డిచ్పల్లి, ఖలీల్ వాడి, జనవరి 22 : నిజామాబాద్ నగరంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో రెండురోజుల పాటు అట్టహాసంగా నిర్వహించిన ప్రాపర్టీ షో ముగిసింది. ఆదివారం రాత్రి ముగింపు కార్యక్రమానికి ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, మేయర్ నీతూ కిరణ్తోపాటు నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్ హాజరయ్యారు. ప్రాపర్టీ షోలో స్టాళ్లను పరిశీలించారు.
హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతాలకు చెందిన ప్రాపర్టీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. చదరపు అడుగుకు ఉన్న ధరలతోపాటు రుణ సదుపాయం వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిజామాబాద్ – హైదరాబాద్ మార్గంలో చేపడుతున్న పలు నిర్మాణ రంగ ప్రాజెక్టుల్లో మధ్య తరగతి వర్గాలకు అనువుగా ధరలున్నాయని అతిథులు అభిప్రాయపడ్డారు. స్టాళ్లలో ఇంటీరియల్ డెకరేషన్, ఇతరత్రా స్టాళ్లను కూడా అతిథులు పరిశీలించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
తెలంగాణలోనే రియల్ జోరు
– బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ చైర్మన్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన విధానంతో రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా పరుగులు పెడుతున్నదని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. అన్ని రంగాల్లోనూ సమాన వృద్ధితో యావత్ దేశంలోనే తెలంగాణ ముందున్నదని చెప్పారు. రియల్ రంగం జోరు అందుకోవడానికి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు, శాంతి భద్రతల పరిరక్షణతోపాటు మౌలిక సదుపాయాల కల్పన పెరగడం ముఖ్య కారణాలను చెప్పారు.
గతంలో రాష్ట్రంలో రియల్ రంగం కుదేలైన పరిస్థితి నుంచి ఇప్పుడు జోరుగా సాగుతుండడానికి సీఎం కేసీఆర్ పరిపాలన దక్షతకు నిదర్శనమని పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా రూ.40లక్షలకు తక్కువ కాకుండా ఎకరం భూమి దొరకడం లేదన్నారు. ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వ ఘనతకు చిహ్నమని చెప్పారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడం, మేజర్ గ్రామ పంచాయతీలను మండలాలుగా ఏర్పాటు చేయడంతో పరిపాలన ప్రజల చెంతకు చేరిందన్నారు. తద్వారా భూములకు డిమాండ్ కూడా పెరిగిందన్నారు. ఇండ్ల్లు కొనాలనుకునే వారంతా మొదట ఆయా కంపెనీల వివరాలను, ప్రాజెక్టు సమాచారాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతనే ముందడుగు వేయాలని సూచించారు.
రోజురోజుకూ రాష్ట్రంలో హైదరాబాద్ సహా అనేక పట్టణాలు, నగరాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని బాజిరెడ్డి గోవర్ధన్ చెప్పారు. రియల్ రంగంలో అనేక కంపెనీలు చేపడుతున్న ప్రాజెక్టును ఒక గొడుగు కిందకు తీసుకు రావడం మంచి ప్రయత్నమని కితాబునిచ్చారు. ఆటో షో, ప్రాపర్టీ షోలతో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలు చేపడుతున్న ప్రయత్నం అద్భుతమన్నారు. నగర వాసులకు ఇలాంటి కార్యక్రమాలతో దూర,వ్యయ భారం గణనీయంగా తగ్గుతుందన్నారు. హైదరాబాద్లో ఏర్పాటుచేసే ప్రదర్శనలకు దీటుగా ప్రాపర్టీ షో జరుగుతుండడం ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పారు. హైదరాబాద్లో ప్రాపర్టీలను కొనుగోలు చేయాలనుకునే వారికి ఆయా చోట్ల తిరిగి అపార్ట్మెంట్లను పరిశీలించడం కత్తిమీద సాముతో సమానమని అన్నారు.
అలాంటివి ఒకే చోట హైదరాబాద్ సహా నిజామాబాద్లోని ప్రాజెక్టుల వివరాలను ప్రాపర్టీషో ద్వారా అందించడం ద్వారా మేలు జరుగుతుందని చెప్పారు. ప్రాపర్టీ షో ముగింపులో స్టాళ్లను ఏర్పాటు చేసిన వారందరినీ ముఖ్య అతిథులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు దండు శేఖర్, మురళి, పుప్పాల రవి, నమస్తే తెలంగాణ బ్రాంచ్ మేనేజర్ గడ్డి ధర్మరాజు, ఎడిషన్ ఇన్చార్జి లక్మ రమేశ్, బ్యూరో చీఫ్ జూపల్లి రమేశ్, ఏడీవీటీ మేనేజర్ శ్రీకాంత్, ఏసీఎం సునీల్, ఆర్సీ ఇన్చార్జిలు సాగిరాజు బలరామరాజు, లోకాని గంగారాం, గూడెం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
నమస్తే తెలంగాణ చొరవ భేష్
బిగాల గణేశ్ గుప్తా, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే
సమాజ హితం, ప్రజా ప్ర యోజనం కోసం పత్రిక నడపడంతోపాటు ప్రజల కోసం సంఘ సేవలో భాగంగా ఆటోషో, ప్రాపర్టీ షోలను నిర్వహించడం అభినందనీయమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. మహానగరాలకు పరిమితమైన ప్రాపర్టీ షోలను నిజామాబాద్ నగర వాసులకు అందుబాటులోకి తీసుకురావడం మంచి పరిణామమని తెలిపారు. ఒక వేదికపై 20 స్టాళ్ల ద్వారా సౌకర్యవంతమైన ప్రాజెక్టు వివరాలు తీసుకు రావడం నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే కృషికి నిదర్శనంగా నిలుస్తోందన్నారు. వినూత్న ఆలోచనలతో సరికొత్త కార్యక్రమాలను చేపడుతున్న నమస్తే తెలంగాణకు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాల నిర్వహణకు అండగా నిలుస్తామని బిగాల పేర్కొన్నారు. గతంలో ఆటో షో వంటి కార్యక్రమాలను ఇదే వేదికగా ఘనంగా నిర్వహించడం ద్వారా నగర వాసులకు ఎంతో ప్రయోజనం కలిగించారని గుర్తుచేశారు. ఇప్పుడు ప్రాపర్టీ షో ద్వారా మరోమారు నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలు తమ సత్తా చాటాయన్నారు. ఇప్పుడు 20 స్టాళ్లతో నిర్వహించిన కార్యక్రమం భవిష్యత్తులో 60 స్టాళ్లతో నాలుగు రోజుల పాటు నిర్వహించాలని సూచించారు.
ప్రాపర్టీ షో అద్భుతం నీతూ కిరణ్, నిజామాబాద్ నగర మేయర్
ప్రాపర్టీ కొనుగోలులో చాలా మందికి అంతగా అవగాహన ఉండదని, అలాంటి వారికి ఒక గొడుగు కిందకు అనేక ప్రాజెక్టుల సమాచారాన్ని తీసుకు వచ్చి నగరవాసులకు అందించడం అద్భుతంగా ఉందని నగర మేయర్ నీతూ కిరణ్ అన్నారు. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలు తమ పనికే పరిమితం కాకుండా సమాజ కృషికి పాటుపడతుండడం గొప్ప విషయమని కితాబునిచ్చారు. గతంలో నిర్వహించిన ఆటో షో ద్వారా నగర వాసులకు లాభం జరిగిందన్నారు. ఇప్పుడు ప్రాపర్టీ షో ద్వారా నగర కీర్తి ప్రతిష్టను పెంపొందించిందని చెప్పారు.