ఖలీల్వాడి, డిసెంబర్ 1 : జిల్లా కేంద్రంలో పీడీఎస్యూ రాష్ట్ర 22వ మహాసభలను గురువారం నిర్వహించారు. రాజీవ్గాంధీ ఆడిటోరియం నుంచి పాత కలెక్టరేట్ మైదానం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీఎస్ఏ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా భగత్సింగ్ మేనల్లుడు ప్రొఫెసర్ జగన్మోహన్సింగ్ హాజరై మాట్లాడారు. దేశంలో హిందూ ఫాసిజాన్ని వ్యతిరేకించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. మోదీ, అమిత్షా దేశ ప్రజలను మతం ప్రాతిపదికన దేశభక్తి ముసుగులో విడదీస్తున్నారన్నారు.
దేశంలో ఆకలి, అసమానతలు, పేదరికం, నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిపోయిందని, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తున్నదని మండిపడ్డారు. జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ పోరాట స్ఫూర్తితో ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. ర్యాలీలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన అటవీ సంరక్షణ నియమాలను వ్యతిరేకిస్తూ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కళాకారులు ప్రదర్శించిన కళా రూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జార్జిరెడ్డి పాటపై బాల పీడీఎస్యూ బృందం వేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మహాసభకు పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు జూపాక శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.మహేశ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ శ్రీకాంత్, కిరణ్, జేఎల్.శ్రీకాంత్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గౌతమ్కుమార్, జన్నారపు రాజేశ్వర్, సహాయ కార్యదర్శులు తిరుపతి, రెడ్డి చరణ్, మస్తాన్, రాష్ట్ర నాయకులు వేణు, సంతోష్, శ్రీనివాస్, సాయి, కృష్ణ, రాజేశ్ పాల్గొన్నారు.