నందిపేట్, సెప్టెంబర్ 28 : ఆర్మూర్ నియోజకవర్గానికి నిధుల వరద కొనసాగుతున్నది. ఇటీవల వచ్చిన కోట్లాది నిధులతో ఓ వైపు పనులు కొనసాగుతుండగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి నిధులు రూ.25 కోట్లు మంజూరు చేసింది. ఏడాది కాలంలో నియోజకవర్గానికి కమ్యూనిటీ హాళ్లు, బీటీ, సీసీ రోడ్లు, కల్యాణ మండపాలు, ఎత్తిపోతల పథకాల కోసం నిధులు కేటాయించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
తాజాగా మంజూరు చేసిన రూ. 25 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధిలో అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి ప్రత్యేక చొరవతో సీఎం కేసీఆర్ను ఒప్పించి భారీగా నిధులు మంజూరు చేయించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులను (జీవో నం నంబర్ 360) విడుదల చేసింది.
460 పనులు..
రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 25 కోట్ల నిధులతో మొత్తం 460 అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఆర్మూర్ పట్టణంతోపాటు నందిపేట్, ఆర్మూర్, ఆలూర్, మాక్లూర్, డొంకేశ్వర్ మండలాలకు ఈ నిధులను కేటాయించారు. వివిధ కుల సంఘాల వినతుల మేరకు ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధతో ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపి నిధులు తీసుకువచ్చారు. గతంలో ఎన్నడూ ఇంత పెద్దమొత్తంలో నిధులు మంజూరు కాలేదని నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అన్ని వర్గాలకూ ప్రాధాన్యం..
కమ్యూనిటీ భవనాల నిర్మాణంలో అన్ని వర్గాలకూ సమాన ప్రాధాన్యతను ఇస్తూ నిధులు కేటాయించనున్నారు. ఎస్టీ, ఎస్టీ, జనరల్ విభాగాలుగా త్వరలోనే పనులను ప్రారంభించనున్నారు. ఆర్మూర్ పట్టణానికి రూ. 4 కోట్లు, ఆర్మూర్ మండలానికి రూ. 4 కోట్లు, మాక్లూర్ మండలానికి రూ. 4 కోట్లు, ఆలూర్ మండలానికి రూ. 4 కోట్లు, నందిపేట్ మండలానికి రూ. 5 కోట్లు, డొంకేశ్వర్ మండలానికి రూ. 4 కోట్లు కేటాయించారు.
ఎటు చూసినా అభివృద్ధి పనులే…
సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గంలోని ఏ గ్రామంలో చూసినా అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయి. ప్రగతిలో ఆర్మూర్ అగ్రగామిగా నిలుస్తున్నది. నిరంతరం ప్రజలతో మమేకమై వారి అవసరాలు, సమస్యలను తెలసుకొని పరిష్కరిస్తున్నాం. క్షేత్రస్థాయిలో పట్టుదలతో కృషి చేయడంతోనే ఇంత అభివృద్ధి సాధ్యమయ్యింది.
-ఆశన్నగారి జీవన్రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే