భిక్కనూరు, ఫిబ్రవరి 4: మూడు రోజులుగా స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఎలుగుబంటిని అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు బంధించి తీసుకెళ్లారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం ర్యాగట్లపల్లి, గుర్జకుంట గ్రామ శివారులోకి ఓ ఎలుగుబంటి మూడు రోజుల క్రితం వచ్చింది. చాలా మందికి కనిపించడంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు కర్రలతో కాపలా కాస్తున్నారు. శనివారం తెల్లవారుజామున మరోమారు కనిపించడంతో పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు.
గ్రామంలోని గిడ్డంగి వెనుకాల గల రాళ్లు, చెట్ల పొదల్లో నక్కిన ఎలుగుబంటిని పట్టుకునేందుకు అటవీశాఖ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. డీఎఫ్వో నిఖిత వరంగల్ అటవీశాఖ అధికారులకు సమాచారమివ్వగా రెస్క్యూ బృందం హుటాహుటిన ర్యాగట్లపల్లికి చేరుకున్నది. డాక్టర్ ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో జేసీబీ సహాయంతో రాళ్లు, ముళ్లపొదలను తొలగించారు. ఈ క్రమంలో ఎలుగుబంటి బయటికి రాగా, రైఫిల్ ద్వారా మత్తు ఇంజక్షన్ను ఇచ్చారు. కొద్దిసేపటికి ఆ భల్లూకం మత్తులోకి జారుకోగానే, వలలో బంధించి తీసుకెళ్లారు. సుమారు 10-12 ఏండ్ల వయస్సున్న ఎలుగుబంటిని పట్టుకున్నామని, దీన్ని పోచారం అభయారణ్యంలో సురక్షితంగా విడిచి పెడతామని డీఎఫ్వో నిఖిత తెలిపారు. దీంతో ర్యాగట్లపల్లి, గుర్జకుంట వాసులు ఊపిరి పీల్చుకున్నారు.