నిజామాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పచ్చ బంగారం ధర రైతన్నలను ఆందోళనకు గురిచేస్తున్నది. దళారులు, వ్యాపారుల ఇష్టారాజ్యంతో క్వింటాలు పసుపు ధర ఊగిసలాడుతున్నది. పెట్టుబడులు పెరుగుతున్నా ధర మాత్రం అలాగే ఉం టున్నది. దీంతో పసు పు రైతుకు కష్టాలే మిగులుతున్నాయి. 9 నెలల కాలంలో పసుపును పండించిన కర్షకుడు విక్ర య సమయానికి మార్కెట్ మాయాజాలానికి బలి పశువుగా మారుతున్నాడు. నిజామాబాద్ మార్కెట్ యార్డుకు పసుపు రాక మొదలైంది. మార్కెట్ కమిటీ అధికారులు, వ్యా పారుల జిమ్మిక్కులకు రైతు నిలువునా దోపిడీకి గురవుతున్నాడు. దీనికి తోడుగా బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాటలను నమ్మి కూడా మోస పోతున్నాడు. ఎవరో ఒకరికి వచ్చిన రూ.10వేల ధరను చూపడంతో రైతులు గందరగోళంలో పడుతున్నారు. ఎంపీ తీరుతోనూ కర్షకులు నష్టపోతున్నారు. ఏటా వేలాది మంది పంటను మార్కెట్కు తీసుకువస్తే.. ఒకరిద్దరికే గరిష్ఠ ధర దక్కుతున్నది. ఈ ఏడాది పరిస్థితులు ఎలా ఉంటాయోనని పసుపు రైతు దిగులు చెందుతున్నాడు.
నిజామాబాద్ మార్కెట్ యార్డుకు పసుపు రాక మొదలైన నేపథ్యంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు జనవరి 30న అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో రైతు సంఘా లు, కమీషన్ ఏజెంట్లు, ట్రేడర్స్తోపాటు వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు పాల్గొన్నారు. అయితే, మార్కెట్ కమిటీ బాధ్యుల తీరుపై లోతుగా సమీక్ష జరుగలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతేడాది భారీ వర్షాలతో పసుపు రైతులు తీవ్రంగా నష్టాలు చవిచూశారు. పసుపు రాక ముగిసిన వెంటనే ధర ఒక్కసారిగా రూ.11వేల నుంచి రూ.12వేలకు ఎగబాకింది. ఏటా ఇలా ధరలు పెరగడంపై అధికారులు దృష్టి పెట్టడంలేదు. ధర లేనప్పుడు రైతులు పంటను దాచుకునేలా కోల్డ్ స్టోరేజీలపై చర్చనే జరుగలేదు. మార్కెటింగ్ శాఖ అధికారులు ఏమీ పట్టనట్లుగా వ్యవహరించడం గమనార్హం. పసుపు ధర భారీగా పలుకుతున్నట్లు చూపిస్తున్నా.. రైతులకు సరాసరి రూ. 5వేలే దక్కుతున్నది. కలెక్టర్ చొరవ తీసుకుంటేనే దళారులు, వ్యాపారులు, మార్కెటింగ్ శాఖ అధికారుల దోపిడీని కట్టడి చేయవచ్చని రైతులు అంటున్నారు. సమీక్షలతో ఫలితం ఉండదని, మార్కెట్ యార్డుల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని కోరుతున్నారు.
కొన్ని పార్టీల నాయకులు ఓట్ల కోసమే రైతులను వాడుకుంటున్నరు తప్పా.. మా సమస్యలను పట్టించుకుంటలేరు. పంటలకు గిట్టుబాటు ధర వస్తేనే రైతు బతుకుతడు. ఏండ్ల నుంచి మద్దతు ధర కోసం అడుగుతూనే ఉన్నాం. ఎన్నికల్లో మాత్రం హామీలు ఇస్తున్నరు. తర్వాత నాయకులు చేతుల దులుపుకొంటున్నరు. ఈ ఏడాది ఇప్పటివరకు మద్దతు ధర కల్పిస్తామని చెప్పిన వాళ్లేలేరు.
దేశంలో దాదాపు పదికి పైగా రాష్ర్టాల్లో పసుపును సాగుచేస్తున్నారు. పంట ఉత్పత్తిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. సుమారు 1.50లక్షల ఎకరాల్లో పసుపును పండిస్తున్నారు. నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, నిర్మల్, మహబూబాబాద్ జిల్లాల్లో కలిపి మొత్తం 3.30 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతున్నది. పసుపు విక్రయాల్లో నిజామాబాద్ మార్కెట్ అతి పెద్దదిగా గుర్తింపు పొందింది. మన జిల్లాలోనే దాదాపుగా 30-40వేల ఎకరాల్లో పసుపును పండిస్తున్నారు. గతంలో 12 లక్షల క్వింటాళ్ల పంట ఇక్కడికి వచ్చేది. దిగుబడులు తగ్గడం, ధర లేకపోవడంతో సాగు విస్తీర్ణాన్ని కూడా తగ్గించారు. మహారాష్ట్రలో 2.62 లక్షల టన్నులు, కర్నాటకలో 1.30 లక్షలు, తమిళనాడులో 95.57 వేలు, ఆంధ్రప్రదేశ్లో 74.69 వేలు, మధ్యప్రదేశ్లో 68.85వేలు, పశ్చిమ బెంగాల్లో 45.90వేలు, ఒడిశాలో 43.64వేలు, మిజోరంలో 29.57 వేలు, అస్సాంలో 20.88 వేల టన్నుల పసుపును ఉత్పత్తి చేస్తున్నట్లుగా స్పైసెస్ బోర్డు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఈ ఏడాది కూలీలు, ట్రాక్టర్ల కిరాయిలు, ఎరువుల ధరలు పెరడంతోపాటు పంటకు తెగుళ్లు సోకి దిగుబడిపై ప్రభావం చూపిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు దళారుల మాయాజాలంతో ధరలు పడిపోతున్నాయి. 12ఏండ్ల క్రితం నిజామాబాద్ మార్కెట్లో క్వింటా పసుపునకు రూ.15వేలు పలికిన సందర్భాలున్నాయి. కానీ, ఇప్పుడు కనీస మద్దతు ధర కూడా దక్కడంలేదు. కొందరు రైతులు ఇప్పటికీ పాత విధానంలోనే పసుపును సాగు చేస్తున్నారు. కొమ్ములను తవ్వి మార్కెట్కు తరలించే వరకు నెలరోజుల సమయం పడుతున్నది. ఎంతో జాగ్రత్త పడితే కానీ మేలురకం పంట చేతికి రాదు. ఎకరాకు సగటున 20 నుంచి 25 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తుంది. వ్యయప్రయాసాలకోర్చి పసుపును మార్కెట్కు తీసుకువస్తే.. దళారులు, వ్యాపారులు కుమ్మక్కై రైతును నిలువునా ముంచుతున్నారు