మెండోరా, డిసెంబర్ 19: శ్రీరాంసాగర్ జలాశయం ఈ సీజన్లో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరదతో నిండుకుండలా మారింది. దీంతో ఎస్సారెస్పీ దిగువన కాకతీయ, సరస్వతీ, లక్ష్మి కాలువల ఆయకట్టు కింద యాసంగి పంటల సాగుకు ఢోకా లేదు. ఎస్సారెస్పీ జలకళను సంతరించుకోవడంతో కాలువల ద్వారా యాసంగి పంటలకు నీటి విడుదలను ఈ నెల 16న ప్రారంభించారు. గతేడాది ప్రాజెక్ట్ నుంచి యాసంగి, వానకాలం పంటలకు నీటివిడుదల పూర్తిస్థాయిలో చేపట్టారు. కాకతీయ కాలువ ద్వారా ఎగువ లోయర్ మానేరు డ్యాం వరకు 4,62,920ఎకరాలకు, దిగువ మానేరు కాకతీయ కాలువ ద్వారా 5,5000 ఎకరాలకు, సరస్వతీ కాలువ ద్వారా 35,735 ఎకరాలకు, వరద కాలువ ద్వారా 25,765, లక్ష్మి కాలువ ఆయకట్టులోని 25,763ఎకరాలకు, ఎస్కేప్ గేట్లతో సదర్మట్ డ్యామ్ ఆయకట్టు పరిధిలో 27,000ఎకరాలకు, గుత్ప ఎత్తిపోతల పథకంలో 38,792 ఎకరాలకు, అలీసాగర్ ఎత్తిపోతల ద్వారా 53,791ఎకరాలకు, చౌట్పల్లి హన్మంత్రెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 10,625 ఎకరాలకు, ఎస్సారెస్సీ ఎగువన ఉన్న నాగాపూర్, జలాల్పూర్, నందిపేట్ మొత్తం 10 ఎత్తిపోతలకు కలిపి 665 వేల ఎకరాలకు నీటిని విడుదల చేయగా, మొత్తం 12,61,000 ఎకరాలకు సాగర్ నీటిని వినియోగించారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువ, ఎగువ ఉన్న కాలువలు, ఎత్తిపోతల పథకాల ఆయకట్టు పంటలకు నీటి ఢోకా లేదు. ఈ సీజన్లో ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద రావడంతో జలాశయం నిండుకుండలా మారింది. 591.060 టీఎంసీల వరద రాగా 521 టీఎంసీల మిగులు జలాలను దిగువ గోదావరిలోకి విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా సోమవారం సాయంత్రానికి ప్రాజెక్ట్లో 1090.90 అడుగుల (89.917 టీఎంసీల) నీటి నిల్వ ఉంది. ఈ ఏడాది యాసంగి పంటలకు 63టీఎంసీల నీటిని కేటాయించారు. ఇందులో ఐదున్నర టీఎంసీల నీటిని మిషన్భగీరథకు వినియోగించనున్నారు. గతేడాది మాదిరిగానే పూర్తిస్థాయిలో నీటిని అందించేందుకు కాలువలు, డిస్ట్రిబ్యూటరీలను సిద్ధం చేశారు. రైతులకు సమాచారం అందించి కాకతీయ, సరస్వతీ, లక్ష్మి కాలువలకు నీటి విడుదల చేపట్టారు. యాసంగి సాగుకు నీటి విడుదల చేపట్టడంతో ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
ఎస్సారెస్పీ ఎగువ, దిగువన ఆయకట్టు కింద సాగు చేయనున్న పంటలకు గతంలో మాదిరిగానే వారబందీ ప్రకారం నీటిని విడుదల చేసే అవకాశమున్నది. ఎనిమిది రోజుల పాటు నీటి విడుదల చేపట్టి అనంతరం ఏడు రోజుల పాటు నీటి విడుదల నిలిపివేయనున్నారు. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో చేపట్టనున్న నీటి విడుదలతో పంటలకు సుమారు ఎనిమిది తడులు అందించే అవకాశం ఉన్నది.
ఎస్సారెస్పీ ఆయకట్టు కింద సాగు చేస్తున్న రైతులకు సంతోషకరమైన విషయం. యాసంగి పంటల సాగుకు ఇబ్బంది ఉం డదు. కాలువల ద్వారా నీటిని విడుదల చేయాలని విన్నవించగా సకాలంలో స్పందించిన నాయకులు, అధికారులు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు. కాకతీయ కాలువ డిస్ట్రిబ్యూటరీతో ఆయకట్టు చివరి వరకు నీరందుతున్నది. సకాలంలో నీటిని విడుదల చేస్తుండడంతో మా పంటలకు ఢోకా లేదు.
– మోహన్రెడ్డి,
కాకతీయ కాలువ ఆయకట్టు రైతు