మోర్తాడ్, డిసెంబర్ 8:గ్రామీణ ప్రాంత బాలికలు క్రీడల్లో పాల్గొనడమే అరుదు. అలాంటిది మార్షల్ ఆర్ట్స్లో ఒకటైన కరాటేలో అదుర్స్ అనిపిస్తున్నారు మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు జోగు మమత, శివాని. ప్రతిభ చూపి జిల్లాస్థాయి నుంచి అంతర్జాతీయస్థాయి వరకు అవార్డులను సాధించారు. కఠినమైన మార్షల్ఆర్ట్స్లో రాణిస్తూ ఆడపిల్లలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
అమ్మమ్మ వద్ద ఉంటూ..
మమత, శివాని అమ్మమ్మ గ్రామం ఇబ్రహీంపట్నంలోనే ఉంటూ చదువుకుంటున్నారు. అక్కడే షోటోకాన్ కరాటే అసోసియేషన్లో జగిత్యాల జిల్లా చీఫ్మాస్టర్ పసునూరి అవినాష్ వద్ద నాలుగున్నరేండ్లు కరాటేలో శిక్షణ తీసుకున్నారు. కఠినమైన సాధన చేసి జిల్లా నుంచి అంతర్జాతీయస్థాయి వరకు ఎదిగారు.
కరాటేలో ప్రతిభ..
మమత అండర్-21, శివాని అండర్-17 విభాగాల్లో 2017లో జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి ప్రథమస్థానం సాధించారు. దీంతో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. అదే ఏడాది సంగారెడ్డిలో జరిగిన రాష్ట్రస్థాయి పోట్లీల్లో బంగారు పతకాన్ని సాధించారు. 2020లో పంజాబ్లోని నేషనల్ కరాటే ఫెడరేషన్ వారు నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించారు. నేపాల్లో 2022 సెప్టెంబర్లో నిర్వహించిన అంతర్జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని మరోసారి బంగారు పతకాలు అందుకున్నారు. వీటితోపాటు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో అనేక బంగారు, వెండి పతకాలను సాధించారు.
మమత, శివానిలో మంచి ప్రతిభ ఉంది
జోగు మమత, శివాని చాలా కష్టపడతారు. వారి మంచి ప్రతిభ ఉంది. పట్టుదలతో కరాటే నేర్చుకొని అంతర్జాతీయస్థాయికి ఎదిగారు. కఠిన సాధన చేస్తే సాధించలేని ఉండదని వీరిద్దరూ నిరూపించారు. బాలికలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నా శిష్యులు అంతర్జాతీయస్థాయిలో రాణించడం గర్వంగా ఉంది.
-అవినాష్, కోచ్
బాలికలందరూ కరాటే నేర్చుకోవాలి
అన్ని రంగాల్లో మహిళలు.. పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. గ్రామీణ ప్రాంత బాలికలుసైతం క్రీడల్లో ఆసక్తి కనబర్చాలి. ఆత్మరక్షణ కోసం బాలికలందరూ కరాటేను తప్పకుండా నేర్చుకోవాలి. కరాటేతో ఆత్మైస్థెర్యం పెరుగుతుంది. కొద్దిగా కష్టపడితే ఆపద సమయాల్లో తమను తాము కాపాడుకోవచ్చు. ఇతరులకు కూడా రక్షణగా ఉండొచ్చు. కరాటే శిక్షణలో మా తల్లిదండ్రులు, గ్రామస్తులు ఎంతో సహకరించారు.
-శివాని, కరాటే క్రీడాకారిణి