార్పు కనిపించలేదని అన్నారు. ఓ వైద్యుడు స్టెతస్కోప్ లేకుండానే విధులు నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్పేషెంట్ విభాగంలో పేషెంట్ బెడ్ వద్ద కేస్షీట్ లేక పోవడంపై మండిపడ్డారు. దవాఖానలోని పలు విభాగాల్లో కనిపించిన లోపాలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపడుతుండగా, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
మందులు అందుబాటులో ఉన్నా, కొనుగోలుకు బయటికి పంపించడం సరికాదన్నారు. దవాఖానలో ప్రసవాల సంఖ్య తగ్గడం, ప్రైవేట్ దవాఖానలను ఆశ్రయించడం, స్కానింగ్ కోసం బయటికి పంపించడం, ఇన్పేషెంట్, అవుట్ పేషెంట్ రికార్డులు సరిగా నిర్వహించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రసవాల సంఖ్య ఎందుకు తగ్గుతున్నదని వైద్యాధికారులను ప్రశ్నించారు. వైద్య సేవలు అందించడంతో పాటు పలు అంశాల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందని, విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట డీఎంహెచ్వో డాక్టర్ సుదర్శనం, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ విద్య, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శివశంకర్, ప్రోగ్రామింగ్ అధికారి మల్లికార్జున్ తదితరులు ఉన్నారు.