శక్కర్నగర్/భీమ్గల్, జనవరి 31: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన ఓటరు జాబితా తప్పుల తడకగా మారింది. భీమ్గల్, బోధన్లో ఓటరు జాబితాలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తున్నది. పలు వార్డుల్లో ఓటర్ల జాబితాలో కొందరు పేర్లు రెండుసార్లు వచ్చాయి. అదికూడా వరుసగా సీరియల్ నంబర్గా రావడం గమనార్హం. జాబితాలో రెండుసార్లు పేరు వచ్చిన సదరు ఓటరు ఓటు హక్కును రెండుసార్లు వినియోగించుకునే అవకాశం ఉన్నది. బోధన్ మున్సిపల్ పరిధిలోని నర్సాపూర్ గ్రామం నాల్గో వార్డులో ఓటరు జాబితాలో పలువురి పేర్లు రెండుసార్లు రాగా, మృతి చెందినవారి పేర్లు కూడా సుమారు పది నుంచి పదిహేను మంది పేర్లు ఉన్నాయి. వివాహమై అత్తారింటికి వెళ్లిపోయిన వారి పేర్లు కూడా ఓటర్ల జాబితాలో ఉన్నాయి. ఏడాది క్రితమే మృతి చెందినవారి పేర్లు, అంతకుముందు మృతి చెందినవారి పేర్లు కూడా ఓటర్ల జాబితాలో ఉండడం గమనార్హం.
పక్క గ్రామాల చెందిన వ్యక్తుల పేర్లు కూడా..
బోధన్ మండలంలోని పక్క గ్రామాలకు చెందిన వ్యక్తుల పేర్లు కూడా బోధన ఓటర్ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు 4వ వార్డులో ఓటరు జాబితాల్లో సీరియల్ నంబర్ 6,7లో రెండుసార్లు సతపూర్ శివ కుమార్, సీరియల్ నంబర్ 4,5లో సతపూర్ సౌజన్య పేర్లు కనిపిస్తున్నాయి. ఒకటో వార్డులోని ఇంటి నంబర్ 1-24పై కూడా ఓ వ్యక్తికి నాల్గో వార్డులోనూ ఓటు ఉంది. ఇదే వ్యక్తి పేరు బోధన్ మండలంలోని ఏరాజ్పల్లి గ్రామంలోని ఓటర్ల జాబితాలో నమోదై ఉండడం గమనార్హం.
భీమ్గల్లో..
భీమ్గల్ మున్సిపాలిటీలో మొత్తం 14,045 మంది ఓటర్లున్నారు. ఇందులో 6,616 మంది పురుషులు కాగా, 7,429 మంది మహిళలున్నారు. పట్టణంలోని 12 వార్డులుండగా ప్రతి వార్డు జాబితాలో తప్పులు చోటు చేసుకున్నాయి. ఒకటి కాదు రెండు కాదు వందల సఖ్యలో డబుల్ ఓట్లు, చనిపోయిన వారి ఓట్లు ప్రచురితమయ్యాయి. కొన్నిచోట్ల ఓటే మూడు చోట్ల వచ్చిన దాఖలాలున్నాయి. మరో వార్డులో ఒక్క కుటుంబం ఓట్లే రెండు చోట్ల వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. ఇలా చిత్రవిచిత్ర సంఘటనలన్నీ ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్నాయి.
బీఎల్వోల తీరుపై ఆరోపణలు..
ఓటరు జాబితా రూపకల్పనలో అంతులేని నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రతి ఓటరును నిశితంగా పరిశీలించి తుది జాబితాను పక్కాగా రూపొందించాలని అధికారులు చెప్పినా క్షేత్ర స్థాయిలో అది అమలు కాలేదు. ఓటర్ల జాబితా రూప కల్పనలో బీఎల్వోలు క్షేత్ర స్థాయిలో ఎలాంటి కసరత్తు చేయకుండా కూర్చున్న చోటనే రూపొందించిన విషయం స్పష్టంగా అవగతమవుతోంది. రిజర్వేషన్లు ఖరారయి, ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడడంతో జాబితాను పరిశీలించిన అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే వార్డుల విభజనలోనూ పారదర్శత లోపించిందన్న ప్రశ్నలు ఉద్బవిస్తున్నాయి. ఇలాంటి జాబితతో ఎన్నికలకు వెళ్లే ఫలితాలు తారుమారు అయ్యే అవకాశముంటుందన్న చర్చ కూడా రాజకీయవర్గాల్లో సాగుతోంది.
గతంలో ఉన్న ఓటర్ల జాబితానే ప్రచురించాం..
ఎమ్మెల్యే ఎన్నికల ఓటర్ల జాబితాలో ఉన్న పేర్లతోనే వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను రూపొందించి విడుదల చేశాం. మార్పులు, చేర్పులతో మాకు సంబంధం లేదు. వాటిని మేము తొలగించలేం.
-జాదవ్ కృష్ణ, మున్సిపల్ కమిషనర్, బోధన్
ఆ అధికారం మాకు లేదు
ఓటర్ల జాబితాను సవరించే అధికారం మాకు లేదు. అది రాష్ట్ర ఎన్నికల సంఘానిదే. అసెంబ్లీ ఎన్నికల జాబితా ప్రకారం కేవలం వార్డుల వారీగా విభజనలు చేశాం. అంతవరకే మా పరిధి. అయినప్పటికీ సవరణల కోసం ఎన్నికల కమిషన్ సమయం కూడా ఇచ్చింది. అప్పుడు అభ్యంతరం చెబితే పరిశీలించే అవకాశం ఉండేది.
-గోపు గంగాధర్, మున్సిపల్ కమిషనర్, భీమ్గల్