మోపాల్ మండలంలోని 250ఏండ్ల నాటి సిర్పూర్ రాచకోట పూర్వవైభవం సంతరించుకోనున్నది. ఈ చారిత్రక కట్టడానికి సరికొత్త సొబగులు అద్దేందుకు ప్రభుత్వం రూ.32 లక్షలు కేటాయించింది. త్వరలోనే దీన్ని పర్యాటక కేంద్రంగా మార్చనున్నది.
రాచరికపు ఠీవీని తెలిపే బురుజులు.. శత్రు దుర్భేద్యంగా నిలిచే ఎత్తయిన రాతిగోడలు.. యుద్ధనీతికి తగ్గట్లుగా ప్రహరీల నిర్మాణం.. ఎత్తయిన కొండపై ఎటు చూసినా పచ్చని మాగాణీలు కనిపించేలా భవనాలు.. పూర్తి వాస్తుతోపాటు సౌకర్యాలకు ఏ మాత్రం లోటు లేకుండా చూపరులను ఆకట్టుకునే గదులు.. ఇవీ సిర్పూర్లోని రాచకోట ప్రత్యేకతలు.
ఖలీల్వాడి(మోపాల్), ఫిబ్రవరి 2: నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం సిర్పూర్ గ్రామంలో చరిత్ర కలిగిన కోటకు రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో మహర్దశ రాబోతున్నది. 250ఏండ్ల నాటి చరిత్రకు పునర్జీవం పోయనున్నారు. శతాబ్దాల చరిత్రకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఈ కోటకు పూర్వవైభవం తేవాలనే ఉద్దేశంతో సర్పంచ్ ముత్యంరెడ్డి ఎమ్మెల్యే బాజిరెడ్డికి విన్నవించారు. దీంతో రూ. 32లక్షలు మంజూరు చేస్తూ కోట రూపురేఖలు మార్చి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ముందుకొచ్చారు.
సిర్పూర్ గ్రామ నడిబొడ్డులో ఎత్తయిన కొండపై ఉన్న ఈ కోటకు దాదాపు 250 ఏండ్ల నాటి ఘన చరిత్ర ఉన్నది. ఈ ప్రాంతాన్ని నిజాం ప్రభువులు పాలిస్తున్న కాలంలో ఇప్పుడున్న కోటకు సమీపంలో తంగళ్లపల్లి, సంగేమశ్వరం అనే రెండు గ్రామాలుండేవి. తమకు నచ్చిన వారికి, తమ మనసును మెప్పించిన వారికి నిజాం ప్రభువులు గ్రామాలను దత్తతగా (జాగీరు) ఇచ్చేవారు. ఈ క్రమంలోనే నిజాం ప్రభువుల వద్ద మన్ననలు పొందిన పింగళి మన్మోహన్రావు అనే బ్రాహ్మణునికి తంగళ్లపల్లి, సంగమేశ్వరం గ్రామాలను బహుమతిగా ఇచ్చారు. దీంతో ఈ ప్రాంతానికి వచ్చిన మన్మోహన్రావు తన పాలన చరిత్రలో నిలిచిపోవాలనే సంకల్పంతో అన్ని హంగులు, అన్ని రకాల సౌకర్యాలు, పేదరికానికి తావు లేకుండా సిరులతో కళకళలాడే గ్రామాన్ని నిర్మించతలపెట్టాడు. ఈ నేపథ్యంలో రెండు గ్రామాల మధ్య ఉన్న ఎత్తయిన కొండపై భారీ రాళ్లు, సున్నపురాయితో కోటను నిర్మించాడు. నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ గ్రామానికి సిర్పూర్ (సిరులతో కళకళలాడే పురం అనే అర్థం వచ్చేలా) అనే నామకరణం చేశాడు. తర్వాత కోటను కేంద్రంగా చేసుకొని అనేక సంవత్సరాలు ఆయనే పాలించాడు.
ఘనకీర్తి కలిగిన సిర్పూర్ కోట ఆదరణకు నోచుకోక ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడింది. 70 ఏండ్ల నుంచి కోట సమీపంలో ఎలాంటి కార్యకలాపాలు జరగకపోవడంతో పరిసరాలు పూర్తిగా పిచ్చిమొక్కలు, చెట్ల పొదలతో నిండిపోయింది. కోటకు ఇరువైపులా ఉన్న బురుజులు, లోపలి నిర్మాణాలు పూర్తిగా శిథిలావస్థకు చేరి కూలిపోతున్నాయి. రాజు, రాణి, కుటుంబ సభ్యులు నివసించిన గదులు ఇప్పటికే పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఇంత జరుగుతున్నా ఉమ్మడి రాష్ట్రంలో పాలించిన నాయకులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని చరిత్రకారులు చెబుతున్నారు.
సిర్పూర్ కోట విషయాన్ని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ దృష్టికి తీసుకెళ్లడంతో నిధులు మంజూరు చేశారు. రూ. 32లక్షలతో పనులు మొదలు పెట్టాలని సర్పంచ్ ముత్యంరెడ్డిని ఆదేశించారు. వారం, పది రోజుల్లో పనులు మొదలవుతున్నట్లు సర్పంచ్ చెప్పారు. ఇప్పటికే కోట పరిసరాల్లో ఉన్న పిచ్చిమొక్కలను తొలగించారు.
అడిగిన వెంటనే సిర్పూర్ కోట కోసం ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రూ.32లక్షలు మంజూరు చేశారు. పనులు మొదలు పెట్టాలని సూచించారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్కి ప్రత్యేక కృతజ్ఞతలు. గత పాలకుల నిర్లక్ష్యంతో కోటను ఎవ్వరూ పట్టించుకోలేదు. త్వరలోనే పనులు చేపడుతాం.
– ముత్యంరెడ్డి, సర్పంచ్, సిర్పూర్