లింగంపేట, ఫిబ్రవరి18: రైతును రాజు చేయాలని సంకల్పించిన సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న రైతు బీమా పథకం.. అన్నదాత కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నది. రైతు ప్రమాదవశాత్తు, సాధారణంగా మృతిచెందినా వారి కుటుంబాలు వీధిన పడకుండా రైతుబీమా పథకం అండగా నిలుస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం 15 ఆగస్టు 2018 సంవత్సరంలో రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. రైతులు మృతిచెందితే వారి కుటుంబాలకు రూ. 5 లక్షలు అందజేసి ఆర్థిక చేయూత అందిస్తున్నది. 18 నుంచి 50 ఏండ్ల లోపు వయస్సు గల రైతులను పథకానికి అర్హులుగా ప్రకటించింది. రైతు మృతిచెందిన వెంటనే వ్యవసాయాధికారులు బీమా కంపెనీకి సమాచారం అందించి ఆర్థిక సహాయం అందేలా చూస్తున్నారు. మండలంలోని 41 గ్రామ పంచాయతీల పరిధిలోని వివిధ గ్రామాల్లో 8,443 మంది పట్టాదారు పాస్పుస్తకాలు ఉన్న రైతులను ఐదు క్లస్టర్ల పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఏఈవోలు గుర్తించారు.
మండలంలోని వివిధ గ్రామాల్లో నాలుగు సంవత్సరాల కాలంలో 253 మంది రైతులకు 12 కోట్ల 65 లక్షల రూపాయలు చెల్లించారు. 2018-19 సంవత్సరంలో 38 మంది రైతులకు కోటీ 90 లక్షల రూపాయలు, 2019-20 సంవత్సరంలో 56 మంది రైతులకు రెండు కోట్ల 80 లక్షల రూపాయలు, 2020-21 సంవత్సరంలో 92 మంది రైతులకు నాలుగు కోట్ల 60 లక్షల రూపాయలు, 2021-22 సంవత్సరం జూలై మాసం వరకు 67 మంది రైతులకు మూడు కోట్ల 35 లక్షల రూపాయలు చెల్లించారు. రైతులు రూపాయి చెల్లించక పోయినప్పటికీ రైతు కుటుంబాల సంక్షేమాన్ని ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని బీమా డబ్బులు చెల్లిస్తున్నది.
రైతులు ప్రమాదవశాత్తు, సహజంగా మృతిచెందిన వారి కుటుంబాలకు బీమా అందిస్తున్నాము. రైతు మృతి చెందితే మరణ ధ్రువీకరణ పత్రం, పట్టదారు పాస్ పుస్తకం, ఆధార్కార్డు, నామినీ బ్యాంకు ఖాతా పత్రాలు అందించిన వెంటనే ఆన్లైన్ చేస్తున్నాము. రైతు వివరాలు ఆన్లైన్ చేసిన అనంతరం నామినీ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి.
– అనిల్కుమార్, ఏవో
నా భర్త ల్యాగల అశోక్ రోడ్డుప్రమాదంలో గాయపడి చికిత్స పొందుదూ మృతిచెందాడు. ఇంటి పెద్ద దిక్కు మరణించడంతో నా కుటుంబం వీధిన పడింది. మాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అశోక్ పేరిట వ్యవసాయ భూమి ఉండడంతో ప్రభుత్వం రైతుబీమా డబ్బులు ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నది. రూ.5 లక్షలతో వైద్యం కోసం చేసిన అప్పులు చెల్లించాను. మిగిలిన డబ్బులు పిల్లల పేరిట జమ చేశాను. – ల్యాగల కవిత, కోర్పోల్