సిరికొండ, డిసెంబర్ 11 : మండలంలో పదోతరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలల మండల స్థాయి అధికారులు, ఉపాధ్యాయులు దృష్టి సారించారు. వార్షిక పరీక్షల్లో మంచి గ్రేడ్ సాధించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. సిరికొండ మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలు 11 ఉన్నాయి. వీటిలో 268 మంది పదో తరగతి చదువుకుంటున్నారు. అన్ని పాఠశాలల్లో విద్యాశాఖ రూపొందించిన ప్రణాళికను పక్కాగా అమలుచేస్తున్నారు. ఉదయం పాఠశాల ప్రారంభానికి ముందు, తర్వాత ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.
సాయంత్రం బోధించిన అంశాలపై మరుసటి రోజు ఉదయం పరీక్ష నిర్వహిస్తున్నారు. ఉదయం 8.30 నుంచి 9. 30 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రత్యేక తరగతులు, స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. అన్ని సబ్జెక్టులపై పాఠ్యాంశాల వారీగా ప్రత్యేక సాధన చేయిస్తున్నారు. పాఠ్యాంశాల్లో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడం, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.
ఎప్పటికప్పుడు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి అందుకు అనుగుణంగా బోధన చేస్తున్నారు. విద్యార్థులు ఉదయమే పాఠశాలకు రావాల్సి ఉండడంతో అల్పాహారం తినకుండా వస్తున్నారని, ఆకలితో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ప్రత్యేక తరగతుల సమయంలో విద్యార్థులకు అల్పాహారం అందిస్తే విద్యార్థులు మరింత ఉత్సాహంగా చదువుకుంటారని, దాతలు ముందుకు రావాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు కోరుతున్నారు.
ప్రత్యేక తరగతులు నిర్వహించడం ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. పాఠాల్లో ఏమైనా డౌట్లు వస్తే ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకుంటున్నాం. ప్రతి రోజూ ఒక్కో సబ్జెక్ట్లోని ఒక్కో పాఠాన్ని బాగా చదువుతున్నాం. స్లిప్ టెస్టులు పెడుతున్నారు. మార్కులు తక్కువగా వచ్చిన వారికి సార్లు ప్రత్యేకంగా పాఠం చెబుతున్నారు.
-నాగపూర్ రోహిత్,పదో తరగతి, విద్యార్థి
పదో తరగతిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా వారిని తీర్చిదిద్దుతున్నాం. అత్యధిక విద్యార్థులు 10 జీపీఏ సాధించాలన్న ప్రధాన ఉద్దేశంతో ప్రత్యేక తరగతులను ప్రారంభించాం. విద్యార్థులు ప్రత్యేక తరగతులను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం.
-ఎం.జవహర్లాల్, చీమన్పల్లి పాఠశాల హెచ్ఎం
పదో తరగతిలో విద్యార్థులు వందశాతం ఫలితాలు సాధించడమే మా లక్ష్యం. అందుకు అనుగుణంగా ప్రణాళికను సిద్ధం చేశారు. మెరుగైన ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వార్షిక పరీక్షలకు విద్యార్థులను అన్ని విధాలా సిద్ధం చేస్తున్నాం.
– శ్రీనివాస్, సిరికొండ ఇన్చార్జి ఎంఈవో