ప్రతి ఇల్లూ శుద్ధిగా కనిపించే పవిత్రమైన రోజు.. ప్రతి హృదీ లయకారుడి నామాన్ని జపించే దివ్యమైన దినం.. దీక్షగా ఉపవాసం చేపట్టి భక్తిభావాన్ని చాటే పండుగ రోజు.. లింగోద్భవన ఘట్టాన్ని కనులారా వీక్షిస్తూ తన్మయత్వం పొందే అద్భుతమైన వేడుక.. నిష్టతో నిశీపూజలు చేసి ఆ బోలాశంకరుడి కటాక్షాన్ని పొందాలని భావించే భక్తలోకం ఒళ్లన్నీ కళ్లు చేసుకొని ఎదురుచూస్తున్న ముక్కంటి ఉద్భవించిన ఉత్సవం.. అదే మహాశివరాత్రి పర్వదినం! మహాశివరాత్రి వేడుకకు ఉమ్మడి జిల్లాలోని శైవాలయాలు ముస్తాబయ్యాయి. నేడు (శనివారం) మహాశివరాత్రి పర్వదినం కావడంతో ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఆలయ కమిటీలు ఏర్పాట్లు చేశాయి.
మహిమాన్వితం పుట్ట శివాలయం
డిచ్పల్లి, ఫిబ్రవరి 17 : అత్యంత మహిమన్విత ఆలయంగా పేరుగాంచింది నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం కలిగోట్ శివారులో ఉన్న పుట్ట శివాలయం. ఈ ఆలయంలోని విగ్రహం పుట్టలో నుంచి వెలిసిందని గ్రామస్తులు చెబుతుంటారు. అదేప్రాంతంలో ఆలయం నిర్మించి పూజలు చేస్తున్నారు. కోరిన కోర్కెలను స్వామివారు తప్పకుండా తీరుస్తారని భక్తుల విశ్వాసం. పిల్లలు లేనివారు ముడుపు కడితే సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ఇందుకు సాక్ష్యంగా ఆలయంలో లెక్కలేనన్ని ముడుపులు దర్శనమిస్తాయి. నూతన జంటలు ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించి స్వామివారికి పూజలు చేస్తుంటారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు పెద్దసంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటారు. ఈ సందర్భంగా ఏటా ఆలయ కమిటీ, వీడీసీ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది.
శివకేశవులకు నిలయాలు కిష్టమ్మ గుడి, విఠలేశ్వరాలయం
కామారెడ్డి, ఫిబ్రవరి 17 : కామారెడ్డి జిల్లాకేంద్రంలో రెండువేల ఏండ్ల నాటి కిష్టమ్మ గుడి, 400 ఏండ్ల నాటి విఠలేశ్వరస్వామి ఆలయాలు ఎంతో ప్రసిద్ధి పొందాయి. ఈ రెండు ఆలయాల్లోనూ శివకేశవులు దర్శనమిస్తారు. పూర్తి రాతికట్టడం, ఘనమైన శిల్పకళా వైభవం కిష్టమ్మ గుడి సొంతం. త్రిశాంతి స్తంభ మహామండప రూపం, చతురస్రాకృతితో భక్తుల నేత్రాలకు ఆనందాన్ని కలిగిస్తాయి. వేల సంవత్సరాలైనా చెక్కుచదరకుండా ఉన్న ఈ దేవాలయాల్లో ఏటా మహాశివరాత్రి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. విఠలేశ్వర ఆలయం పూర్తి రాతి కట్టడం. కాశీలో చెక్కిన శివ కేశవుల మూలవిరాట్లను రవాణా సౌకర్యం లేని 400 ఏండ్లనాడే కామారెడ్డికి తీసుకువచ్చి ఒకే ప్రాంగణంలో ప్రతిష్ఠించారు.
మహాదేవుడు.. బోధన్ చక్రేశ్వరుడు
బోధన్, ఫిబ్రవరి 17: బోధన్ పట్టణంలోని చారిత్రక శివాలయం శ్రీ చక్రేశ్వర శివమందిరం. ఈ ఆలయం మట్టి తవ్వకాల్లో బయటపడింది. 1959 ఫిబ్రవరి 7 (అమావాస్య)రోజున ఓ రైతు మట్టిదిబ్బను చదునుచేస్తుండగా… నల్లని రాతితో ప్రకాశవంతమైన శివలింగం, గర్భగుడి, పైన శిఖరంతో చెక్కు చెదరని రీతిలో బయటపడింది. బోధన్కు ఏకచక్రపురం అనే పేరు ఉండడంతో ఇక్కడి శివలింగానికి ఏకచక్రేశ్వరుడు, చక్రేశ్వరుడు అనే పేర్లు స్థిరపడ్డాయి. పాండవుల కాలంలోనే ఈ ఆలయం పూజలందుకున్నదని అంటుంటారు. దక్షిణ భారతదేశంలోని అతి పెద్ద, పేరొందిన విగ్రహాల్లో ఈ శివాలయంలోని మూల విరాట్లు కూడా ఒకటి కావడం విశేషం. శివలింగం చుట్టుకొలత రెండున్నర అడుగులు కాగా, చక్రేశ్వర శివలింగం అడుగున ఉండే పానువట్టం చుట్టుకొలత 24 అడుగులు ఉండడం గమనార్హం. త్రేతాయుగంలో రాక్షస సంహారం కోసం బయల్దేరిన పరశురాముడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని స్థల పురాణం ఉన్నది. శివలీలామృతం అనే ప్రాచీన సంస్కృత గ్రంథంలో ఈ ఆలయం గురించి చెప్పారు.
నవనాథసిద్ధులగుట్ట ..
ఆర్మూర్, ఫిబ్రవరి 17: ప్రకృతి సోయగాల తోరణం, సహజ అందాల మేళవింపుతో ఆధ్యాత్మిక క్షేత్రంగా ఆర్మూర్లోని నవనాథ సిద్ధుల గుట్ట విలసిల్లుతున్నది. త్రేతాయుగంలోని మునీశ్వరులు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేశారని చరిత్ర చెబుతున్నది. గుట్టపై ఉన్న గుహల్లో మొదట ఆరుగురు మునీశ్వరులు, తర్వాతి ముగ్గురు మునీశ్వరులు తపమాచరించి శివైక్యం పొందారని, వీరి పేరుతోనే నవనాథపురమని పేరు వచ్చిందని స్థల పురాణం పేర్కొంటున్నది. ద్వితీయ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఈ నవనాథ సిద్ధేశ్వరలింగం ఒకటి. ఈ లింగం 11వ శతాబ్దానికి చెందినదని తేలింది. సిద్ధుల గుట్టపైన రామాలయం, పవిత్రమైన కోనేరు, స్వర్ణగుండం, పాలగుండం, పాతాళగంగ, గుట్ట చివరన ఎంతో శక్తిమంతమైన హనుమాన్ మందిరం, ఏకశిలా స్తంభం, బిల్ స్టోన్, అయ్యప్ప ఆలయం, చిల్డ్రన్ పార్కు, గోశాల, దత్తాత్రేయ, దుర్గామాత, ఎల్లమ్మ తల్లి ఇలా ఎన్నో అద్భుతమైన ప్రదేశాలను ఆలయ కమిటీ సభ్యులు శివరాత్రిని పురస్కరించుకొని సర్వంగా సుందరంగా ముస్తాబు చేశారు. గుట్టపైకి వెళ్లేందుకు ఘాట్రోడ్డు ఉన్నది. మెట్ల గుండా వచ్చే భక్తులకోసం చలువపందిళ్లు ఏర్పాటు చేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ఆధ్వర్యంలో జాగారం, శివరాత్రి మరుసటి రోజు భక్తులందరికీ అన్నప్రసాద వితరణ కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు.
మహిమాన్వితుడు.. నాళేశ్వర్ రాజరాజేశ్వరుడు
నవీపేట, ఫిబ్రవరి 17: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నాళేశ్వర్ శివారులోని గోదావరి తీరాన ఉన్న శివాలయానికి వందల ఏండ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని రాజరాజచోళులు నిర్మించినట్లు చెబుతారు. గోదావరి పుణ్యస్థలంలో రుషులు తపస్సు చేస్తుండగా స్వయంభూ లింగంగా ఉద్భవించిందని పురాణ గాథలు చెబుతున్నాయి. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వనవాసంలో భాగంగా గోదావరి తీరంలో వెలసిన పుణ్యక్షేత్రంలో సాయంసంధ్యవేళలో పూజలు చేసేవాడని, ద్వాపర యుగంలో పాండవులు సైతం శివలింగాన్ని దర్శించుకున్నారని స్థల పురాణంలో ఇమిడి ఉన్నది. వీరితోపాటు జగద్గురు శంకరాచార్యులు సైతం ఈ ఆలయాన్ని దర్శించుకున్నారని శాస్ర్తాలు తెలియజేస్తున్నాయి. తెలంగాణలోని పంచరామాలయాల్లో ఈ ఆలయం ఒకటి. ఇక్కడ వెలసిన రాజరాజేశ్వర స్వామిని అన్నగా, వేములవాడ రాజన్నను తమ్ముడిగా భక్తులు భావిస్తుంటారు.
మూడు లింగాల కలయిక.. తాండూర్ త్రిలింగేశ్వరుడు
నాగిరెడ్డిపేట, ఫిబ్రవరి 17 : రామేశ్వర, భీమేశ్వర, సోమేశ్వర అనే మూడు లింగాల కలయికతో ఒకే చోట లింగాకృతిలో ఉన్న మందిరం త్రిలింగ రామేశ్వర దేవాలయం. మూడు లింగాలూ ఒకే ఆలయంలో ఉండడం ఎక్కడా కనిపించదు. నాగిరెడ్డిపేట మండలం తాండూర్ గ్రామంలోని ఈ ఆలయానికి విశిష్టమైన చరిత్ర ఉందని, సనాతన త్రిలింగేశ్వరాలయాన్ని కాకతీయుల కాలంలో నిర్మించారని పెద్దలు చెబుతారు. ఆలయం, ముఖద్వారం, ప్రధాన ద్వారం, స్వాగత తోరణాలన్నీ ఏకశిలా నిర్మాణాలే. ఈ ఆలయాన్ని ఏవైపు నుంచి చూసినా లింగాకృతిలో కనిపిస్తుంది. ఆలయంలోని నంది విగ్రహాన్ని లేపాక్షి నందితో పోలుస్తారు. ఈ మందిరాన్ని ఒకే కాలు, ఒకే చేయి ఉన్న శిల్పాచార్యుడు రూపకల్పన చేశాడని పెద్దలు చెబుతారు. ఆలయం వద్ద నిర్వహించే శివరాత్రి ఉత్సవాలకు జిల్లా వాసులతోపాటు దూరప్రాంతాలు, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.
దక్షిణ కాశీ.. బాల రాజేశుడి ఆలయం
కమ్మర్పల్లి, ఫిబ్రవరి 17 : నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం ఉప్లూర్లో స్వయంభూలింగంగా వెలసిన శ్రీ బాల రాజేశ్వరుడి ఆలయాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. ఓ రైతు పొలం దున్నుతుండగా బయటపడిన శివలింగాన్ని భక్తులు కొలవడం ప్రారంభించారని చెబుతారు. 12వ శతాబ్దంలో (ప్రతాప రుద్రుడి కాలం) స్వయంభూ లింగానికి ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర. నిర్మాణ శైలి, నల్లరాతి నిర్మాణాలు, రాతి స్తంభాలపై విరిసిన తామర పుష్ప చిహ్నం, ఒక కాలిని ముందుకు వంచి కూర్చుండే నంది విగ్రహం కాకతీయుల కాలంలో నిర్మించారనడానికి నిదర్శనం. బ్రహ్మ హత్యాపాతక విమోచన కోసం ఇంద్రుడు ఇక్కడ 40 రోజులపాటు స్వామి వారిని సేవించినట్లు ఇతిహాసాల్లో పేర్కొనబడినది. ఏటా శివరాత్రి రోజున ఉప్లూర్లో జరిగే బాల రాజేశుడి జాతరకు ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, ముంబై నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తారు.
రాముడు కొలిచిన ‘లొంక’ రామలింగేశ్వరుడు
సిరికొండ, ఫిబ్రవరి 17: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలానికి ఏడు కిలో మీటర్ల దూరంలో దట్టమైన అడవుల్లో ఉన్న లొంక రామలింగేశ్వర స్వామిని స్వయంగా శ్రీరామచంద్రుల వారే ప్రతిష్ఠించారని ప్రతీతి. వనవాస సమయంలో సీత జాడకోసం దక్షణ పథానికి వచ్చినప్పుడు ఇక్కడి ప్రకృతి రమణీయతకు ముగ్దుడై లొంకలోని సెలయేటిలో స్నానమాచరించి సైతకలింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణగాధ. ఆలయ పుష్కరిణిలో స్నానమాచరిస్తే సకలపాపాలూ పోతాయని భక్తుల నమ్మకం. పూర్వం ఓ బోయవాడు చేపలు పట్టడాని వల వేసి శిలగా మారడని ఇక్కడ కోనేరు పవిత్రత గురించి ప్రచారంలో ఉన్నది. కోనేటి బండపై వల వేసినట్లు ఉన్న బోయవాని చిత్రం ఇందుకు బలం చేకూరుస్తుంది. ఆలయం సమీపంలోని ఓ గుండ్రని అల్లుబండపై భక్తులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.
కోర్కెలు తీర్చే పడిలేచిన మర్రిచెట్టు
ముప్కాల్, ఫిబ్రవరి 17 : నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలకేంద్రంలోని శ్రీ మహా శివ లిగేశ్వర మందిరం.. పడిలేచిన మర్రిచెట్టు ఆలయంగా ప్రసిద్ధి గాంచింది. సుమారు రెండు వందల ఏండ్ల నాటి మర్రిచెట్టు 18 ఏండ్ల క్రితం 2005, జనవరి 28న ఈదురుగాలులకు నెలకొరిగింది. 33 అడుగుల విస్తీర్ణంతో ఉన్న ఈ వృక్షరాజం.. కూకటివేళ్లతో నేలవాలింది. ఓ కట్టెల వ్యపారి చెట్టుకొమ్మలను నరికేశాక మోడును కోయడం తనవల్ల కాకపోవడంతో వదిలి వెళ్లిపోయాడు. అదే ఏడాది జోరుగా కురుస్తున్న వర్షాలకు చెట్టు వేళ్లు మెళ్లిమెళ్లిగా బలం పుంజుకున్నాయి. జూన్ 24న మానవ ప్రమేయం లేకుండా యథాస్థానంలో లేచి నిలబడిందని గ్రామస్తులు చెబుతారు. అప్పటి నుంచి పడిలేచిన మర్రిచెట్టు ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. ఈ ఆలయాన్ని తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల భక్తులు సైతం పెద్ద సంఖ్యలో వచ్చి దర్శించుకుంటారు. మహా శివరాత్రిని పురస్కరించుకొని గ్రామస్తుల ఏటా శివదీక్షలు చేపడుతారు.
భక్తుల కొంగుబంగారం.. భీమేశ్వరాలయం
తాడ్వాయి, ఫిబ్రవరి 17 : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంతాయిపేట శివారులో ఉన్న భీమేశ్వరాలయం భక్తుల కొంగు బంగారంగా వెలుగొందుతున్నది. నిత్యం పూజలందుకునే స్వామివారిని మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబు చేశారు. భక్తుల జాగరణ కోసం అలయకమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు.
‘మహా’ వేడుకకు ఇందూరు ఆలయాల ముస్తాబు
ఖలీల్వాడి, ఫిబ్రవరి 17: ఇందూరు కంఠాభరణంగా బాసిల్లుతున్న నీలకంఠేశ్వరాలయం, అతి పురాతన శంభునిగుడితోపాటు ఉమామహేశ్వరాలయం, మనో కామేశ్వరాలయం, నగరేశ్వరాలయం మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబయ్యాయి. ఉదయం 4 గంటల నుంచే అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు చేసేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తారు. ఈ మేరకు ఆలయ కమిటీలు అన్ని ఏర్పాట్లు చేశాయి.